చైనా కంపెనీలకు సెమీకండక్టర్ డిజైన్ సాఫ్ట్‌వేర్ అందించే అమెరికా కంపెనీలు వాటి సేవలను నిలిపివేయాలని డోనాల్డ్ ట్రంప్ ఆదేశించారు.

 చైనా పై దాడికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సెమీకండక్టర్ రంగంలో చైనా కంపెనీలకు అవసరమైన డిజైన్ సాఫ్ట్‌వేర్ సేవలను నిలిపేయాలని అమెరికాలోని ప్రముఖ కంపెనీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆదేశాల మేరకు క్యాడెన్స్, సినాప్సిస్, సీమెన్స్ EDA వంటి టాప్ ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ సంస్థలు చైనాకు తమ సేవలు ఇవ్వకూడదని అమెరికా వాణిజ్య శాఖ సూచించినట్టు సమాచారం. బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ ద్వారా ఈ సూచనలు కంపెనీలకు చేరాయని తెలుస్తోంది.

టెక్నాలజీ రంగంలో అమెరికా ఇప్పటికే చైనాపై ఎన్నో ఆంక్షలు విధించిన నేపథ్యంలో, ఇది మరొక ముఖ్యమైన దెబ్బగా చెప్పుకోవచ్చు. చిప్ డిజైన్, తయారీ ప్రక్రియలో కీలకమైన ఈ సాఫ్ట్‌వేర్ లేకుండా చైనా సంస్థలు తమ అభివృద్ధిని కొనసాగించడం చాలా కష్టమే.

భారీగా సుంకాలు…

ఇక ఈ పరిణామాల వలన చైనా ఆర్థిక వ్యవస్థపై దెబ్బ తగలడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో, ట్రంప్ తాను మొదటి సారి అధికారం చేపట్టిన సమయంలోనే చైనా పై భారీగా సుంకాలు విధించినట్లు పేర్కొన్నారు.దాని వల్ల చైనాలో ఆర్థిక మాంద్యం వల్ల లక్షలాది ఉద్యోగాలు కూడా ఉడిపోయాయని పేర్కొన్నారు.

ఆర్థిక మాంద్యం…

ఇప్పటికే కొవిడ్ అనంతరం ఆర్థిక మాంద్యం, రియల్ ఎస్టేట్ రంగంలో సంక్షోభం వంటి అంశాలతో చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. యువత నిరుద్యోగం పెరిగిపోవడం, కొత్తగా గ్రాడ్యుయేట్ అయ్యే విద్యార్థులు ఉద్యోగాలు లభించక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా అమెరికా ఆంక్షలు చైనా ఉపాధి రంగాన్ని మరింత అస్తవ్యస్తం చేయవచ్చని విశ్లేషకుల అంచనాలు.

టెక్నాలజీ రంగాన్ని…

ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచే సరికి, అమెరికా-చైనా మధ్య మరోసారి ఆర్థిక యుద్ధానికి మార్గం సిద్ధమవుతోంది. ఈసారి ప్రధానంగా టెక్నాలజీ రంగాన్ని లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. ఇదే సమయంలో చైనా ఫ్యాక్టరీ ఉద్యోగాలు, వాణిజ్య ఆదాయం గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. అమెరికా చర్యలతో చైనా ఆర్థిక పటిమపై మళ్లీ దెబ్బపడే పరిస్థితులు నెలకొన్నాయి.