బలమైన నాయకుడు లేకపోతే ప్రతీ సిటీలో అఫ్తాబ్ పుడతాడు - అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ
2024 లో మరో సారి కూడా నరేంద్ర మోడీ ప్రధాని కావాలని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. దేశంలో బలమైన నాయకుడు లేకపోతే ప్రతీ సిటీలో అఫ్తాబ్ జన్మిస్తాడని చెప్పారు.
దేశం మొత్తం సంచలనం రేకెత్తించిన 26 ఏళ్ల శ్రద్ధా వాకర్ దారుణ హత్య గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావనకు వచ్చింది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కచ్ లో జరిగిన ఒక ర్యాలీలో మాట్లాడుతూ.. దేశంలో బలమైన నాయకుడు లేకపోతే, అఫ్తాబ్ (అమీన్ పూనావాలా) లాంటి వ్యక్తులు ప్రతీ నగరంలో జన్మిస్తారని అన్నారు. ఇలా జరిగితే మనం సమాజాన్ని రక్షించుకోలేమని చెప్పారు.
ఐదేళ్ల బాలుడిపై లైంగికదాడి, హత్య.. నిందితుడికి మరణశిక్ష..
ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ పని తీరును కొనియాడారు. మోడీకి మూడో సారి ప్రధాని పదవి ఇవ్వాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో జరిగిన హత్య కేసు భయంకరమైన వివరాలను వెల్లడించారు. ఈ ఘటనను ఆయన ‘‘లవ్ జీహాద్’’ అంటూ అభివర్ణించారు.
‘‘ అఫ్తాబ్ ముంబై నుంచి శ్రద్ధా బెహెన్ (సోదరి)ని తీసుకువచ్చి లవ్ జిహాద్ పేరుతో 35 ముక్కలుగా నరికివేశాడు. అతడు ఆమె డెడ్ బాడీని మెహ్రౌలీలోని తన నివాసంలో దాదాపు మూడు వారాల పాటు 300 లీటర్ల ఫ్రిజ్లో ఉంచాడు. అర్ధరాత్రి దాటిన కొన్ని రోజులుగా వాటిని నగరం అంతటా పారేస్తున్నారు. డెడ్ బాడీ ఫ్రిజ్ లో ఉంచగానే మరో మహిళను ఇంటికి తీసుకువచ్చి ఆమెతో డేటింగ్ చేయడం ప్రారంభించాడు ’’ అని హిమంత బిశ్వ శర్మ అన్నారు. ‘‘దేశానికి ఒక శక్తివంతమైన నాయకుడు లేకపోతే, దేశాన్ని వారి తల్లిగా భావించే వ్యక్తి లేకపోతే అఫ్తాబ్ లాంటి వ్యక్తి ప్రతి నగరంలో పుడతాడు. ఇలా జరిగితే మన సమాజాన్ని మనం రక్షించలేము’’ అని శర్మ అన్నారు. 2024లో నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిని చేయడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు.
కాగా.. హిమంత్ బిశ్వ శర్మ గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ తరుఫున స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు మూడు ఎన్నికల ర్యాలీలలో ప్రసంగించారు. పారిశ్రామికంగా ముఖ్య పట్టణంగా ఉన్న సూరత్ లో కూడా ఆయన ఎన్నికల ర్యాలీలో కూడా పాల్గొన్నారు. పార్టీకి భారీ విజయాన్ని అందించాలని కార్యకర్తలను కోరారు. ఈ సందర్భంగా ఆయన వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో శనివారం మాట్లాడారు. గుజరాత్ ఎన్నికలు ఎప్పుడూ దేశానికి దారి చూపుతాయని చెప్పారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు 2022లో వచ్చిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు చాలా ముఖ్యమైనవని తెలిపారు.
గుజరాత్ ఎన్ని కలు రాబోయే లోక్ సభ ఎన్నికల్లో భారీ ప్రభావాన్నిచూపుతాయని హిమంత్ బిశ్వ శర్మ అన్నారు. గెలుపు జాబితాలో బీజేపీ అగ్ర స్థానంలో ఉంటుందని, ఇతర పార్టీలు కేవలం రెండు, మూడు స్థానాలకు మాత్రమే పోటీ పడతాయని తెలిపారు. కాగా.. గుజరాత్ బీజేపీ చాలా కాలంగా కంచుకోటగా ఉంది. ఏడోసారి కూడా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.