IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి… చలి పెరుగుతోంది. చలి ఎక్కువగా ఉండే జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాల వాతావరణం...
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చలి పెరిగింది. రాత్రులు, ఉదయం వేళల్లో చలి చంపేస్తుంటే మధ్యాహ్నం ఎండలు, ఉక్కపోత ఉంటోంది. ఇక రాబోయే రోజుల్లో వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వేసవికి ముందు ఇలా చలి, ఎండా, వానతో వింత వాతావరణ పరిస్థితులు ఉన్నాయి.
ఉత్తర భారతదేశంలో అధికపీడనం
ఉత్తర భారతదేశంలో నెలకొన్న అధికపీడనం కారణంగా చలిగాలులు దక్షిణాదివైపు వీస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది... ఇది కొన్నిరోజులు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయి.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
రాబోయే రెండు రోజులు తెలంగాణలో అక్కడక్కడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, హన్మకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమ్రంభీ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో 11 నుండి 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అందుకే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
తెలంగాణలో మళ్లీ చలి
నిన్న (ఆదివారం) అత్యల్పంగా కొమ్రంభీం జిల్లా సిర్పూర్ లో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ లో 10.1, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ లో 11.4, వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 12.6, నిర్మల్ జిల్లా పెంబిలో 13, సిద్దిపేట జిల్లా కొండపాకలో 13.1, రంగారెడ్డి జిల్లా కందుకూరులో 13.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు
హైదరాబాద్ లో అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 12 డిగ్రీలు నమోదయ్యింది. మౌలాలి, ఆల్వాల్, తిరుమలగిరి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, షేక్ పేట్, బోయినిపల్లి, నేరేడ్ మెట్ లో కూడా 15 డిగ్రీల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇలా ఫిబ్రవరి 12 వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతూ చలిగాలులు వీస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు.
ఏపీలో చలిగాలులు
ఆంధ్ర ప్రదేశ్ లో చలితో పాటు పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కోస్తాంధ్ర, ఏజెన్సీ ప్రాంతాల్లో సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీలు తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకులో అత్యల్పంగా 7-8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకొన్ని రోజులు చలి కొనసాగుతుందని... ఆ తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

