- Home
- Entertainment
- Viral Song: రూ. 3 లక్షలతో తీస్తే కోటికి పైగా వచ్చాయి.. ఏకంగా బిగ్బాస్కే కార్పెట్ వేసింది. ఇదీ పాటకున్న శక్తి
Viral Song: రూ. 3 లక్షలతో తీస్తే కోటికి పైగా వచ్చాయి.. ఏకంగా బిగ్బాస్కే కార్పెట్ వేసింది. ఇదీ పాటకున్న శక్తి
Viral Song: మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఒక్క పాటలో చెప్పొచ్చని అంటారు. మరీ ముఖ్యంగా ఇటీవల తెలంగాణ జానపద గీతాలకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. ఇటీవల సంచలనం సృష్టించిన అలాంటి ఓ జానపద గేయం రాను బొంబాయికి రాను.

జనాల్లోకి దూసుకెళ్లిన జానపద సంచలనం
తెలంగాణ జానపద గీతాల్లో అరుదైన స్థానం సంపాదించిన పాట రాను బొంబాయికి రాను. జాతర్లు, పెళ్లిళ్లు, ఆటోలు, పబ్బులు అన్న తేడా లేకుండా ఈ పాట వినిపిస్తోంది. యూట్యూబ్లో ప్రస్తుతం ఈ వీడియోకు 709,950,351 వ్యూస్ వచ్చాయి అంటే, పాట ఎంత బలంగా ప్రజల్లోకి వెళ్లిందో అర్థమవుతుంది. ఒక జానపద ఆల్బమ్ ఈ స్థాయి రికార్డు సృష్టించడం నిజంగా విశేషం.
16 ఏళ్ల ప్రయాణం తర్వాత విజయం
ఈ పాట వెనుక ఉన్న వ్యక్తి రాము రాథోడ్. ఆయన రాత్రికి రాత్రే స్టార్ కాలేదు. దాదాపు 16 సంవత్సరాలుగా జానపద సంగీత రంగంలో కొనసాగుతున్నారు. ఎన్నో పాటలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఐదు, ఆరు ప్రయత్నాల తర్వాతే రాను బొంబాయికి రాను నిజమైన బ్రేక్ ఇచ్చింది. ఈ పాట ఇచ్చిన పాపులారిటీతో ఏకంగా బిగ్బాస్ హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అదృష్టం కంటే కష్టం, పాటలో ఉన్న ఫీలింగ్, ప్రజల నాడిని పట్టుకున్న లిరిక్స్ ఈ విజయానికి అసలు కారణమని రాము చెబుతారు.
యూట్యూబ్ అపోహలపై రాము రాథోడ్ స్పష్టత
ఈ మధ్య యూట్యూబ్లో పెట్టుబడి పెడితే వెంటనే కోట్లు వస్తాయనే భ్రమ పెరుగుతోంది. దీనిపై రాము రాథోడ్ మాట్లాడారు. అప్పులు చేసి ఈ రంగంలోకి రావద్దన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా బలహీనులు మోసపోవద్దని సూచించారు. చిన్న స్థాయి నుంచి క్రమంగా ఎదగాలి అన్నారు. బలమైన పునాదులు లేకుండా ఒక్కసారిగా పైకి వెళ్లితే ఆ విజయం నిలవదని స్పష్టం చేశారు. పట్టుదల, నిరంతర శ్రమ ఉంటేనే ఈ రంగంలో నిలబడగలమని చెప్పారు.
709 మిలియన్ వ్యూస్… ఎంత ఆదాయం వచ్చి ఉండొచ్చు?
ఈ వీడియోకు ఇప్పటివరకు వచ్చిన 709.9 మిలియన్ వ్యూస్ ఆధారంగా అంచనా వేస్తే యూట్యూబ్లో భారతీయ జానపద కంటెంట్కు సగటున 1000 వ్యూస్కు రూ.20 – రూ.40 మధ్య ఆదాయం వస్తుంది. ఈ లెక్కన మొత్తం గ్రాస్ ఆదాయం సుమారు రూ.1.4 కోట్లు నుంచి రూ.2.8 కోట్లు మధ్య ఉండే అవకాశం ఉంది. యూట్యూబ్ వాటా తీసేసిన తర్వాత క్రియేటర్ చేతికి వచ్చే మొత్తం సుమారు రూ.80 లక్షలు నుంచి రూ.1.5 కోట్లు మధ్య ఉండొచ్చని అంచనా. రెండు కోట్లు సంపాదించారన్న ప్రచారంలో నిజం లేదని రాము ఇప్పటికే స్పష్టం చేశారు.
ఎక్కడ చిత్రీకరించారంటే.?
కేవలం రూ.3 లక్షల బడ్జెట్తో ఈ పాటను తెరకెక్కించారు. రాము రాథోడ్ లిరిక్స్ రాశారు. కళ్యాణ్ కీస్ సంగీతం అందించారు. ప్రభ, రాము కలిసి గానం చేశారు. వేములవాడలో మొదటి షూట్ జరిగింది. క్లైమాక్స్ కోసం జగిత్యాలలో మళ్లీ చిత్రీకరణ చేశారు. శేఖర్ వైరస్ మాస్టర్ రూపొందించిన ఉత్సాహభరిత డ్యాన్స్ స్టెప్పులు పాటకు మరో బలంగా మారాయి.

