నలుగురు ఎమ్మెల్యేలను లాక్కునేందుకు బీజేపీ 20 కోట్లు ఆఫర్ చేసింది - ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణ
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలో నుంచి పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు డబ్బులు ఆఫర్ చేయడంతో పాటు సీబీఐ, ఈడీ కేసులతో బెదిరింపులకు పాల్పడుతోందని అన్నారు.
ఢిల్లీలో కొత్త ఎక్సైజ్ పాలసీ స్కామ్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య విమర్శలు, ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు పార్టీల నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా బీజేపీపై ఆప్ సంచలన ఆరోపణలు చేసింది. ఢిల్లీలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కాషాయపార్టీ ప్రయత్నించిందని ఆరోపించింది. ఆప్ ను విచ్చిన్నం చేయడానికి చూస్తోందని పేర్కొంది.
కాంగ్రెస్ కొత్త బాస్ ఎన్నిక అప్పుడే.. సోనియా గాంధీ అధ్యక్షతన 28న సీడబ్ల్యూసీ సమావేశం
ఈ మేరకు ఆప్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, నలుగురు ఎమ్మెల్యేలు సోమనాథ్ భారతి, సంజీవ్ ఝా, కుల్దీప్, అజయ్ దత్లతో కలిసి బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పార్టీ మారకుంటే సీబీఐ, ఈడీ, తప్పుడు కేసులు పెడతామని తమకు బీజేపీ నుంచి బెదిరింపులు వచ్చాయని ఆరోపించారు. పార్టీ మారితే ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఇస్తామని, అలాగే తమతో పాటు మరి కొందరిని తీసుకువస్తే రూ.25 కోట్లు ఇస్తామని ఆఫర్ వచ్చిందని అన్నారు.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై చేసిన ప్రయత్నం ఢిల్లీ ఎమ్మెల్యేలపై మొదలైందని ఆరోపించారు. ఢిల్లీ ఎమ్మెల్యేలపై విరుచుకుపడే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. డబ్బులిచ్చి ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.
అనంతరం ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతీ మాట్లాడుతూ.. అధికారం, డబ్బును దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఎలా విచ్ఛిన్నం చేస్తారని ప్రశ్నించారు. దీనికి ఒక ఉదాహరణ చెబుతానని అన్నారు. ‘‘ నా మిత్రులైన బీజేపీ జాతీయ స్థాయి నేతల ద్వారా నాతో ఓ ప్రయత్నం జరిగింది. మీ కోసం రూ.20 కోట్లు సిద్ధంగా ఉన్నాయిని చెప్పారు. మీరు ఇప్పుడు చెబితే అది అప్పుడు మీకు చేరుతుందని అన్నారు. మీరు ఇతర ఎమ్మెల్యేలను తీసుకువస్తే మీ రేటు 25 కోట్లు... తీసుకొచ్చ వారికి వారికి 20 కోట్లు ఇస్తామని అన్నారు.’’ అని వారు తెలిపారు. పార్టీ మారాలని, లేకపోతే మనీష్ సిసోడియా మాదిరిగా ఇడీ-సీబీఐ కేసులు పెడుతామని బెదిరింపులు వచ్చాయని సోమనాథ్ భారతి ఆరోపించారు. మనీష్ సిసోడియా కేసు ఫేక్ అని తాను చెప్పానని అన్నారు.
బీహార్ ఫ్లోర్ టెస్ట్కు ముందే స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా రాజీనామా..
మరో ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమ ఢిల్లీకి చెందిన పెద్ద నాయకులు ఢిల్లీ నుంచే ఆప్ పార్టీ అంతం కాబోతోందని అన్నారని చెప్పారు. బీజేపీలో చేరితే రూ.20 కోట్లు ఇస్తామని చెప్పారని అన్నారు. అయితే తామము హార్డ్ కోర్ ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తులమని, తాము పార్టీకి ద్రోహం చేయలేమని ఆయన తెలిపారు. ఇంకో ఎమ్మెల్యే అజయ్ దత్తా మాట్లాడుతూ.. ఓ గతంలో ఎంపీగా ఉన్న ఓ రాష్ట్రానికి చెందిన నాయకుడు ఢిల్లీ ప్రభుత్వం పతనం కాబోతోందని, చాలా మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పారని అన్నారు. బీజేపీ చాలా శక్తివంతమైనదని, పార్టీ సత్తా ఏంటో అర్థం చేసుకోవాలని అన్నారని తెలిపారు. లేదంటే నష్టపోవాల్సి ఉంటుందని తెలిపారని అన్నారు. బీజేపీలోకి చేరాలని లేకపోతే సీబీఐ కేసుల్లో ఇరికిస్తామని చెప్పారని ఆరోపించారు. తాము డబ్బులకు అమ్ముడుపోయే వాళ్లం కాదని, పార్టీకి, ప్రజలకు ద్రోహం చేయబోమని స్పష్టంగా చెప్పామని అన్నారు.