బంగ్లాదేశ్లో షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వ విదేశాంగ విధానంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. భారత వ్యతిరేక దేశాలైన పాకిస్థాన్, చైనాలకు బంగ్లా దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ చైనా పర్యటన చర్చనీయాంశంగా మారింది..
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ప్రస్తుతం చైనాలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. బంగ్లాదేశ్లోని సముద్ర తీర ప్రాంతాన్ని చైనా ఆర్థిక వ్యవస్థ విస్తరణగా మార్చాలని చైనాను కోరారు. చైనా తన ఆర్థిక స్థావరాన్ని బంగ్లాదేశ్లో ఏర్పాటు చేయాలని, ఆ ప్రాంతంలో సముద్రానికి ఒక్క బంగ్లాదేశ్ మాత్రమే రక్షణగా ఉందని పేర్కొన్నారు.
యూనస్ మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన మాట్లాడుతూ.. 'భారత్కు తూర్పు భాగంలో ఉన్న ఏడు రాష్ట్రాలను ‘సెవెన్ సిస్టర్స్’ అంటారు. సముద్రానికి చేరుకునే మార్గం వాటికి లేదు. ఈ ప్రాంతంలో సముద్రానికి ఒక్క బంగ్లాదేశ్ మాత్రమే రక్షణగా ఉంటుంది. ఇది గొప్ప అవకాశాలను తెరతీస్తుంది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థ విస్తరణగా మారవచ్చు. ఇక్కడ చైనా పరిశ్రమలను ఏర్పాటు చేసి, ఉత్పత్తి చేసి, మార్కెట్ చేయవచ్చు. తర్వాత వాటిని చైనాకు తిరిగి తీసుకెళ్లి, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయవచ్చు" అని యూనస్ తెలిపారు.
కాగా అంతకు ముందు పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమైన యూనస్ బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి చైనా నుంచి పెట్టుబడులను పెంచాలని కోరారు. తీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్ట్లో చైనా కంపెనీలు పాల్గొనాలని ఆయన కోరారు. అలాగే బంగ్లాకు చైనా ఇస్తున్న రుణాలకు వడ్డీలను తగ్గించాలని, ఆ దేశ నిధులు అందుతున్న ప్రాజెక్టులకు కమిట్మెంట్ ఫీజ్ను మాఫీ చేయాలని కోరారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలన్నారు.
బంగ్లా చైనాకు దగ్గరవుతుండడం భారత్కు మరింత ఉద్రిక్తతను తెచ్చే అవకాశముంది. బంగాళాఖాతం, భారత మహాసముద్ర ప్రాంతాలు భద్రత, సార్వభౌమత్వ పరంగా భారత్కు కీలకం కానుంది. ఈ ప్రాంతంలో చైనా ప్రభావం పెరిగితే, అది భారత ప్రయోజనాలకు ప్రమాదం కావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే యూనస్ భారత పర్యటనకు అనుమతి కోరగా, ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అంశంపై ఇంకా కేంద్రం నుంచి లాంటి స్పందన రాలేదు.