Assembly Elections: దేశంలో మ‌రోసారి ఎన్నిక‌ల న‌గారా మోగ‌నుంది. భారత ఎన్నికల కమిషన్ (ECI) త్వ‌ర‌లోనే 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

భారత ఎన్నికల కమిషన్ (ECI) త్వ‌ర‌లోనే పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళతోపాటు పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి మధ్యలో ప్రకటించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఐదు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఎన్నికల తేదీలను ఒకేసారి ప్రకటించే అవకాశం ఉంది. అయితే పోలింగ్ మాత్రం ఆయా రాష్ట్రాల్లో భిన్న దశల్లో నిర్వహించే అవకాశం ఉంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మే–జూన్‌లో అసెంబ్లీల పదవీకాలం ముగింపు:

ఈ ఐదు అసెంబ్లీల పదవీకాలం మే, జూన్ నెలల్లో ముగియనుంది. పుదుచ్చేరి అసెంబ్లీ గడువు జూన్ 15తో ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు మే 7తో ముగియనుంది. తమిళనాడు అసెంబ్లీ గడువు మే 10తో ముగుస్తుంది. అస్సాం అసెంబ్లీ గడువు మే 20తో ముగియనుంది. కేరళ అసెంబ్లీ గడువు మే 23తో ముగియనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది దశల్లో పోలింగ్ జరిగింది. అస్సాంలో రెండు దశల్లో, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒక్క దశలోనే ఎన్నికలు నిర్వహించారు.

ఎన్నికల సన్నాహాలు పూర్తి దశలో

ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. పోలింగ్‌కు సిద్ధతను సమీక్షించేందుకు అధికార బృందాలు ఆయా రాష్ట్రాలను సందర్శిస్తున్నాయి. ప్రస్తుతం ఒక బృందం అస్సాంలో పర్యటిస్తూ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తోంది. ఎన్నికల కోసం ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ కూడా పూర్తవుతోంది. పుదుచ్చేరి ఫిబ్రవరి 14న తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. తమిళనాడు ఫిబ్రవరి 18న (మంగళవారం) తుది జాబితా విడుదల చేయనుంది. కేరళ ఫిబ్రవరి 21న తుది జాబితాను ప్రకటించనుంది. పశ్చిమ బెంగాల్ ఫిబ్రవరి 28న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తుంది. అస్సాంలో ప్రత్యేక సవరణ అనంతరం ఫిబ్రవరి 10న తుది జాబితా ప్రకటించారు. ఇలా ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాల్లో ఏర్పాట్లు వేగవంతం చేస్తూ, సమయానికి ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది.