Iran Israel War: ఇజ్రాయెల్ ప్రధాని బతికే ఉన్నారా.? అసలేం జరుగుతోంది.?
Iran War: ఇరాన్ యుద్ధానికి సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. వీటిలో కొన్ని పుకార్లు కూడా వస్తున్నాయి. ఇరాన్ చేసిన దాడిలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరణించారంటూ వార్తలు వస్తుండగా.. దీనిపై ఇజ్రాయెల్ స్పందించింది

వైరల్ వీడియోతో మొదలైన గందరగోళం
శుక్రవారం రోజున నెతన్యాహు తన అధికారిక X ఖాతాలో ఒక వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో ఆయన ఇరాన్తో జరుగుతున్న యుద్ధ పరిస్థితులపై మాట్లాడారు. అయితే ఆ వీడియోను గమనించిన కొంతమంది నెటిజన్లు ఒక విచిత్ర అంశాన్ని గుర్తించారు. వీడియోలో ఆయన చేతికి ఆరు వేళ్లు కనిపిస్తున్నట్లు అనిపించడంతో అది ఏఐ టెక్నాలజీతో తయారైన వీడియో కావచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో వీడియో నిజమా కాదా అన్న సందేహాలు మొదలయ్యాయి.
నెట్టింట ఊహాగానాలు
వీడియోపై వచ్చిన అనుమానాలు క్రమంగా పెద్ద చర్చకు దారి తీశాయి. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు నెతన్యాహు గురించి అనేక ప్రశ్నలు లేవనెత్తారు. “ఆయన ఎక్కడున్నారు?”, “ఆ వీడియో ఎందుకు తొలగించారు?”, “అసలు ఆయన క్షేమంగా ఉన్నారా?” వంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో వరుసగా కనిపించాయి. కొందరు మరింత ముందుకు వెళ్లి ఇరాన్ దాడుల్లో ఆయన మరణించి ఉండొచ్చని కూడా ప్రచారం చేయడం ప్రారంభించారు.
BREAKING: LATEST VIDEO RELEASED BY THE ISRAELI GOVERNMENT SHOWS THAT IT WAS AI GENERATED BECAUSE NETANYAHU HAS 6 FINGERS
Is Netanyahu dead? pic.twitter.com/5wYFt6OZIn— Sulaiman Ahmed (@ShaykhSulaiman) March 13, 2026
ఆమె ప్రశ్నలతో పెరిగిన అనుమానాలు
ఈ అంశంపై అమెరికాకు చెందిన పొలిటికల్ కమ్యూటేటర్ కాండేస్ ఓవెన్స్ కూడా స్పందించారు. ఆమె సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు లేవనెత్తారు. నెతన్యాహు ఎక్కడ ఉన్నారు? ఆయన కార్యాలయం ఎందుకు ఆ వీడియోను విడుదల చేసింది? తరువాత ఎందుకు తొలగించింది? వంటి సందేహాలను ఆమె వ్యక్తం చేశారు. దీంతో ఈ వార్త మరింతగా వైరల్ అయింది.
ఇజ్రాయెల్ కార్యాలయం ఇచ్చిన స్పష్టత
ఈ పరిస్థితుల్లో నెతన్యాహు కార్యాలయం అధికారికంగా స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది. ప్రధాని సురక్షితంగా ఉన్నారని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది. దీంతో సోషల్ మీడియాలో వచ్చిన ఊహాగానాలకు కొంతవరకు తెరపడింది.
హెచ్చరిస్తున్న ఇరాన్
ఇదిలా ఉంటే.. ఇరాన్కు చెందిన సైనిక విభాగం ఇస్లామిక్ రివలుష్నరీ గార్డ్ కార్ప్స్ నెతన్యాహుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని చర్యలను తీవ్రంగా విమర్శిస్తూ, ఆయనపై కఠిన హెచ్చరికలు జారీ చేసింది. ఆయన ఇంకా జీవించి ఉంటే ఎక్కడ ఉన్నా వెంబడిస్తామని పేర్కొంది. అయితే నెతన్యాహు నిజంగా ఎక్కడ ఉన్నారన్న విషయంపై ఇరాన్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేయడం కూడా చర్చకు దారి తీసింది. కాగా, ఇజ్రాయెల్ మాత్రం ఈ వార్తలన్నీ ఫేక్ అని స్పష్టంగా చెబుతోంది.

