పహల్గాం దాడిపై పాక్ ప్రధాని షెహబాజ్ వ్యాఖ్యలు మరో వివాదం రేపాయి. భారత్ ప్రతీకార చర్యలపై 1971 యుద్ధాన్ని లాగడం గమనార్హం.
పహల్గాం ఉగ్రదాడిపై స్పందిస్తూ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆయన వక్రబుద్ధిని వెల్లడించాయి. 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధం ఓటమికి ప్రతీకారంగా తాజాగా చోటు చేసుకున్న ఘటనలను ఆయన సూచించడం భారత ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకతను రేపింది.ఇటీవల భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో పీవోకేలోని ముజఫరాబాద్ ప్రాంతంలో ఉగ్రవాద శిబిరాలపై మే 7న దాడులు నిర్వహించాయి.
ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు మృతిచెందగా, పాకిస్థాన్ సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. అనంతరం మే 8 నుంచి మూడు రోజుల పాటు పాక్ సైన్యం సరిహద్దుల్లో కాల్పులకు తెగబడగా, భారత సైన్యం కూడా తగినట్లుగా బలమైన ప్రతిస్పందననిచ్చింది. చివరికి పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి రావడంతో ప్రస్తుతానికి సరిహద్దుల్లో పరిస్థితి నిలకడగా కనిపిస్తోంది.
పహల్గాం దాడి దురదృష్టకరం..
ఈ నేపథ్యంలో ముజఫరాబాద్లో మరణించిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించిన షెహబాజ్ షరీఫ్ వారికి ఆర్థిక సాయం చెక్కులు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ‘‘పహల్గాం దాడి దురదృష్టకరం. భారత్ దర్యాప్తుకు సహకరించలేదు. మేము అంతర్జాతీయ స్థాయి దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నాం’’ అని తెలిపారు. అంతేకాకుండా, ఇరు దేశాల మధ్య అప్పట్లో ఏర్పడిన ఉద్రిక్తతలు తారాస్థాయికి వెళ్లి ఉంటాయని వ్యాఖ్యానించారు.
అయితే, ఈ వ్యాఖ్యల్లో 1971 యుద్ధాన్ని ప్రస్తావించి ఇప్పటి పరిణామాలకు లింక్ ఇవ్వడం పాక్ ప్రధానిపై తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలపై మరింత ప్రభావం చూపే అవకాశముంది.పహల్గాం ఘటన తరువాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాక్కు గట్టి హెచ్చరికగా నిలిచిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పాక్ వైఖరిని చూస్తుంటే, దాడులకు గల మౌలిక కారణాలను సమర్థించుకునే ప్రయత్నం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.