ఆపరేషన్ సిందూర్లో బీఎస్ఎఫ్ ధైర్య సాహసం, పాక్ 72 పోస్టులు, 47 వ్యూహాత్మక ప్రాంతాలపై దాడులు, ‘విధ్వంసక్’ ప్రధాన పాత్ర పోషించింది.
జమ్మూ సరిహద్దుల్లో ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ బీఎస్ఎఫ్ పరాక్రమాన్ని మరోసారి చాటిచెప్పింది. పాకిస్థాన్ వైపు నుంచి పెరుగుతున్న దాడుల నేపథ్యంలో, భారత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సన్నద్ధంగా ముందంజ వేసింది. ఈ ఆపరేషన్ లో భాగంగా పాకిస్థాన్కు చెందిన 72 పోస్టులు, 47 కీలక వ్యూహాత్మక ప్రాంతాలను నాశనం చేసినట్టు అధికారులు వెల్లడించారు.
పాక్ నుంచి చొరబాటు ప్రయత్నాలు పెరిగిన నేపథ్యంలో, బీఎస్ఎఫ్ అప్రమత్తంగా చర్యలు తీసుకుంటోంది. డ్రోన్లు, క్షిపణుల రూపంలో వస్తున్న దాడులను సమర్థంగా తిప్పికొడుతూ, శత్రుపక్ష స్థావరాలపై కౌంటర్ అటాక్ కొనసాగుతోంది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన ఆయుధాల్లో ‘విధ్వంసక్’ అనే యాంటీ మెటీరియల్ రైఫిల్ ప్రాధాన్యత పొందింది.
దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ ‘విధ్వంసక్’ రైఫిల్ 1300 నుంచి 1800 మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సమర్థంగా ఛేదించగలదు. ఒక్కో మ్యాగజైన్లో మూడు రౌండ్లు ఉండే ఈ రైఫిల్తో బంకర్లు, ట్యాంకర్లు, బుల్లెట్ప్రూఫ్ వాహనాలపై దాడులు జరిపే అవకాశం ఉంది. బీఎస్ఎఫ్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఆపరేషన్ సిందూర్లో ఈ రైఫిల్ ఉపయోగించి అనేక కీలక లక్ష్యాలను ధ్వంసం చేశారు.
అలాగే, మరో శక్తివంతమైన ఆయుధం అయిన మీడియం మెషిన్ గన్ గురించి కూడా వివరించారు. ఇది 12.7 ఎంఎం యాంటీ-ఎయిర్క్రాఫ్ట్ సామర్థ్యం కలిగి ఉండగా, నిమిషానికి 650 నుంచి 1000 రౌండ్ల వరకు కాల్పులు జరుపగలదు. దీన్ని ఆపరేట్ చేయడానికి ముగ్గురు సిబ్బంది అవసరం. ఇది ప్రయోగించిన గ్రెనేడ్లు దాదాపు 10 మీటర్ల పరిధిలో తీవ్ర నాశనం కలిగించగలవని అధికారులు తెలిపారు.
ఇటీవల పాక్ ఆబ్జర్వేషన్ ఔట్పోస్టులపై జరిగిన దాడుల్లో ఈ ఆయుధాలే కీలకంగా పనిచేశాయని, వాటి ప్రభావంతో పాకిస్థాన్ సైనికులు వెనక్కి తగ్గారనే విషయాన్ని బీఎస్ఎఫ్ స్పష్టం చేసింది. ఇదే సమయంలో, భవిష్యత్తులో కూడా పాక్ నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనడానికి ఈ తరహా ఆధునిక ఆయుధాలు కీలకంగా మారతాయని చెప్పకనే చెప్పింది.