RRR: ఆర్ఆర్ఆర్ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక ఆ ప్రాంతాలన్నీ సిటీలు కాబోతున్నాయి !
RRR Project: తెలంగాణలో ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.9,362 కోట్లతో 6 వరుసల ఎక్స్ప్రెస్వే రానుండటంతో ఆయా ప్రాంతాలు సిటీలుగా మారనున్నాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఆర్ఆర్ఆర్ దెబ్బకు ఆ ఊర్లన్నీ ఇక షాద్ నగర్, శంషాబాద్ రేంజ్ సిటీలు కాబోతున్నాయ్
తెలంగాణ రవాణా రంగాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలను పూర్తిగా మార్చేసే భారీ ప్రాజెక్ట్ 'రీజినల్ రింగ్ రోడ్డు' (RRR) కోసం ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఈ ప్రాజెక్ట్ కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సరికొత్త టెండర్ నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. గతంలో ఉన్న ఐదు ప్యాకేజీల కన్ఫ్యూజన్ను పక్కన పెట్టి, ఈసారి కేవలం రెండు ప్యాకేజీలతో పనులను స్పీడప్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ ఒక్క నిర్ణయంతో తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెక్స్ట్ లెవెల్కు వెళ్లనుంది.

ఆ ప్రాంతాలన్నీ ఇక సిటీలే.. రియల్ ఎస్టేట్ బూమ్ మామూలుగా ఉండదు
ఈ ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ కేవలం ఒక రోడ్డు మాత్రమే కాదు, తెలంగాణ పాలిట ఒక కల్పవృక్షం కాబోతోంది. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి మొదలై మెదక్, సిద్దిపేట జిల్లాల మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లా తంగడ్పల్లి వరకు ఈ రోడ్డు కనెక్ట్ అవుతుంది.
ఈ రూట్ పరిధిలోకి వచ్చే గజ్వేల్, ప్రజ్ఞాపూర్, భువనగిరి, సంగారెడ్డి వంటి ప్రాంతాలు రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరానికి ఏమాత్రం తీసిపోని విధంగా గ్లోబల్ సిటీలుగా మారబోతున్నాయి. ఇప్పటికే ఆయా రూట్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం రాకెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. ఐటీ కారిడార్లు, ఇండస్ట్రియల్ హబ్లు ఇక్కడికి క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
రూ.9,362 కోట్లతో 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే.. రూట్ మ్యాప్ ఇదే
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును మొత్తం 161.518 కిలోమీటర్ల మేర ఆరు వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేగా నిర్మిస్తున్నారు. దీని సివిల్ పనుల అంచనా వ్యయం రూ.9,362.4 కోట్లు. ఈ రహదారికి కేంద్రం ‘NH-161AA’ అనే అధికారిక నంబరును కూడా కేటాయించింది.
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ పనులను మరింత వేగవంతం చేసేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రెండు ప్రధాన ప్యాకేజీలుగా విభజించింది.
ప్యాకేజీ-1 (సంగారెడ్డి - సిద్దిపేట): ఈ మొదటి ప్యాకేజీ కింద సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుండి సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వరకు పనులు జరగనున్నాయి. ఈ రూట్ మొత్తం పొడవు 83.518 కిలోమీటర్లు కాగా, దీని నిర్మాణానికి రూ. 4,918.71 కోట్ల అంచనా వ్యయాన్ని కేటాయించారు.
ప్యాకేజీ-2 (సిద్దిపేట - యాదాద్రి): ఇక రెండో ప్యాకేజీ కింద సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ నుండి యాదాద్రి భువనగిరి జిల్లా తంగడ్పల్లి వరకు ఎక్స్ప్రెస్వేను నిర్మిస్తారు. ఈ మార్గం పొడవు 78 కిలోమీటర్లు కాగా, దీని కోసం రూ. 4,443.69 కోట్ల అంచనా వ్యయాన్ని ఖరారు చేశారు.
ఈ టెండర్లను డిజైన్, బిల్ట్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ యాన్యుటీ లేదా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో చేపట్టనున్నారు. జులై 7 లోపు బిడ్లు దాఖలు చేయడానికి గడువు ఇచ్చారు. జులై 8న టెక్నికల్ బిడ్స్ ఓపెన్ చేస్తారు.
అంతర్జాతీయ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్.. నైన్ పాయింట్స్ కనెక్టివిటీ
ఈ ఎక్స్ప్రెస్వేలో ప్రయాణంలో ట్రాఫిక్ జామ్లు అనే మాటే వినపడకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణాలను ప్లాన్ చేశారు. ఈ 161 కిలోమీటర్ల పరిధిలో ఏకంగా 44 పెద్ద వంతెనలు, 127 చిన్న వంతెనలు, 4 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, 44 అండర్ పాస్లు, 1,262 కల్వర్టులు రాబోతున్నాయి.
వీటితో పాటు స్మార్ట్ టోలింగ్ కోసం 9 మోడరన్ టోల్ప్లాజాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోడ్డు మొత్తం 9 వేర్వేరు ప్రాంతాల్లో ఇప్పుడున్న నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్తో లింక్ అవుతుంది. దీనివల్ల ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గిపోతుంది.
రెండేళ్ల సస్పెన్స్కు ఎండ్ కార్డ్
గత రెండేళ్లుగా ఈ ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం పనులపై ఎన్హెచ్ఏఐ (NHAI) రకరకాల ట్రయల్స్ వేసింది. 2024లో మొదట 4 వరుసల రోడ్డు అనుకున్నా, భవిష్యత్తు ట్రాఫిక్ను తట్టుకునేందుకు 2025లో 6 వరుసలుగా మార్చారు. గతంలో కొన్ని టెక్నికల్ డాక్యుమెంట్స్ సమస్య వల్ల టెండర్లు క్యాన్సిల్ అయ్యాయి.
కానీ ఈసారి అలా కాకుండా చాలా పక్కాగా ఆన్లైన్ పేపర్స్ అప్లోడ్ చేశారు. ప్రస్తుతం ల్యాండ్ అక్విజిషన్ కూడా దాదాపు 70 శాతానికి పైగా పూర్తయింది. టెండర్ ఫైనల్ అయి, అగ్రిమెంట్ కుదిరిన మూడేళ్లలో అంటే ఎలాంటి అడ్డంకులు లేకపోతే 2029 నాటికి ఈ ఆర్ఆర్ఆర్ నార్త్ ఫేజ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇది పూర్తయితే ఔటర్ రింగ్ రోడ్ పై ఒత్తిడి తగ్గి, హైదరాబాద్ చుట్టూ ఒక అద్భుతమైన ఎకనామిక్ జోన్ క్రియేట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

