- Home
- International
- USA Iran: ఇరాన్తో యుద్ధం.. అమెరికా ఇప్పటి వరకు ఎన్ని కోట్లు ఖర్చు చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
USA Iran: ఇరాన్తో యుద్ధం.. అమెరికా ఇప్పటి వరకు ఎన్ని కోట్లు ఖర్చు చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
USA Iran: ఇప్పటి వరకు ఇరాన్పై జరిగిన దాడులు కేవలం ట్రైలర్ మాత్రమే అని.. త్వరలో సినిమా చూపిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్న వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

పికాక్స్ పర్వతం కింద అణు కేంద్రాలపై ట్రంప్ వ్యాఖ్యలు
ఇరాన్లోని నతాంజ్ అణు కేంద్రానికి సమీపంలో ఉన్న పికాక్స్ పర్వత ప్రాంతంలో భూగర్భ అణు కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమవుతున్నాయని తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని ట్రంప్ తెలిపారు. అక్కడ అణ్వాయుధాల తయారీకి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆ కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేసి, శుద్ధి చేసిన యురేనియాన్ని స్వాధీనం చేసుకోవడానికి అవసరమైతే మరోసారి సైనిక దాడులు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు జరిగిన దాడులు కేవలం ప్రారంభమేనని, అవసరమైతే మరింత తీవ్రమైన చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు.
ఇరాన్పై కొనసాగుతోన్న దాడులు
ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు పలు కీలక ప్రాంతాల్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నట్లు సమాచారం. అమెరికా దళాలు ఆపరేషన్ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలపై లక్ష్యంగా దాడులు చేసినట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. చాబహార్ పోర్టు ప్రాంతంపైనా క్షిపణి దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ ఖతార్, కువైట్, బహ్రెయిన్ దిశగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తున్నట్లు సమాచారం.
పాకిస్థాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు.. రహస్య సందేశంపై చర్చ
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో పాకిస్థాన్ కూడా పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రతినిధి బృందం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్ను రావల్పిండిలో కలిసింది. దాదాపు 50 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో పశ్చిమాసియా భద్రతా పరిస్థితులు, శాంతి చర్చలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం మొజ్తబా ఖమేనీ పంపిన ఒక రహస్య సందేశాన్ని కూడా మునీర్కు అందించినట్లు విదేశీ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
యుద్ధ వ్యయంపై అమెరికా వెల్లడి
ఇరాన్పై కొనసాగుతున్న సైనిక చర్యల కోసం భారీ స్థాయిలో ఖర్చు అవుతున్నట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ యుద్ధానికి ఇప్పటివరకు అంచనా వేసిన మొత్తం వ్యయం సుమారు 37.5 బిలియన్ డాలర్లు.. భారత కరెన్సీలో దాదాపు రూ.3.6 లక్షల కోట్లు. అదే సమయంలో పెంటగాన్కు అదనంగా 67 బిలియన్ డాలర్ల నిధులు అవసరం అని ప్రభుత్వం ముందు ప్రతిపాదన ఉంచినట్లు తెలిపారు. ఈ పరిణామాలు అమెరికా-ఇరాన్ ఘర్షణ మరింత సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలను సూచిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

