తీహార్ జైలులో సత్యేంద్ర జైన్ కు వీఐపీ ట్రీట్మెంట్ .. మసాజ్ వీడియో వైరల్. విమర్శాస్త్రాలు సంధిస్తున్న బీజేపీ
ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేందర్ జైన్ తీహార్ జైలు గదిలో మసాజ్ చేయించుకుంటున్న పాత వీడియోను బీజేపీ శనివారం విడుదల చేసింది. జైన్కు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చినందుకు తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ సస్పెండ్ చేయబడిన కొద్ది రోజుల తర్వాత ఈ వీడియో వెలుగులోకి వచ్చింది.
ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేందర్ జైన్ సంబంధించిన సంచలన వీడియోను బీజేపీ విడుదల చేసింది. ఈ వీడియోలో తీహార్ జైలులో శిక్షను అనుభవిస్తున్న సత్యేందర్ జైన్ మసాజ్ చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను బీజేపీ అధికార ప్రతినిధి షాజాద్ పూనావాలా సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రశ్నలు సంధించారు. గతంలో ఈడీ తరపున కోర్టులో సత్యేందర్ జైన్కు జైలులో నిబంధనలను పట్టించుకోకుండా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సత్యేందర్ జైన్కు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చినందుకు తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ సస్పెండ్ చేయబడిన కొద్ది రోజుల తర్వాత ఈ వీడియో వెలుగులోకి వచ్చింది.
తీహార్ జైలు వర్గాల సమాచారం ప్రకారం.. వీడియో పాతది. ఇప్పటికే సంబంధిత అధికారులు, జైలు సిబ్బందిపై జైలు అధికారులు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సత్యేందర్ జైన్కు తీహార్ జైలులో హెడ్ మసాజ్, ఫుట్ మసాజ్, బ్యాక్ మసాజ్ వంటి సౌకర్యాలతో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో ఆరోపించింది. ఢిల్లీ మంత్రి జైల్లో విలాసవంతమైన జీవితానికి సంబంధించిన ఆధారాలను దర్యాప్తు సంస్థ కోర్టుకు సమర్పించింది. "అజ్ఞాత వ్యక్తులు జైన్కు మసాజ్లు, ఫుట్ మసాజ్లు చేశారు. జైలులో అతనికి ప్రత్యేక ఆహారం ఇవ్వబడింది," అని ED తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీరాజు తెలిపారు. ఆయన కొన్ని CCTV చిత్రాలను కోర్టుతో పంచుకున్నారు. ఎక్కువ సమయం జైన్ ఆసుపత్రిలో లేదా జైలులో వివిధ సౌకర్యాలను అనుభవిస్తున్నారని ఆరోపించారు. సత్యేందర్ జైన్ ని మే 30న అరెస్టు చేశారు.
సత్యేందర్ జైన్ను బర్తరఫ్ చేయాలని బీజేపీ ఇప్పటికే పలుమార్లు డిమాండ్ చేసింది. ఈ వీడియో బయటకు రావడంతో బీజేపీ మరింత దూకుడు పెంచింది."జైలులో వీవీఐపీ ట్రీట్మెంట్! అలాంటి మంత్రిని కేజ్రీవాల్ సమర్థించగలరా? ఆయన్ను బర్తరఫ్ చేయగలదా? ఇదేనా ఆప్ నిజమైన రూపం !" అని బీజేపీకి చెందిన షెహజాద్ జై హింద్ అంటూ జైన్ పాదాలకు మసాజ్ చేస్తున్న మరో సీసీటీవీ ఫుటేజీని షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. కానీ, జైన్కు జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించారనే ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో కొట్టివేసింది. అవి అసంబద్ధమైన, నిరాధారమైనవిగా పేర్కొన్నాయి.
మరోవైపు గురువారం నాడు ఆప్ నాయకుడు సత్యేందర్ జైన్కు ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ కోర్టు మనీలాండరింగ్ కేసులో అతనికి బెయిల్ నిరాకరించింది. మనీ ల్యాండరింగ్ కేసులో ప్రాథమికంగా ప్రమేయం ఉన్నాడని పేర్కొంది. గత నెల ప్రారంభంలో తీహార్ జైలులో సత్యేందర్ జైన్ సాక్షులను కలిశారని పేర్కొంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టును ఆశ్రయించింది. నిందితుడు జైన్కు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు అందుబాటులో ఉన్నాయని ED పేర్కొంది. దీంతో పాటు జైలులోని అన్ని నిబంధనలను ఉల్లంఘించి జైలులోని వ్యక్తులు ఆప్ మంత్రిని కలిశారు.