ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేపట్టి, ఏడీ గన్ వినియోగంతో కచ్చిత లక్ష్యాలను ధ్వంసం చేసింది.
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మే 7న భారత సైన్యం, వైమానిక దళం, నౌకాదళం సంయుక్తంగా ఈ మెరుపు దాడిని చేపట్టి దాయాది దేశానికి అర్థరాత్రే సూర్యున్నిచూపించారు . ఈ ఆపరేషన్ లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ సహా పాక్లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై లక్ష్యాన్ని తప్పకుండ క్షిపణుల ద్వారా దాడులు నిర్వహించారు.
ఏడీ గన్నర్….
ఈ దాడుల్లో పాక్ పాలనలోని కీలక ఉగ్ర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. భారత్పై మరిన్ని ఉగ్ర దాడులకు కుట్ర పన్నుతున్న స్థావరాలే ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నారు. భారత ఆర్మీ తీవ్రమైన వ్యూహంతో ముందుకు సాగింది.ఇదిలా ఉండగా, ఈ దాడుల్లో వినియోగించిన ఆధునిక ఆయుధాలలో ఏడీ గన్ ప్రధానంగా నిలిచింది. ‘ఏడీ గన్నర్’గా పిలవబడే ఈ యంత్రాంగం శత్రువు గాలి మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు స్పష్టంగా గుర్తించి, ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించగలదు. దీనికి సంబంధించిన వీడియోను వెస్ట్రన్ కమాండ్ అధికారులు తాజాగా విడుదల చేశారు.
ఈ వీడియోలో గగనతల దాడుల దృశ్యాలు, పాకిస్థానీ డ్రోన్లను భారత సైన్యం కూల్చివేయడం, దాడి సమయంలో సైనికుల అప్రమత్తతను వివరంగా చూపించారు. శత్రువులను ఎదుర్కొనే క్రమంలో సైనికులు తీసుకుంటున్న జాగ్రత్తలు ఈ వీడియోలో స్పష్టంగా కనపడుతుంది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారత సైన్యం చూపిన ధైర్యాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు. దేశ భద్రత కోసం సైన్యం నిరంతరం మేల్కొని ఉండటాన్ని ప్రజలు గర్వంగా గుర్తిస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ భారత ప్రతిఘటన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించిన ఉదాహరణగా నిలిచింది.