హైదరాబాద్ శివార్లలో మరో సికింద్రాబాద్ లోడింగ్.. ఈ నాలుగు ప్రాంతాల్లో రియల్ బూమ్ ఖాయం
Hyderabad : తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్ శివారుప్రాంతాలకు మహర్దశ రానుంది. నగరానికి నాలుగు దిక్కులా నాలుగు భారీ బస్టాండ్స్ నిర్మించేందుకు సర్కార్ సిద్దమయ్యింది.

హైదరాబాద్ శివారు ప్రాంతాలకు మహర్దశ...
Hyderabad : తెలంగాణ రాజధాని హైదరాబాద్ చాలా వేగంగా విస్తరిస్తోంది... దీంతో నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడంలేదు. వివిధ పనులపై నగరానికి వచ్చేవారి పరిస్థితి మరింత దారుణం... జిల్లాల నుండి శివారు ప్రాంతాలకు చేరుకోవడం ఒక ఎత్తు... అక్కడినుండి నగరంలోకి చేరుకోవడం మరో ఎత్తు అన్నట్లు పరిస్థితి తయారయ్యింది. ఉదయం, సాయంత్రం సమయంలో అయితే ట్రాఫిక్ కష్టాలు మరింత తీవ్రతరం అవుతున్నాయి... గంటలకు గంటలు రోడ్లపైనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. అందుకే ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టిపెట్టిన ప్రభుత్వం హైదరాబాద్ రూపురేఖలను మార్చే దిశగా అడుగులు వేస్తోంది.
హైదరాబాద్ శివార్లలో భారీ బస్టాండ్ లు..
హైదరాబాద్ లో ట్రాఫిక్ కు ప్రధాన కారణం పెద్ద వాహనాలు. లారీలు వంటి పెద్దపెద్ద సరుకు రవాణా వాహనాలకు రాత్రి మాత్రమే నగరంలోకి అనుమతి ఉంది... అంటే వీటివల్ల ట్రాఫిక్ సమస్య లేదు. సమస్యంతా బస్సులతోనే... ప్రైవేట్ ట్రావెల్స్ తో పాటు ఆర్టిసి బస్సుల వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నట్లు గుర్తించింది ప్రభుత్వం. అందుకే ఆర్టిసి బస్సులను నగర శివారుకే పరిమితం చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది.
జిల్లాలనుండి వచ్చే బస్సులు నగర నడిబొడ్డున గల మహాత్మాగాంధీ బస్టాండ్ (MGBS), జూబ్లీ బస్టాండ్ (JBS) కు రావాల్సి ఉంటుంది. ఇలా నగరమంతా చుట్టేసి వచ్చే బస్సుల వల్ల ట్రాఫిక్ ఇబ్బందలు ఎదురవుతున్నాయి. అందుకే హైదరాబాద్ కు నాలుగుదిక్కులా భారీ బస్టాండ్స్, టెర్మినల్స్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది... జిల్లాల బస్సులు నగరంలోకి రాకుండా ఈ ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది.
ఎక్కడెక్కడ బస్టాండ్ లు రానున్నాయి..?
విమానాశ్రయానికి వెళ్లే నగరవాసులకే కాదు జిల్లాల ప్రజలకు అనువుగా ఉండేలా శంషాబాద్ లో భారీ బస్టాండ్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది. దీంతో దక్షిణ హైదరాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. జిల్లాల నుండి విమానాశ్రయానికి వచ్చేవారికి కూడా ఈ బస్టాండ్ అనువుగా ఉంటుంది.
ఇక ఆరాంఘర్ ప్రాంతంలో మరో బస్టాండ్ నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనివల్ల మహబూబ్ నగర్ తో పాటు రాయలసీమ నుండి వచ్చే బస్సులను శివారులోనే ఆపవచ్చు. హైదరాబాద్-బెంగళూరు హైవే (NH 44) మీదుగా ప్రయాణించే బస్సులన్నీ ఇక్కడే ఆగుతాయి. దీనివల్ల ఆరాంఘర్ తర్వాత మొదలయ్యే రద్దీ కాస్త తగ్గుతుంది.
ఎల్బి నగర్, లింగంపల్లిలో రియల్ బూమ్ ఖాయం
ఎల్బి నగర్ సమీపంలో ఇంకో బస్టాండ్ నిర్మించనున్నారు. నల్గొండతో పాటు విజయవాడ నుండి వచ్చే బస్సులు ఇక్కడ ఆగనున్నాయి. ఈ మార్గంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది... వీటిని నియంత్రించేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
హైదరాబాద్-ముంబై హైవేపై రద్దీని తగ్గించేందుకు లింగంపల్లిలో బస్టాండ్ నిర్మించేందుకు సర్కార్ సిద్దమవుతోంది. ఇప్పటికే పటాన్ చెరులో బస్టాండ్ ఉన్నా అది సిటీబస్సులకే పరిమితం అవుతోంది... జిల్లాల నుండి వచ్చే బస్సులకు సరిపోవడంలేదు. అందుకే లింగంపల్లిలో భారీ బస్టాండ్ నిర్మించాలని భావిస్తోంది ప్రభుత్వం.... ఇక్కడ సంగారెడ్డి, జహిరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల బస్సులతో పాటు కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా, షోలాపూర్ నుండి వచ్చే బస్సులను ఆపనున్నారు. నగర శివారులోనే ప్రయాణికులు దిగి ట్రాఫిక్ సమస్య లేకుండా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
మారనున్న శివారుప్రాంతాల రూపురేఖలు..
నూతన బస్టాండ్స్ రాకతో హైదరాబాద్ శివారు ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయి. బస్టాండ్స్ అందుబాటులోకి వస్తే ఇతర ప్రాంతాలనుండి వచ్చే ప్రయాణికుల సందడి పెరుగుతుంది కాబట్టి బిజినెస్ అవకాశాలు మెరుగుపడతాయి. కాబట్టి ఆటోమెటిగ్గా వ్యాపారులు ఈ ప్రాంతాల్లో బిజినెస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు... తద్వారా పెద్దపెద్ద కాంప్లెక్స్ లు, కమర్షియల్ బిల్డింగ్స్ వెలుస్తాయి. ఇలా చూస్తుండగానే రియల్ ఎస్టేట్ జోరు పెరిగి ఆ ప్రాంతాల్లో స్థలాలు, ఇళ్ల ధరలు ఊహించని విధంగా పెరగడం ఖాయం... ఇంకా చెప్పాలంటే ఈ బస్టాండ్స్ రాకతో శివారుప్రాంతాల దశ తిరిగిపోనుంది.

