- Home
- Telangana
- పేమెంట్ అయినట్లు సౌండ్ వస్తుంది కానీ డబ్బులు పడవు.. ఫోన్పేలో కొత్త స్కామ్. జాగ్రత్త!
పేమెంట్ అయినట్లు సౌండ్ వస్తుంది కానీ డబ్బులు పడవు.. ఫోన్పేలో కొత్త స్కామ్. జాగ్రత్త!
Phonepe Scam: మారిన టెక్నాలజీతో పాటు నేరాలు కూడా మారుతున్నాయి. తాజాగా వెలుగులోకి ఫోన్పే పేరుతో చేస్తున్న కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏంటీ స్కామ్.? ఎలా గుర్తించాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నకిలీ ఫోన్ పే యాప్తో కొత్త మోసం
ఆన్లైన్ చెల్లింపులు చేసే దుకాణాలను లక్ష్యంగా చేసుకుని ఇద్దరు యువకులు ప్రత్యేకంగా తయారు చేసిన నకిలీ యాప్ను ఉపయోగించారు. ఈ యాప్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చెల్లింపు జరిగినట్లు చూపించడంతో పాటు బీప్ శబ్దం కూడా వినిపిస్తుంది. దుకాణదారులు బిజీగా ఉండే సమయంలో ఈ పద్ధతిని ఉపయోగించి డబ్బులు పంపినట్లు చూపించి సరుకులు తీసుకెళ్తున్నారు. కానీ వాస్తవానికి వ్యాపారి అకౌంట్లో ఎలాంటి మొత్తం జమ కావడం లేదు.
ఈజీ మనీ కోసం
ఏపీ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన గోపి కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్ జగ్గయ్యపేటలో నివసిస్తున్నాడు. ఇద్దరూ కలిసి సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుని నకిలీ ఫోన్ పే యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. తర్వాత దుకాణాలను గుర్తించి వరుసగా మోసాలకు పాల్పడ్డారు.
బిజీ దుకాణాలే ప్రధాన లక్ష్యం
ఈ మోసగాళ్లు ముందుగా రద్దీగా ఉండే కిరాణా షాపులు, జనసంచారం ఎక్కువగా ఉండే దుకాణాలను గుర్తించేవారు. ఆ తర్వాత అక్కడ పెద్ద మొత్తంలో సరుకులు కొనుగోలు చేసేవారు. నకిలీ యాప్తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసినట్లు చూపించేవారు. బీప్ శబ్దం రావడంతో వ్యాపారులు డబ్బులు వచ్చాయని భావించి సరుకులు ఇచ్చేవారు. తీసుకువచ్చిన సరుకులను తక్కువ ధరకు అమ్మి నగదు సంపాదించేవారు.
కిరాణా వ్యాపారి ఫిర్యాదుతో వెలుగులోకి
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి ప్రాంతంలోని ఒక కిరాణా దుకాణంలో సుమారు రూ.25 వేల విలువైన సరుకులు కొనుగోలు చేసి నకిలీ యాప్తో చెల్లింపు చేసినట్లు చూపించారు. మొదట బీప్ శబ్దం రావడంతో డబ్బులు వచ్చాయని భావించిన వ్యాపారి తర్వాత అకౌంట్ చెక్ చేయగా నగదు జమ కాలేదని గుర్తించాడు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వాహన తనిఖీల్లో ముఠా అరెస్ట్
పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలలో నంబర్ ప్లేట్ కనిపించకుండా స్టిక్కర్ వేసిన కారును ఆపి తనిఖీ చేశారు. కారులో ఉన్న ఇద్దరిని విచారించగా నకిలీ ఫోన్ పే యాప్తో మోసాలు చేస్తున్నట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి రూ.1.26 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పలు పట్టణాలు, గ్రామాల్లో ఇదే పద్ధతితో మోసాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే వ్యాపారులు తప్పనిసరిగా తమ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయా లేదా అనేది చూసి మాత్రమే సరుకులు ఇవ్వాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

