చైనా పర్యటనకు వెళ్ళిన పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ కు రెడ్ కార్పెట్ లేకుండా చైనా స్వాగతం పలికింది. ఇది పాకిస్తాన్ కు చైనా ఎంత చిన్నచూపు చూస్తుందో అర్థమవుతోంది. 

చైనా రాజధాని బీజింగ్ లో పాక్ ఉపప్రధాని ఇషాక్ దార్ కు చుక్కెదురయ్యింది. చైనా పర్యటనకు వెళ్లిన ఆయనను పట్టించుకునే నాధుడే లేకుండాపోయాడు. బీజింగ్ విమానాశ్రయంలో దిగిన పాక్ విదేశాంగ మంత్రికి రెడ్ కార్పెట్ స్వాగతం లేదు… ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు కాదుకదా కనీసం సీనియర్ అధికారులు కూడా ఆయనను రిసీవ్ చేసుకునేందుకు రాలేదు. ఇస్లామాబాద్ 'ఐరన్ బ్రదర్' అని పిలుచుకునే చైనా నుంచి ఈ స్వాగతం రెండు దేశాల మధ్య సంబంధాల గురించి ఊహాగానాలకు దారితీసింది.

 

Scroll to load tweet…

 

మే 19 నుండి 21 వరకు మూడు రోజుల పర్యటన కోసం దార్ చైనా రాజధానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి తో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖితో త్రైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు.

పాకిస్తాన్ కు 'ఐరన్ బ్రదర్' నుంచి కొత్త సంకేతాలు…

అయితే పాక్ విదేశాంగమంత్రి దార్ చైనా పర్యటన పలు అనుమానాలకు తావిస్తోంది. మిత్రదేశాల నుంచి ఉన్నత స్థాయి పర్యటనల సందర్భంగా సాధారణంగా లభించే ఆత్మీయ స్వాగతానికి బదులుగా, పాకిస్తాన్ ఉప ప్రధానికి విమానాశ్రయంలో దిగువ స్థాయి చైనా అధికారులు స్వాగతం పలికారు. ఏ సీనియర్ ప్రతినిధి కూడా లేకపోవడం, మధ్యస్థాయి మంత్రి కూడా లేకపోవడం, మరియు రెడ్ కార్పెట్ లేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది.

రెండు దేశాల మధ్య 'ఆల్-వెదర్ స్ట్రాటజిక్ కోఆపరేటివ్ పార్టనర్‌షిప్' ను బలోపేతం చేయడానికి జరుగుతున్న ఉన్నత స్థాయి మార్పిడిలో భాగంగా దార్ పర్యటనను పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ముందుగానే ప్రకటించింది. వాంగ్ యి ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోందని, ద్వైపాక్షిక సంబంధాలు మరియు ప్రాంతీయ పరిస్థితి, ముఖ్యంగా దక్షిణాసియాలో ఇటీవలి పరిణామాలపై 'లోతైన చర్చలు' జరుగుతాయని ఒక ప్రకటనలో తెలిపింది.

భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో నాలుగు రోజుల పాటు జరిగిన డ్రోన్, క్షిపణి దాడులు ఆగిన వారం తర్వాత దార్ చైనా పర్యటన జరిగింది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఇండియా-పాక్ మధ్య ఉద్రిక్తతలపై చైనా కూడా స్పందించింది. అణ్వాయుధాలను కలిగి ఉన్న పొరుగు దేశాల మధ్య శత్రుత్వాలను ఆపడం ప్రాంతీయ శాంతికి అవసరమని చైనా బహిరంగంగా స్వాగతించింది.

మే 20న జరగనున్న పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య త్రైపాక్షిక సమావేశం ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద నిరోధకత మరియు వాణిజ్యంపై దృష్టి సారించనుంది. అయితే దార్ కు లభించిన స్వాగతం ఈ సమావేశంపై అనేక అనుమానాలను కలిగిస్తోంది.   

తన విదేశాంగ విధానంలో చైనాతో బలమైన సంబంధాలను తరచుగా హైలైట్ చేసే పాకిస్తాన్ కు ఈ స్వాగతం ఇబ్బందిపెట్టే అంశమే. చైనాతో పాక్ కు సాన్నిహిత్యం ఏ స్థాయిలో ఉంది? పాక్ ను చైనా ఎంత చిన్నచూపు చూస్తుందో దీన్నిబట్టే అర్థమవుతుంది.