ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ లు ఇరాన్ పై జరుపుతున్న దాడులు భారత్ లో అశాంతికి కారణం కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది.
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో భారత్ అప్రమత్తమయ్యింది. దేశంలో ఈ యుద్ద ప్రభావం ఉండే అవకాశాలున్నాయి... మతపరమైన హింస చెలరేగే అనుమానాలను నిఘా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్నిరాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ (MHA) ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ హెచ్చరిక లేఖ రాసింది.
దేశంలో అలజడికి ఆస్కారముందా..?
గత ఫిబ్రవరి 28న కేంద్రం రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. విదేశాల్లో జరుగుతున్న పరిణామాలు మన దేశంలో కూడా అలజడి సృష్టించవచ్చని ఇందులో కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా మతపరమైన సభలు, సమావేశాల్లో రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఇరాన్కు అనుకూలంగా మాట్లాడుతూ, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే మత ప్రబోధకులను గుర్తించి, వారిపై నిఘా పెట్టాలని రాష్ట్ర అధికారులను హోం శాఖ ఆదేశించింది. వారి వల్ల స్థానికంగా ఎలాంటి అశాంతి, మత ఘర్షణలు జరగకుండా చూడాలని సూచించింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో కేంద్రం రాష్ట్రాలకు స్పష్టమైన సూచనలు చేసింది.
భారత్ అప్రమత్తం..
ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్ పై భీకర దాడులు జరపుతున్నాయి. ఈ పరిణామాలపై భారత్ స్పందిస్తూ... ఈ వ్యవహారంపై ఎవరూ స్పందించకూడదని, అందరూ సంయమనం పాటించాలని కోరింది. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
అయితే ఈ పరిస్థితిని కేవలం అంతర్జాతీయ రాజకీయ పరిణామంగానే కాకుండా దేశీయంగా కూడా నిశితంగా గమనిస్తున్నారు. అంతర్జాతీయ ఘటనల వల్ల పెరిగే భావోద్వేగాలను మన దేశంలోని కొన్ని తీవ్రవాద శక్తులు వాడుకుని, స్థానికంగా ఉద్రిక్తతలు సృష్టించే ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారు. ఈ సున్నితమైన సమయంలో, మతపరమైన భావాలను రెచ్చగొట్టే ప్రసంగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. శాంతిభద్రతల పరిరక్షణకు ఇది చాలా అవసరం అని పేర్కొంది.
భారత్లో విభిన్న మతాలు, సంస్కృతుల ప్రజలు కలిసి జీవిస్తుంటారు. అందువల్ల ఇలాంటి అంతర్జాతీయ ఘటనల తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, ఉద్రిక్తతలు వేగంగా పెరిగే ప్రమాదం ఉందని భద్రతా విశ్లేషకులు అంటున్నారు.


