Rain Alert: ఆకాశంలో అల్లకల్లోలం.. గురువారం ఈ ప్రాంతాల్లో భారీ వర్షం తప్పదు
Rain Alert: తెలుగు రాష్ట్రాలను మళ్లీ వరుణుడు వణికిస్తున్నాడు. గడిచిన రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో అప్పటికప్పుడు వర్షం కురుస్తోంది. కాగా వాతావరణ శాఖ అధికారుల ప్రకారం గురువారం (ఈరోజు) కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఉపరిత ద్రోణుల ప్రభావం
మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా బంగాళాఖాతం వరకు, అలాగే దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకూ ఉపరితల ద్రోణులు విస్తరించడం వల్ల వాతావరణం మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఎండ తీవ్రంగా ఉంటే, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
వర్షపాతం వివరాలు
మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ కోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు నమోదయ్యాయి.
* ప్రకాశం జిల్లా ఒంగోలు – 6.4 సెం.మీ.
* చిత్తూరు జిల్లా నిండ్ర – 5.9 సెం.మీ.
* కె.ఉప్పలపాడు – 5.3 సెం.మీ.
* వేములపాడు – 4.7 సెం.మీ.
* చిలకపాడు – 4.5 సెం.మీ.
* విజయనగరం రాజాం – 4 సెం.మీ.
* కాకినాడ – 3.9 సెం.మీ.
రాబోయే 24 గంటల్లో రాయలసీమలో అనేక చోట్ల, కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో భారీవర్షాలు పడే అవకాశం ఉంది.
గురువారం వాతావరణ సూచనలు
విపత్తుల నిర్వహణ విభాగం ప్రకారం గురువారం రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలు, అలాగే కోనసీమ, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలు అధిక ప్రభావం ఎదుర్కొనే అవకాశముంది. అదనంగా, ఈనెల 22 లేదా 23న ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడవచ్చని, అది అల్పపీడనంగా మారుతుందో లేదో రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని నిపుణులు తెలిపారు. అదే సమయంలో 26 లేదా 27న మధ్య బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశముంది.
హైదరాబాదీలకు అలర్ట్
తెలంగాణలో ఉదయం ఆకాశం మేఘావృతం, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం నుంచి పశ్చిమ తెలంగాణలో జల్లులు మొదలై క్రమంగా మధ్య, తూర్పు జిల్లాలకు వ్యాపిస్తాయి. హైదరాబాద్లో సాయంత్రం 4 తర్వాత తేలికపాటి వర్షం మొదలై, రాత్రి 1 గంట వరకూ మోస్తరుగా కొనసాగుతుంది. ఇప్పటికే రోడ్లు నీటమునిగిన పరిస్థితి ఉన్నందున ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవని అధికారులు సూచిస్తున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ, ఆ తర్వాత కోస్తాంధ్రలో చిన్న జల్లులు, రాయలసీమలో సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.
గాలివేగం, ఉష్ణోగ్రత, తేమ స్థితి
గాలులు – అరేబియా సముద్రంలో గంటకు 31 కి.మీ., బంగాళాఖాతంలో 34 కి.మీ., ఏపీలో 13 కి.మీ., తెలంగాణలో 11 కి.మీ. వేగంతో వీస్తున్నాయి.
ఉష్ణోగ్రత – తెలంగాణలో 30–31°C, ఆంధ్రప్రదేశ్లో 32–34°Cగా ఉండనుంది.
తేమ – పగటిపూట తెలంగాణలో 60%, ఏపీలో 57%గా ఉంటే, రాత్రివేళ రెండు రాష్ట్రాల్లో 90%కు పైగా పెరుగుతుంది. దీని వల్ల రాత్రివేళ వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉంది.