మొన్న‌టి వ‌ర‌కు ఇరాన్‌తో యుద్ధం చేసిన ఇజ్రాయెల్ ఆ త‌ర్వాత శాంతి ఒప్పందంతో భాగంగా యుద్ధాన్ని విర‌మించింది. అయితే ఇప్పుడు తాజాగా సిరియాపై దాడి చేసింది. ఇంత‌కీ ఈ రెండు దేశాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌కు అస‌లు కార‌ణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

డ్రూజ్‌ తిరుగుబాటుతో ఉద్భవించిన హింస

సిరియాలోని దక్షిణ ప్రాంతమైన స్వెయిదాలో ఇటీవల డ్రూజ్‌ వర్గాలకు చెందిన రెబల్‌ గ్రూపులు సిరియా ప్రభుత్వ బలగాలపై తిరుగుబాటు మొదలుపెట్టాయి. దీంతో బుధవారం ఉదయం నుంచి తీవ్ర స్థాయిలో ఘర్షణలు చెలరేగాయి. కొన్ని రోజుల క్రితమే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, తాజా అల్లర్లు మళ్లీ అశాంతికి దారితీశాయి. డ్రూజ్‌ ప్రజలు తమ హక్కుల కోసం నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం ఉద్రిక్తతలకు కారణమైంది.

బెదోయిన్ తెగలతో పెరిగిన వివాదం

స్వెయిదాలోని స్థానిక సున్నీ బెదోయిన్ గిరిజన తెగలు, డ్రూజ్‌ వర్గాల మధ్య కిడ్నాప్‌లు, ప్రతీకార దాడులు ఉద్రిక్తతను మరింత పెంచాయి. ఈ సంఘర్షణల్లో సిరియా ప్రభుత్వ బలగాలు డ్రూజ్‌ గ్రామాలపై బాంబుల వర్షం కురిపించగా, పలువురిని హతమార్చినట్లు సమాచారం. కొన్నిచోట్ల డ్రూజ్‌ నివాసాలను తగలబెట్టినట్లు ఆరోపణలు వ‌స్తున్నాయి.

డ్రూజ్‌లకు మద్దతుగా రంగంలోకి దిగిన ఇజ్రాయెల్‌

ఇలాంటి పరిస్థితులను చూసి డ్రూజ్‌ వర్గాలకు మద్దతు పేరుతో ఇజ్రాయెల్‌ సైతం బుధవారం ఉదయం, సాయంత్రం సమయంలో సిరియా రాజధాని డమాస్కస్‌ లక్ష్యంగా తీవ్ర మిస్సైల్‌ దాడులు జరిపింది. ముఖ్యంగా సిరియా రక్షణ శాఖ కార్యాలయం ముందు, అధ్యక్ష బషార్ అల్‌ అసద్‌ నివాసానికి సమీప ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. అంతేగాక, సైనిక బలగాల కాన్వాయ్‌లపై కూడా దాడులు జరిపినట్లు అక్కడి మానవ హక్కుల పరిశీలక సంస్థలు వెల్లడించాయి.

ప్రాణ నష్టంపై ప్రకటనలు

ఈ దాడుల్లో ఇప్పటివరకు కనీసం ముగ్గురు మ‌ర‌ణించార‌ని, 34 మందికి పైగా గాయాలు జరిగాయని అధికారికంగా వెల్లడించారు. అయితే బ్రిటన్‌కు చెందిన సిరియన్ ఆబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ అందించిన సమాచారం ప్రకారం, గత కొన్ని వారాల్లో డ్రూజ్‌ తిరుగుబాటుతో ప్రారంభమైన హింసలో 250 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అందులో 138 మంది సైనికులు ఉన్నారు. అసలు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని ఆ సంస్థ హెచ్చరిస్తోంది.

Scroll to load tweet…

మళ్లీ కాల్పుల విరమణ ప్రకటన

ఇజ్రాయెల్‌ దాడుల తరువాత పరిస్థితి కొంత స్థిరపడింది. రెండు వర్గాలూ సాయంత్రానికి నేరుగా ఎదురుపడకుండా మళ్లీ కాల్పుల విరమణ ప్రకటించాయి. అయితే ఇది ఎంతకాలం అమలు అవుతుందన్న అనుమానాలు ఉన్నాయి.

డ్రూజ్‌ వర్గం ఎవరు?

డ్రూజ్‌లు మతపరంగా ఇస్లాం నుంచి వేరుపడిన ఓ ప్రత్యేక తెగ. వీరు సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్, జోర్డాన్ దేశాలలో నివసిస్తున్నారు. సిరియాలో వీరు చిన్న వర్గమే అయినప్పటికీ, సామాజికంగా, రాజకీయంగా వారికి ప్రత్యేక గుర్తింపు ఉంది.