భారత దేశంలో మరోసారి కరోనా కలవరపెడుతోంది. ఇప్పటికే యాక్టివ్ కేసులు వెయ్యికంటే ఎక్కువయ్యాయి… కొన్ని మరణాలు కూడా సంభవించాయి. తాజాగా మరో మరణం చోటుచేసుకుంది.
భారతదేశంలో మరో కరోనా మరణం సంభవించింది. బుధవారం 40 ఏళ్ల వ్యక్తి చండీగడ్ సెక్టార్ 32లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ మేరకు వైద్యశాఖ అధికారులు కూడా కరోనా మరణాన్ని కన్ఫర్మ్ చేసారు.
హాస్పిటల్ సూపరింటెండెంట్ జి.పి. థామి మాట్లాడుతూ… రెండు రోజుల క్రితం తీవ్ర శ్వాస సమస్యలతో బాధపడుతూ లుధియానా నుండి ఓ పేషెంట్ వచ్చాడని తెలిపారు. అతడికి కరోనా లక్షణాలు కనిపించడంతో చెక్ చేసామని… మంగళవారమే అతడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందన్నారు. అప్పటికే అతడి పరిస్థితి విషమించిందని.. బుధవారం తెల్లవారుజామున మరణించాడని ధృవీకరించారు.
"నిన్న ఒక రోగి వచ్చాడు. అతనికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. నేడు ఉదయం 4 గంటలకు అతను మరణించాడు... అతని వయస్సు 40 సంవత్సరాలు, యుపిలోని ఫిరోజాబాద్కు చెందినవాడు. అతను శ్వాసకోశ సమస్య, జ్వరంతో బాధపడుతూ లుధియానాలోని ఓ హాస్పిటల్లో చేరాడు… అక్కడి నుండి ఇక్కడికి రిఫర్ చేశారు. ఇక్కడ కరోనా నిర్దారణ కాగా మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేసాం. కానీ అంతలోనే ఆరోగ్య పరిస్థితి క్షీణించి మరణించాడు'' అని సూపరింటెండెంట్ తెలిపారు.
‘’కరోనా మరణం నేపథ్యంలో హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశాము. కరోనాతో బాధపడుతున్నవారు హస్పిటల్లో చేరితే ఈ వార్డులో ఉంచి చికిత్స అందిస్తాము. కరోనా వ్యాప్తి జరగకుండా జాగ్రత్తపడతాము'' అని థామి అన్నారు.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు మళ్లీ నమోదవుతున్నప్పటికీ, ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వేరియంట్లు ఓమిక్రాన్ స్ట్రెయిన్ మాదిరిగానే తేలికపాటి లక్షణాలను చూపిస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ధృవీకరించింది. డాక్టర్ డాంగ్స్ ల్యాబ్ సిఇఒ అర్జున్ డాంగ్ ప్రకారం,పెరుగుతున్న కరోనా కేసులు ఓమిక్రాన్ వైరస్ యొక్క సబ్-లీనియేజ్కు చెందినవి. తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో 'వాచ్ లిస్ట్లో ఉన్న వేరియంట్లు' LF7, NV181 రకాలు మరియు అవి సులభంగా వ్యాపిస్తాయని డాంగ్ పేర్కొన్నారు.
సోమవారం భారతదేశంలో 1,009 క్రియాశీల కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల 752 కొత్త కేసులు నిర్ధారించబడ్డాయి. ప్రభుత్వ డేటా ప్రకారం ప్రస్తుతం కేరళ 430 క్రియాశీల కేసులతో అగ్రస్థానంలో ఉంది. గణనీయమైన కేసుల సంఖ్య ఉన్న ఇతర రాష్ట్రాల్లో మహారాష్ట్ర (209), ఢిల్లీ (104), గుజరాత్ (83), కర్ణాటక (47) ఉన్నాయి.