- Home
- Telangana
- TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మార్చి 1 నుంచి తగ్గనున్న బస్సు ఛార్జీలు. డీపోలకు సర్క్యూలర్ జారీ
TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మార్చి 1 నుంచి తగ్గనున్న బస్సు ఛార్జీలు. డీపోలకు సర్క్యూలర్ జారీ
TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. హైదరాబాద్ నగరంలో నడిచే మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ బస్సుల ఛార్జీలను తగ్గిస్తూ సంస్థ చర్యలు ప్రారంభించింది. మార్చి 1 నుంచి తగ్గిన ధరలు అమల్లోకి రానున్నాయి.

ఆక్యుపెన్సీ పెంపే ప్రధాన లక్ష్యం
నగరంలో నడుస్తున్న ఏసీ సేవల్లో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటం సంస్థకు సమస్యగా మారింది. ప్రస్తుతం మెట్రో డీలక్స్, ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో సుమారు 60 శాతం సీట్లు ఖాళీగా ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితి వల్ల సంస్థ ఆదాయం తగ్గుతోంది. అందుకే ఛార్జీలు తగ్గించి ఎక్కువ మంది ప్రయాణికులను ఆకర్షించాలని నిర్ణయించారు. తక్కువ ధరలతో ప్రయాణికులు ఏసీ బస్సులను ఎంచుకునే అవకాశం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు డిపో మేనేజర్లకు అధికారిక సర్క్యులర్ పంపించారు.
ఎంత తగ్గాయంటే.?
కొత్తగా అమలు చేస్తున్న ఛార్జీల ప్రకారం తక్కువ దూర ప్రయాణాల్లో స్పష్టమైన తగ్గింపు కనిపిస్తోంది. మెట్రో డీలక్స్ బస్సులో 4 కిలోమీటర్ల ప్రయాణ ఛార్జీ రూ. 30 నుంచి రూ. 25కి తగ్గించారు. ఈ-మెట్రో ఏసీ బస్సులో అదే దూరానికి రూ. 35 ఉన్న టికెట్ ధరను రూ. 25గా నిర్ణయించారు. ఈ మార్పుతో ఏసీ బస్సులను ఎక్కువ మంది ఉపయోగించుకుంటారని అధికారులు భావిస్తున్నారు.
నగరంలో భారీ స్థాయిలో బస్సు సర్వీసులు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం వందల సంఖ్యలో మెట్రో డీలక్స్, ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు సేవలు అందిస్తున్నాయి. రోజూ వెయ్యికి పైగా ట్రిప్పులు నిర్వహిస్తూ వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. అయితే ప్రయాణికులు తక్కువగా ఉండటం వల్ల ఈ సేవలు పూర్తిస్థాయిలో వినియోగం కావడం లేదు. ఇప్పుడు ధరలు తగ్గించడంతో ఉద్యోగులు, విద్యార్థులు, రోజువారీ ప్రయాణికులు ఎక్కువగా ఈ సేవలను వినియోగించే అవకాశం ఉంది.
మొబైల్ యాప్ ద్వారా టికెట్లు, పాసులు
ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు టీజీఎస్ఆర్టీసీ స్మార్ట్ఫోన్ యాప్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ఇంటర్సిటీ బస్సుల టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 1,700కి పైగా బస్సులకు ఆన్లైన్ రిజర్వేషన్ సదుపాయం ఉంది. రోజుకు వేలాది మంది ఈ సేవలను ఉపయోగిస్తున్నారు. డిజిటల్ టికెట్ తీసుకున్న తర్వాత క్యూ ఆర్ కోడ్ చూపిస్తే సరిపోతుంది. కౌంటర్ల వద్ద నిలబడాల్సిన అవసరం ఉండదు. కొన్నిసార్లు యాప్ ద్వారా టికెట్ బుక్ చేస్తే రాయితీలు, క్యాష్బ్యాక్ ఆఫర్లు కూడా లభిస్తాయి.
డిజిటల్ బస్ పాస్ సేవలు
ఈ యాప్ ద్వారా సిటీ బస్ పాస్లు కూడా పొందే అవకాశం కల్పించారు. ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్, గ్రీన్ మెట్రో లగ్జరీ, ఆర్డినరీ, పుష్పక్ ఏసీ వంటి ఐదు రకాల పాస్లు డిజిటల్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. పాస్ రీన్యువల్ కూడా మొబైల్ ద్వారానే చేయవచ్చు. ప్రయాణ సమయంలో పేపర్ పాస్ తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా క్యూ ఆర్ కోడ్ చూపించి ప్రయాణించవచ్చు. టీ-24 టికెట్ కూడా యాప్ ద్వారా పొందే అవకాశం కల్పించారు.

