- Home
- International
- Telangana: 1775 మందికి ఉద్యోగాలు, విదేశీ అవకాశాలకు కొత్త మార్గాలు.. ఘనంగా తొలి తెలంగాణ స్కిల్స్ డే
Telangana: 1775 మందికి ఉద్యోగాలు, విదేశీ అవకాశాలకు కొత్త మార్గాలు.. ఘనంగా తొలి తెలంగాణ స్కిల్స్ డే
Telangana: తెలంగాణ యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తొలి ‘తెలంగాణ స్కిల్స్ డే’ను ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్లోని కొమరం భీం ఆదివాసీ భవన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

స్కిల్ డెవలప్మెంట్లో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానం
డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ (డీఈటీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీస్), గనుల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జాబ్మేళాల్లో ఉద్యోగాలకు ఎంపికైన యువతకు ఆఫర్ లెటర్లు అందజేసి అభినందించారు. విదేశీ ఉపాధికి ఎంపికైన 19 మంది ఫిజియోథెరపిస్టులకు కూడా ఆఫర్ లెటర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టే సమయంలో అత్యంత ప్రాధాన్యంగా చూసేది నైపుణ్యం కలిగిన మానవ వనరులేనని అన్నారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించడం, ఉద్యోగావకాశాలను పెంచడం, తెలంగాణను దేశంలోనే నంబర్-1 స్కిల్ డెవలప్మెంట్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
65 ఐటీఐలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా.. శిక్షణ సామర్థ్యం రెట్టింపు
రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐలను టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో అత్యాధునిక అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేసినట్లు మంత్రి తెలిపారు. సీఎన్సీ, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమేషన్, అడ్వాన్స్డ్ టూల్స్ వంటి భవిష్యత్ పరిశ్రమలకు అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ మార్పులతో శిక్షణ సామర్థ్యం 18,484 నుంచి 34,344 మందికి పెరిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐల్లో 35 ట్రేడ్లలో 15,860 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. 2025-27 విద్యా సంవత్సరానికి 99 శాతం సీట్లు భర్తీ కావడం యువతలో స్కిల్ కోర్సులపై పెరిగిన విశ్వాసానికి నిదర్శనమన్నారు. అలాగే కేంద్ర డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీటీ) ప్రమాణాలతో శిక్షణ పూర్తిచేసిన వారికి జాతీయ స్థాయి ఎన్సీవీటీ సర్టిఫికేషన్ అందుతుందని, దీని ద్వారా దేశీయంగానే కాకుండా విదేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
జాబ్మేళాల ద్వారా 1,775 మందికి ఉద్యోగాలు.. విదేశీ భాషల శిక్షణకు EFLUతో ఒప్పందం
రాష్ట్రంలోని హైదరాబాద్, ఉట్నూర్, వరంగల్, నిజామాబాద్, హుస్నాబాద్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఏడు జాబ్మేళాల్లో 116 పరిశ్రమలు పాల్గొన్నాయని మంత్రి తెలిపారు. మొత్తం 2,572 మంది యువత ఇంటర్వ్యూలకు హాజరుకాగా, వారిలో 1,775 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని చెప్పారు. ఎంపికైన వారిలో 1,216 మంది అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ విద్యార్థులు, 559 మంది ఐటీఐ విద్యార్థులు ఉన్నారని వెల్లడించారు. వీరికి నెలకు సగటున రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనంతో ఉద్యోగాలు లభించాయని వివరించారు. విదేశీ ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని జర్మన్, జపనీస్తో పాటు ఇతర విదేశీ భాషల్లో శిక్షణ అందించేందుకు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFLU)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. భాషా నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నత వేతనాలతో ఉద్యోగాలు పొందే అవకాశాలు యువతకు లభిస్తాయని చెప్పారు.
స్టైపెండ్, కొత్త శిక్షణ కేంద్రాలు.. వచ్చే ఏడాది 50 వేల మందికి శిక్షణ లక్ష్యం
నైపుణ్య శిక్షణ పొందుతున్న ఐటీఐ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ విద్యార్థులకు ప్రభుత్వం నెలకు రూ.2,000 స్టైపెండ్ అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు నిధుల కొరత రానివ్వబోమని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల యువతకు కూడా ఆధునిక శిక్షణ అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 54 కొత్త అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుకు ఇప్పటికే 281.39 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినట్లు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరంలో 50 వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించడమే లక్ష్యమన్నారు.
అలాగే జూలై 26 నుంచి ఆగస్టు 30 వరకు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో మరో విడత భారీ జాబ్మేళాలు నిర్వహించి 10 వేల మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. శిక్షణ నుంచి ఉద్యోగం వరకు సమగ్ర వ్యవస్థను రూపొందించి, తెలంగాణ యువతను ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.

