Hyderabad: నెలకు రూ. 67 లక్షల అద్దె.. హైదరాబాద్లో ఫేస్బుక్ పెద్ద స్కెచ్
Hyderabad: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. మెటాకి చెందిన భారతీయ విభాగం హైదరాబాద్లో తన కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా అడుగు వేసింది.

హైదరాబాద్లో ఫేస్బుక్ ఇండియా విస్తరణ
సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta)కి చెందిన భారతీయ విభాగం Facebook India Online Services Pvt Ltd హైదరాబాద్లో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. నగరంలోని ప్రముఖ ఐటీ కారిడార్ అయిన హైటెక్ సిటీలో కొత్తగా భారీ కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకుంది.
ఐదేళ్ల లీజ్… దాదాపు 70 వేల చదరపు అడుగుల స్థలం
ఫేస్బుక్ ఇండియా 69,702 చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని ఐదేళ్ల కాలానికి లీజుకు తీసుకుంది. ఈ స్థలం హైటెక్ సిటీలోని స్కైవ్యూ 20 భవనం (The Skyview)లో ఉంది. ఈ లీజ్ ఒప్పందాన్ని 2025 డిసెంబర్ 2న కుదుర్చుకోగా, డిసెంబర్ 18 నుంచి అద్దె చెల్లింపు ప్రారంభమైంది.
నెలకు రూ.67 లక్షల అద్దె…
ఈ కార్యాలయ స్థలానికి ఫేస్బుక్ ఇండియా నెలకు సుమారు రూ.67 లక్షలు అద్దెగా చెల్లిస్తోంది. లీజ్ ఒప్పందం ప్రకారం మూడేళ్ల తర్వాత అద్దె 15 శాతం పెరుగుతుంది. ఈ భవనాన్ని మహంగా కమర్షియల్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి లీజుకు తీసుకున్నారు. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ డేటా సంస్థ CRE Matrix వెల్లడించింది.
హైదరాబాద్ – గ్లోబల్ టెక్ కంపెనీలకు కీలక కేంద్రం
ఫేస్బుక్ ఈ నిర్ణయం హైదరాబాద్ వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్ బలాన్ని మరోసారి చాటుతోంది. CRE Matrix సీఈవో అభిషేక్ కిరణ్ గుప్తా మాట్లాడుతూ, హైటెక్ సిటీ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (GCC)గా, టెక్నాలజీ హబ్గా కొనసాగుతుందని తెలిపారు. భారీ ఎత్తున అద్దె చెల్లించడానికి అంతర్జాతీయ కంపెనీలు సిద్ధంగా ఉండటం, హైదరాబాద్ ప్రాముఖ్యతకు నిదర్శనమన్నారు.
2010 నుంచే హైదరాబాద్లో మెటా ఉనికి
మెటా సంస్థ 2010లోనే హైదరాబాద్లో తన తొలి కార్యాలయాన్ని ప్రారంభించింది. 2024 చివర్లో కూడా ఇదే స్కైవ్యూ ప్రాజెక్టులో 3.67 లక్షల చదరపు అడుగుల స్థలానికి మరో ఐదేళ్ల లీజ్ను పునరుద్ధరించింది. ఆ ఒప్పందాల ద్వారా మెటా మొత్తం రూ.170 కోట్ల అద్దె చెల్లించనుంది. ఇదిలా ఉండగా, 2025లో దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో కార్యాలయ స్థలాల లీజింగ్ రికార్డు స్థాయి 82.6 మిలియన్ చదరపు అడుగులకు చేరినట్లు CBRE ఇండియా నివేదిక తెలిపింది.

