Asianet News TeluguAsianet News Telugu

రాజస్తాన్‌లోనూ ఎంఐఎం పాగా.. పార్టీ యూనిట్ సన్నాహకాల్లో ఓవైసీ

ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక ప్రకటన చేశారు. రాజస్తాన్‌లోనూ తమ పార్టీ యూనిట్‌ను త్వరలో ప్రారంభించనున్నట్టు వివరించారు. 2023లో జరగనున్న రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని తెలిపారు. పార్టీ యూనిట్ ప్రారంభించిన తర్వాతే స్థానిక పార్టీలతో పొత్తుపై ఆలోచిస్తామని వివరించారు.
 

AIMIM to launch new unit in rajasthan says asaduddin owaisi
Author
Jaipur, First Published Nov 16, 2021, 3:04 PM IST

జైపూర్: తెలంగాణకు చెందిన ఏఐఎంఐఎం పార్టీ క్రమంగా ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరిస్తున్నది. త్వరలో రాజస్తాన్‌లోనూ పాగా వేయనుంది. ఇప్పటికే రాజస్తాన్‌లో ఎంఐఎం పార్టీ యూనిట్ ప్రారంభించే సన్నాహకాల్లో పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఉన్నారు. వచ్చే రెండు నెలల్లో రాజస్తాన్‌ యూనిట్‌ను ప్రారంభిస్తామని అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అంతేకాదు, 2023లో జరగనున్న రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయనున్నట్టు వెల్లడించారు.

అయితే, ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. రాజస్తాన్‌కు చెందిన బాధ్యతాయుతమైన వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతామని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఆ తర్వాతే పార్టీ యూనిట్ ప్రారంభిస్తామని వివరించారు. ఒక్కసారి తమ పార్టీ యూనిట్ ఇకడ ప్రారంభం కాగానే ఎన్నికల్లో పాల్గొనడమే తరువాయి అని చెప్పారు. తమ పార్టీ యూనిట్ ముస్లింలు, దళితులపై ప్రధానంగా ఫోకస్ పెడుతుందని అన్నారు. దేశాన్ని బలోపేతం చేయడానికి స్వతంత్ర ముస్లిం నాయకత్వాన్ని సృష్టించాల్సి ఉన్నదని వివరించారు. అందుకే తాము ముస్లిం, దళితులపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని చెప్పారు.

 Also Read: జిన్నా కామెంట్‌పై ఒవైసీ రియాక్షన్.. ‘భారత ముస్లింలకు సంబంధం లేదు’
ముస్లిం మైనారిటీల గళం వినిపించడానికి, వారికి ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసి వివరించారు. ఆయన ఇటీవలే రాజస్తాన్ వెళ్లారు. తాజాగా మరోసారి జైపూర్‌ చేరారు. కాగా, పార్టీ పొత్తులపై ఇప్పుడు వ్యాఖ్యలు చేయాలనుకోవడం లేదు. ప్రస్తుతం తమ దృష్టి రాజస్తాన్‌లో యూనిట్ ప్రారంభించడమే అని, ఆ తర్వాత ఇతర రాజకీయ పార్టీలతో పొత్తుపై యోచిస్తామని వివరించారు. పార్టీ యూనిట్ ప్రారంభించడానికి ముందే పొత్తులు, కూటములపై మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు. తర్వాతి దశలో దానిపై ఆలోచనలు చేస్తామని చెప్పారు. దానికి ముందు రాజస్తాన్‌లో ఎంఐఎం పార్టీ యూనిట్ ప్రారంభిస్తామని వివరించారు. 200 స్థానాలు ఉన్న రాజస్తాన్ అసెంబ్లీకి 2023లో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంఐఎం పార్టీ పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ కూటమిలో  చేరింది. అంతేకాదు, కింగ్ మేకర్ కావాలనే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ దక్షిణాది పార్టీ.. త్వరలో ఉత్తరాది భారతంలో సత్తా చాటడానికి సిద్ధమవుతున్నది.

త్వరలో ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో..  అసదుద్దీన్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

Also Read: సావర్కర్‌పై రచ్చ.. బీజేపీ ఆయనను జాతిపితగా ప్రకటిస్తుంది.. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఒవైసీ మండిపాటు

ఈ నేపథ్యంలో.. ఆయన సంచలన ఆరోపణలు చేశారు.  అఖిలేష్ యాదవ్, మాయావతి కారణంగానే... మెదీ రెండోసారి కూడా ప్రధాని అయ్యారని ఆయన పేర్కొన్నారు. కాగా.. యూపీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయడం వల్ల.. బీజేపీ అభ్యర్థుల ఓట్లు పాడౌతున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. దానికి కూడా అసదుద్దీన్ కౌంటర్ ఇచ్చారు.

తమ పార్టీ ఓట్లు చీల్చితే..గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఎలా గెలిచారని ప్రశ్నించారు. "2014 మరియు 2019 లో వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ముస్లింల ఓట్లతో బిజెపి గెలవలేదు, ఎందుకంటే రెండు పోల్స్‌లో కేవలం ఆరు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి" అని ఓవైసీ పేర్కొన్నారు.

ముస్లింల ప్రయోజనాలను కాపాడటం కోసం తమ పార్టీ దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేస్తోందని, 2019 ఎన్నికల్లో హైదరాబాద్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ బీహార్‌లోని కిషన్‌గంజ్‌లోని మూడు లోక్‌సభ స్థానాల్లో తమ విజయాన్ని తమ పార్టీ సూచించిందని ఆయన పేర్కొన్నారు.

"మోడీ , అమిత్ షా  కాషాయ పార్టీకి మద్దతు ఇవ్వడానికి అనేక పర్యటనలు చేసినప్పటికీ మేము హైదరాబాద్‌లో బిజెపిని ఓడించాము" అని అసదుద్దీన్ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios