- Home
- Telangana
- IMD Rain Alert : హైదరబాదీలు బిఅలర్ట్.. సాయంత్రం ఈ ప్రాంతాల్లో వర్షబీభత్సమే, ఇక్కడ 51 మి.మీ వర్షపాతమే..!
IMD Rain Alert : హైదరబాదీలు బిఅలర్ట్.. సాయంత్రం ఈ ప్రాంతాల్లో వర్షబీభత్సమే, ఇక్కడ 51 మి.మీ వర్షపాతమే..!
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలుంటాయని హెచ్చరిస్తోంది కాబట్టి నగరవాసులు బిఅలర్ట్.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు...
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలను వానలు వదిలిపెట్టడంలేదు... అటు ఆంధ్ర ప్రదేశ్, ఇటు తెలంగాణలో సాయంత్రం అయ్యిందంటే చాలు జోరువానలు కురుస్తున్నాయి. నిన్న (మార్చి 24, మంగళవారం) సాయంత్రం హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది... దీంతో నగరవాసులు తడిసిముద్దయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఇవాళ (మార్చి 25, బుధవారం) కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
హైదరాబాద్ లో వర్షాలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో వర్షాలు కొనసాగుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. నిన్నటిలాగే ఇవాళ కూడా మధ్యాహ్నం పొడి వాతావరణమే ఉంటుంది... కానీ సాయంత్రం ఒక్కసారిగా వర్షాలు మొదలవుతాయని తెలిపారు. కొన్నిచోట్ల సాయంత్రం లేదా రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ముఖ్యంగా సౌత్, వెస్ట్ హైదరాబాద్ ప్రాంతాల్లో అంటే పాతబస్తీతో పాటు కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, కూకట్ పల్లి, మియాపూర్ వంటి ఐటీ ప్రాంతాల్లో వర్షబీభత్సం కొనసాగుతుందని వెదర్ మ్యాన్ వెల్లడించారు.
ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా నగరంలో వర్షాలు కొనసాగుతాయని అంటోంది. నేడు నగరంలో ఆకాశం మేఘావృతమై ఉండి చల్లని వాతావరణం ఉంటుందని... సాయంత్రం లేదా రాత్రి వెళల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని కాబట్టి నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
హైదరాబాద్ లో అత్యధిక వర్షపాతం ఇక్కడే..
మార్చి 25న అంటే మంగళవారం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలివే…
- షేక్ పేట్ 51.3 మి.మీ
- ఖాజాగూడ 36.8 మి.మీ
- మియాపూర్ 33.3 మి.మీ
- గచ్చిబౌలి 31.5 మి.మీ
- మూసాపేట్ 26.8 మి.మీ
- మాదాపూర్ 26.8 మి.మీ
- బాలానగర్ 25.3 మి.మీ
- లంగర్ హౌస్ 23.8 మి.మీ
- కెపిహెచ్బి కాలనీ 23.8 మి.మీ
- అత్తాపూర్ 23 మి.మీ
- శివరాంపల్లి 18 మి.మీ
- ఆసిఫ్ నగర్ 17 మి.మీ
- బహదూర్ పురా 16.5 మి.మీ
- జూబ్లీహిల్స్ 14.3 మి.మీ
ఈ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్...
హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నారాయణపేట్, నాగర్ కర్నూల్, కామారెడ్డి జిల్లాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
తెలంగాణ వాతావరణ శాఖ కూడా రాబోయే రెండుమూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని... వర్షాలు కొనసాగుతాయని అంటోంది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 1 నుండి 2 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పాటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఏపీలో వర్షాలు... ఈ జిల్లాలకు పిడుగుల ప్రమాదం
ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉన్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటుగా పిడుగులతో కూడిన వర్షాలు పడేందుకు అవకాశం ఉందన్నారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.
అయితే అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలకు పిడుగుల ప్రమాదం పొంచివుందని విపత్తు సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్రలో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. వర్షాల తీవ్రత తగ్గిన తర్వాత క్రమంగా ఎండల తీవ్రత పెరుగుతుందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.
