- Home
- Telangana
- హైదరాబాద్లో బయటపడ్డ మరో కల్తీ దందా.. ఉస్మానియా బిస్కెట్స్ కావివి ప్రాణాలు తీసే విషం
హైదరాబాద్లో బయటపడ్డ మరో కల్తీ దందా.. ఉస్మానియా బిస్కెట్స్ కావివి ప్రాణాలు తీసే విషం
Hyderabad: కల్తీ రాయుళ్ల అగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అన్నింటినీ కల్తీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లో మరో కల్తీ కథ వెలుగులోకి వచ్చింది. మనం ఎంతో ఇష్టంగా తినే బిస్కెట్లను సైతం కేటుగాళ్లు వదలడం లేదు.

నకిలీ ఉస్మానియా బిస్కెట్స్
హైదరాబాద్ పేరు వినగానే గుర్తుకు వచ్చే ప్రత్యేకమైన ఆహారాల్లో ఉస్మానియా బిస్కెట్ ఒకటి. ఇరానీ చాయ్తో కలిసి తినే ఈ బిస్కెట్ నగర సంస్కృతిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. తీపి–ఉప్పు రుచుల కలయికతో ఉండే ఈ బిస్కెట్ నిజాం కాలం నుంచి హైదరాబాదుతో అనుబంధం కలిగి ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఐకానిక్ బిస్కెట్ పేరు చెప్పుకుని కొందరు కల్తీ ఉత్పత్తులు తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు. తాజాగా హైదరాబాద్లో పలుచోట్ల జరిగిన దాడుల్లో ఈ అక్రమ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి.
బయటపడ్డ కల్తీ బిస్కెట్ల తయారీ
నగరంలో కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా బేకరీ యూనిట్లు నడుస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో మైలార్దేవ్పల్లి, గుడిమల్కాపూర్ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో అపరిశుభ్ర వాతావరణంలో తయారవుతున్న ఉస్మానియా బిస్కెట్లు, రస్కులు, నమ్కీన్, మిక్చర్, చిక్కీలు వంటి ఉత్పత్తులు బయటపడ్డాయి. నగరంలోని చిన్న దుకాణాలకు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంచిన భారీ పరిమాణంలో బేకరీ సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 99 కార్టన్ల కల్తీ ఆహార పదార్థాలు పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసి, చట్టపరమైన కేసులు నమోదు చేశారు.
అపరిశుభ్ర ఫ్యాక్టరీల్లో ప్రమాదకర తయారీ
అంబర్పేట్, గోల్నాక, కేడీ కాలనీ వంటి ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో మరింత ఆందోళనకర విషయాలు బయటపడ్డాయి. కొన్ని బిస్కెట్ తయారీ కేంద్రాల్లో నాసిరకం ముడి సరుకులు, కుళ్లిపోయిన గుడ్లు, నిషేధిత రసాయనాలు, ఆహార రంగులు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. బిస్కెట్లు ఆకర్షణీయంగా కనిపించేందుకు ప్రమాదకర కెమికల్స్ ఉపయోగిస్తున్నట్లు కూడా తేలింది. కనీస ఆరోగ్య ప్రమాణాలు కూడా పాటించడం లేదని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో తయారయ్యే బిస్కెట్లు ప్రజలకు అనారోగ్య సమస్యలు కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
నిందితుల అరెస్ట్ – భారీ సరుకు స్వాధీనం
ఈ కేసుల్లో భాగంగా మున్నీర్, అరుణ్ కుమార్, మస్థాన్ రెడ్డి, విశాల్ జైన్, అహ్మద్ రజా, మేరాజ్ వంటి పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.3.35 లక్షల విలువైన కల్తీ ఆహార పదార్థాలు, ముడి సరుకులు, రసాయనాలు, ఆహార రంగులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని కిరాణా దుకాణాలు, హోటళ్లు, బేకరీలు, కేఫ్లకు ఈ ఉత్పత్తులు సరఫరా చేస్తున్నట్లు విచారణలో బయటపడింది. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
iconic Osmania biscuit faces a threat! Four arrested after raids on illegal food and bakery units in Mailardevpally and Gudimalkapur. Adulterated mixture, namkeen, and biscuits produced in unhygienic conditions were found. 99 cartons of goods, ready for distribution across the… pic.twitter.com/9Lob4UNL1e
— Ashish (@KP_Aashish) March 29, 2026
కల్తీ బిస్కెట్లను ఎలా గుర్తించాలి?
ప్రజలు జాగ్రత్తగా ఉంటే ఇలాంటి నాసిరకం ఉత్పత్తులను గుర్తించడం సాధ్యమే. కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాలి.
ప్యాకింగ్ వివరాలు చూడాలి:
బిస్కెట్ ప్యాకెట్పై తయారీ సంస్థ పేరు, చిరునామా, తయారీ తేదీ, గడువు తేదీ ఉండాలి.
FSSAI లైసెన్స్ నంబర్:
ఆహార పదార్థాలపై తప్పనిసరిగా FSSAI నంబర్ ఉండాలి. అది లేకపోతే కొనడం మంచిది కాదు.
ప్యాకెట్ సీలింగ్:
ప్యాకెట్ సరిగ్గా సీల్ చేసి ఉందా లేదా చూడాలి. లూజ్ ప్యాకింగ్ ఉన్న ఉత్పత్తులు కొనకపోవడం మంచిది.
బిస్కెట్ రంగు, వాసన
బిస్కెట్లు చాలా ప్రకాశవంతమైన రంగులో ఉండటం లేదా అసహజమైన వాసన వస్తే అనుమానించాలి.
విశ్వసనీయ దుకాణాల నుంచి కొనాలి:
ప్రసిద్ధ బేకరీలు లేదా విశ్వసనీయ దుకాణాల నుంచి మాత్రమే కొనుగోలు చేయడం సురక్షితం.

