- Home
- Andhra Pradesh
- IMD Rain Alert : ఉపరితల ఆవర్తనంతోనే జోరువానలు, ఇప్పుడు ద్రోణి కూడా.. ఈ ప్రాంతాల్లో పెను బీభత్సమే
IMD Rain Alert : ఉపరితల ఆవర్తనంతోనే జోరువానలు, ఇప్పుడు ద్రోణి కూడా.. ఈ ప్రాంతాల్లో పెను బీభత్సమే
IMD Rain Alert : ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి… ఇప్పుడు ద్రోణి కూడా తోడయ్యింది. దీంతో వర్షబీభత్సం పెరిగే అవకాశాలున్నాయిని ఇరురాష్ట్రాల వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వర్షాలు
IMD Rain Alert : వేసవికాలంలో కూడా తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదిలిపెట్టడంలేదు. గత వారమంతా వర్షాలు కురిశాయి.. ఇవి ఈ వారం కూడా కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరో రెండుమూడు రోజులు ఎండల తీవ్రత తక్కువగా ఉంటుంది.. ఆకాశం మేఘాలతో కప్పేసి ఆహ్లాదకర వాతావరణం ఉంటుందట. సాయంత్రం వేళల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోతుందని... ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఉపరితల ఆవర్తనానికి తోడైన ద్రోణి..
ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే... ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇవాళ (సోమవారం, మార్చి 23న) ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఏపీకి పిడుగుల ప్రమాదం..తస్మాత్ జాగ్రత్త
బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇలా వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉంటుంది... అలాగే ఈదురుగాలులతో కొమ్మలు విరిగిపడతాయి... కాబట్టి ప్రజలెవ్వరూ చెట్లకింద ఉండరాదని హెచ్చరిస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసేటపుడు పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో కూడా ఉండరాదని.. సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని APSDMA సూచించింది.
ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్
తెలంగాణ విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు (మార్చి 23న) తెలంగాణలోని చాలాప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉంటుందని వెల్లడించింది.
తెలంగాణలో రేపు మళ్లీ జోరువానలు..
మార్చి 24న (మంగళవారం) అంటే రేపు తెలంగాణలో మళ్లీ వర్షాలు జోరందుకుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కోమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ వర్షాలకు ఉరుములు మెరుపులు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు తోడై ప్రమాదకంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ జిల్లాల్లోనే అత్యధిక వర్షపాతం..
ఇదిలావుంటే మార్చి 22న అంటే నిన్న ఆదివారం వర్షాలు కురిశాయి... అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 2.1 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. జిల్లాలవారిగా ఆదివారం కురిసిన సగటు వర్షపాతం చూసుకుంటే రంగారెడ్డిలో 0.4, నల్గొండలో 0.7, ఖమ్మంలో 0.6, భద్రాద్రి కొత్తగూడెంలో 0.6, జనగాం, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 0.1 చొప్పున వర్షపాతం నమోదయ్యింది.
ఆదివారం అత్యధిక వర్షపాతం నమోదైన టాప్ 10 ప్రాంతాలు...
- యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో అత్యధికంగా 14.8 మి.మీ వర్షపాతం నమోదయ్యింది.
- యాదాద్రి భువనగిరి ఆత్మకూరులో 13.5 మి.మీ
- నల్గొండ జిల్లా మర్రిగూడలో 11.7 మి.మీ
- ఖమ్మం జిల్లా యెర్రుపాలెంలో 11.0 మి.మీ
- నల్గొండ జిల్లా శాలిగౌరారంలో 5.1 మి.మీ
- రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లో 4.8 మి.మీ
- రంగారెడ్డి జిల్లా కందుకూరులో 4.4 మి.మీ
- యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో 4.1 మి.మీ
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లెలో 3.6 మి.మీ
- నల్గొండ జిల్లా చండూరులో 3.3 మి.మీ

