పాక్ కుట్రను బీఎస్ఎఫ్ భగ్నం చేసింది. 50 మంది ఉగ్రవాదులను భారత్లోకి పంపే ప్రయత్నం విఫలమైంది.
భారత్-పాక్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల వేళ పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను పంపేందుకు పాక్ ప్రయత్నించింది.ఈ విషయాన్నిబోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తెలిపింది. మే 8వ తేదీన 45-50 మంది ఉగ్రవాదులను సరిహద్దులు దాటించి భారత్లోకి పంపించేందుకు పాక్ దళాలు తీవ్రంగా ప్రయత్నించాయి. ఇందుకోసం భారీగా షెల్లింగ్ కూడా చేపట్టినట్లు తెలిపాయి.
బీఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్ఎస్ మండ్ మాట్లాడుతూ.. ‘‘మా జవాన్లు వారికి తీవ్ర స్థాయిలో నష్టాన్ని చూపించారు. పెద్ద ఎత్తున ఉగ్రవాదులు సరిహద్దులు దాటేందుకు వస్తున్నట్లు మాకు ముందే సమాచారం ఉంది. వారి కోసం చూసి.. గుర్తించగానే దాడులు నిర్వహించాం. ఆ గ్రూపులో దాదాపు 45-50 మంది వరకు ఉగ్రవాదులు ఉన్నారని తెలుస్తుంది.
మరోసారి వస్తే…
వారు మా వైపునకు దూసుకు రావడానికి ప్రయత్నించారు. దీంతో మేం అదును చూసి వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాం. మేము ఊహించినట్లే తమ పోస్టుల నుంచి వారు భారీ స్థాయిలో కాల్పులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో మేము అత్యంత కచ్చితత్వంతో కాల్పులు నిర్వహించం. దీంతో వారు తమ పోస్టులను వదిలేసి పారిపోయారు. దాదాపు గంటన్నరలోనే వారికి మేము బుద్ధి చెప్పాం. వారి బంకర్లు, ఆయుధాలను ధ్వంసం చేశాము. వారు మరోసారి వస్తే పదింతల శక్తితో తిప్పికొట్టేందుకు మా జవాన్లు రెడీగా ఉన్నారు. ఇందుకు సంబంధించి బీఎస్ఎఫ్కు స్పష్టమైన ఆదేశాలున్నాయి.
బీఎస్ఎఫ్లోని మహిళా జవాన్లు కూడా పురుషులతో సమానంగా శత్రువులపై పోరాడే బాధ్యతలను ఎంతో సమర్థంగా నిర్వహించారు. వారిని చూస్తే మాకు గర్వంగా ఉంది’’ అని డీఐజీ వెల్లడించారు. బుధవారం పూంచ్లోని బ్రిగేడ్ హెడ్క్వార్టర్ను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్మీ, బీఎస్ఎఫ్ సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు.
ఆపరేషన్ సిందూర్ వేళ జమ్మూకశ్మీర్లోని సాంబ జిల్లాలో సరిహద్దు దాటి వచ్చేందుకు పాక్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బీఎస్ఎఫ్ తిప్పికొట్టింది. మే 8వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో సాంబ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఈ పరిణామాలు చోటుచేసుకొన్నట్లు బీఎస్ఎఫ్ సోషల్ మీడియాలో వెల్లడించింది. కనీసం ఏడుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి.