ప్రస్తుతం సోలార్ ఎనర్జీ వినియోగం భారీగా పెరుగుతోంది. ఒక్క భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సోలార్ వినియోగించే వారి సంఖ్య పెరుగుతోంది. మన పొరుగు దేశమైన పాకిస్థాన్లో కూడా సోలార్ విప్లవం పెరుగుతోంది.
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) తో ఒప్పందం సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వం విద్యుత్ ధరలను పెంచింది. దాంతో ప్రజలు పెద్ద ఎత్తున సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. 2021లో పాకిస్తాన్లో సోలార్ నుంచి వచ్చే విద్యుత్ కేవలం 4% ఉండగా, 2023 నాటికి ఇది 14% కు చేరింది. ఇది చైనా కన్నా రెండింతలు ఎక్కువగా ఉంది. సోలార్ ఇప్పుడు పాకిస్తాన్లో మూడవ అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తిగా మారింది.
మధ్యతరగతి ప్రజలకు మాత్రం లాభం శూన్యం
కానీ ఈ సోలార్ విప్లవంలో నగరాల్లో నివసించే మధ్యతరగతి ప్రజలు భాగం కాలేకపోతున్నారు. అపార్ట్మెంట్ల పైకప్పులు వాడకానికి లేకపోవడం, ఇంటి యజమానులు సోలార్ పెట్టడంలో ఆసక్తి చూపకపోవడం వల్ల, వీరు ఇంకా గ్రీడ్పైనే ఆధారపడుతున్నారు.
ధనికులు సోలార్ వాడితే, ఇతరులపై భారం పెరుగుతోంది
ధనికులు గ్రీడ్ను వదిలేసి సోలార్వైపు మళ్లిపోవడంతో, విద్యుత్ కంపెనీలకు వచ్చే ఆదాయం తగ్గిపోయింది. దాంతో, మిగిలిన వినియోగదారులపై విద్యుత్ చార్జీలు పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో సహజంగానే విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి.
2023-24 ఆర్థిక సంవత్సరంలో 200 బిలియన్ రూపాయల ఫిక్స్డ్ ఖర్చులు నాన్-సోలార్ వినియోగదారులపై పడిపోయాయి. దాంతో, వారు ప్రతి యూనిట్కి 6.3% ఎక్కువ చెల్లించాల్సి వచ్చింది.
గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ విప్లవం
గ్రామీణ పాకిస్తాన్లో ప్రజలు చిన్న చిన్న సోలార్ సెటప్లు ఏర్పాటు చేసుకుంటూ తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. వీరి విద్యుత్ వినియోగం తక్కువగా ఉండడంతో, వీరికి ఇది పెద్ద సహాయంగా మారింది.
పాకిస్తాన్లో చాలామంది సోలార్ వినియోగదారులు తమ ఉత్పత్తి చేసిన విద్యుత్ను గ్రీడ్కి విక్రయించడంలేదు. కారణం, కనెక్షన్ కోసం 3 నుంచి 9 నెలలు పడుతుండటం.
పంజాబ్లో ఉన్న ఇంటర్లూప్ కంపెనీ తమ పశువుల షెడ్ల దగ్గర సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసింది. వీరు 3–4 ఏళ్లలోనే తమ పెట్టుబడిని తిరిగి సంపాదిస్తున్నారు. సోలార్ వల్ల తమ ఖర్చులు గ్రీడ్ కంటే 75% తక్కువగా ఉంటున్నాయి.
మొత్తం మీద చెప్పాలంటే పాకిస్తాన్లో సోలార్ ఎనర్జీ వేగంగా పెరుగుతోంది. కానీ ఇది విద్యుత్ అసమానతలు తీసుకొస్తోంది. ధనికులు లాభపడుతున్నారు, మధ్యతరగతి ప్రజలు, అద్దె ఇంట్లో ఉండేవారు మాత్రం భారాన్ని మోయాల్సి వస్తోంది.