- Home
- Andhra Pradesh
- IMD Rain Alert : ఉత్తరాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం.. ఈ జిల్లాల్లో డేంజర్ వానలు, బిఅలర్ట్
IMD Rain Alert : ఉత్తరాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం.. ఈ జిల్లాల్లో డేంజర్ వానలు, బిఅలర్ట్
Rain Alert : ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షాల ముప్పు పొంచివుందని వాతావరణ విభాగాలు హెచ్చరిస్తున్నాయి. భారీ వర్షాలు కురవకున్నా పిడుగులు, ఈదురుగాలులు ప్రమాదకరంగా మారవచ్చు… కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో వర్షబీభత్సం
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి... మరో రెండుమూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. వేసవిలో అకాల వర్షాలు కురుస్తుండటంతో ఎండలు మండిపోవాల్సిన సమయంలో చల్లని వాతావరణం ఉంటోంది. వచ్చేవారం కూడా వర్షాలు కురుస్తాయని ఇరు రాష్ట్రాల వాతావరణ విభాగాలు ప్రకటించాయి. మరి ఇవాళ (మార్చి 21, శనివారం) ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వర్షాల సంగతేంటి..? ఇక్కడ తెలుసుకుందాం.
ఉత్తరాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం
ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరాంధ్ర తీరప్రాంతం, పశ్చిమమధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. దీని ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఈ జిల్లాలకు పిడుగుల ప్రమాదం...
ఏపీలో కురిసేది మోస్తరు వర్షాలే అయినా కొన్నిచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని APSDMA ఎండి ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ముఖ్యంగా పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలకు పిడుగుల ప్రమాదం ఎక్కువగా ఉందని వెల్లడించారు. ఇక మరికొన్నిచోట్ల ఉరుములు మెరుపులు, ఈదురుగాలుల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందని హెచ్చరించారు.
ప్రజలారా... జాగ్రత్తలు పాటించండి
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షపాతం తక్కువగానే ఉన్నా ఇతర ప్రమాదాలు పొంచివున్నాయి... కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని, ఉరుములతో కూడిన వర్షం కురిసే సమయంలో పొలంలో ఉండరాదన్నారు. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని హెచ్చరించారు. వర్షం కురిసే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని... బయటకు రావద్దని ఏపీఎస్డిఎంఏ ఎండి ప్రఖర్ జైన్ జాగ్రత్తలు సూచించారు.
తెలంగాణ వాతావరణం..
ఇక తెలంగాణ విషయానికి వస్తే మరో రెండ్రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. మార్చి 23 వరకు అక్కడక్కడా వర్షాలు కురుస్తూ వాతావరణం చల్లగా ఉంటుందని... ఆ తర్వాత మళ్లీ ఎండలు మండిపోతాయని వెల్లడించింది. ఈ రెండ్రోజులు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని... ఆ తర్వాత క్రమంగా 2 నుండి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. మార్చి 24 నుండి మళ్లీ 36 నుండి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
నేడు ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు
ఇవాళ (మార్చి 21) తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని హెచ్చరించింది. ఇలా వర్షాలు కురిసే జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

