Gold Price: వెనిజులాలో బంగారం ధర ఎంతో తెలిస్తే.. వెంటనే ఫ్లైట్ ఎక్కేస్తారు..
Gold Price: అమెరికా దాడుల నేపథ్యంలో వెనిజులా పేరు మారుమోగుతోంది. ఈ దేశానికి సంబంధించి ఏ చిన్న వార్త అయినా నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో వెనిజులాలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక కప్పు టీ ధరకే బంగారం…
ఒక గ్రాము బంగారం కొనాలంటే భారత్లో వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితికి పూర్తిగా భిన్నంగా దక్షిణ అమెరికాలోని వెనిజులా దేశంలో బంగారం ధర ఒక కప్పు టీ ధరకంటే తక్కువగా ఉంది. వినడానికి నమ్మశక్యం కాకపోయినా ఇది అక్కడి నేటి వాస్తవం.
181 రూపాయలకే 24 క్యారెట్ గోల్డ్
ప్రస్తుతం భారత్లో 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు సుమారు రూ.13,800కి పైగానే ఉంది. అదే బంగారం వెనిజులాలో మాత్రం భారత కరెన్సీ లెక్కన కేవలం రూ.181 దగ్గరే లభిస్తోంది. 22 క్యారెట్ బంగారం ధర అయితే ఇంకా తక్కువగా రూ.166 వరకు పడిపోయింది. ఇంత తక్కువ ధరలు అక్కడి ప్రజలకు సంతోషం కలిగించేవి కావు. అవి దేశ ఆర్థిక పతనానికి అద్దం పడుతున్న దృశ్యం.
కరెన్సీ పతనమే అసలు కారణం
వెనిజులా కరెన్సీ పేరు ‘వెనిజులన్ బోలివర్’. గత కొన్నేళ్లుగా ఈ కరెన్సీ విలువ పూర్తిగా క్షీణించింది. తీవ్రమైన ద్రవ్యోల్బణం కారణంగా అక్కడ డబ్బుకు విలువ లేకుండా పోయింది. అదే సమయంలో బంగారం ధరలు స్థానిక కరెన్సీలో పెరిగినా, అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే అవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ప్రపంచానికి అక్కడ బంగారం చౌకగా కనిపిస్తోంది.
స్విట్జర్లాండ్కు తరలిన బంగారు నిల్వలు
అంతర్జాతీయ కథనాల ప్రకారం, నికోలస్ మదురో పాలన కాలంలో వెనిజులా ప్రభుత్వం పెద్ద ఎత్తున బంగారు నిల్వలను విదేశాలకు తరలించింది. 2013 నుంచి 2016 మధ్యకాలంలో సుమారు 113 మెట్రిక్ టన్నుల బంగారం స్విట్జర్లాండ్కు పంపినట్లు రిపోర్ట్ లు చెబుతున్నాయి. అప్పులు తీర్చడం, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం ప్రభుత్వం గోల్డ్ రిజర్వ్ను విపరీతంగా వినియోగించింది. ఫలితంగా 2024 నాటికి వెనిజులా వద్ద మిగిలిన అధికారిక బంగారం కేవలం 161 టన్నులకే పరిమితమైంది.
వేల టన్నుల ఖనిజ సంపద ఉన్నా ప్రజలు పేదరికంలో
వెనిజులా పేద దేశం కాదు. ఇది ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశాల్లో ఒకటి. ప్రపంచ క్రూడ్ ఆయిల్ నిల్వల్లో సుమారు 17 శాతం వెనిజులా వద్దే ఉంది. అంతేకాదు ‘ఒరినోకో మైనింగ్ ఆర్క్’ ప్రాంతంలో 8,000 టన్నులకుపైగా బంగారం, వజ్రాలు, బాక్సైట్ వంటి ఖనిజాలు ఉన్నట్లు అధికారిక అంచనాలు చెబుతున్నాయి. అయినా సరైన విధానాలు లేకపోవడం, అవినీతి, పాలనా వైఫల్యం కారణంగా 2024 నాటికి అక్కడ అధికారిక బంగారం ఉత్పత్తి కేవలం 30.6 టన్నులకే పరిమితమైంది. ఈ పరిస్థితి దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది.

