- Home
- Telangana
- IMD Rain Alert: ఉరుములు, మెరుపులు, వడగండ్ల వానలు.. వచ్చే 24 గంటలు అత్యంత జాగ్రత్త అవసరం
IMD Rain Alert: ఉరుములు, మెరుపులు, వడగండ్ల వానలు.. వచ్చే 24 గంటలు అత్యంత జాగ్రత్త అవసరం
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో విచిత్రం వాతావరణం కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాబోయే 24 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకు ఇప్పటికే అలర్ట్లు జారీ చేశారు.

హైదరాబాద్లో పాక్షిక మేఘావృతం..
భాగ్యనగరంలో నేడు ఆకాశం పాక్షిక మేఘావృతంగా ఉండనుంది. ఉదయం సమయంలో వాతావరణం కొంత చల్లగా ఉన్నా, మధ్యాహ్నం తర్వాత ఎండ ప్రభావం పెరగవచ్చు. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 32°C నుంచి 34°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత సుమారు 22°C వద్ద ఉండవచ్చు. సాయంత్రం సమయానికి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశాన్ని వాతావరణ శాఖ సూచించింది. వేడి గాలులు మధ్యాహ్నం సమయంలో కొంత ప్రభావం చూపవచ్చు. గాలి నాణ్యత సాధారణ స్థాయిలోనే ఉందని అధికారులు తెలిపారు.
తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్
బంగాళాఖాతం నుంచి వీస్తున్న తేమ గాలుల కారణంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఉత్తర, తూర్పు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా. ఇక నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్నగర్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 36°C దాటే అవకాశముందని తెలిపింది.
దేశవ్యాప్తంగా మారుతున్న వాతావరణం
భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం తూర్పు, మధ్య, ఈశాన్య భారతదేశంలో వర్షపాతం విస్తరించే అవకాశం ఉంది. పిడుగులు, ఈదురుగాలులు, కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కూడా నమోదయ్యే సూచనలు ఉన్నాయి. సబ్ హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో 24 వరకు విస్తృతంగా వర్షాలు పడవచ్చని అంచనా. గంగేటిక్ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో గంటకు 80 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఒడిశాలో కూడా బలమైన ఈదురుగాలులతో వడగళ్ల వాన పడే సూచనలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరం, త్రిపురలో విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉంది. అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాన్ని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో పిడుగులుపడే అవకాశం
ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశముంది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
రైతులు, ప్రజలకు జాగ్రత్త సూచనలు
ప్రస్తుతం కోత దశలో ఉన్న పంటల విషయంలో రైతులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులు కనిపించిన సమయంలో చెట్ల కింద నిలబడకూడదు. విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాల దగ్గర ఉండటం ప్రమాదకరం. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మెరుపులు ఉన్న సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. మధ్యాహ్నం సమయంలో UV ఇండెక్స్ 9 వరకు నమోదవుతున్నందున ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల మధ్య నేరుగా ఎండలో ఎక్కువసేపు తిరగకపోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా రాబోయే రెండు నుంచి మూడు రోజులపాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

