- Home
- Telangana
- Weather Update: ఏపీ, తెలంగాణకు ఐఎండీ వార్నింగ్.. అల్పపీడనం ఎఫెక్ట్తో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Weather Update: ఏపీ, తెలంగాణకు ఐఎండీ వార్నింగ్.. అల్పపీడనం ఎఫెక్ట్తో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Weather Update: అల్పపీడనం, ద్రోణి ఎఫెక్ట్తో తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 5 వరకు వర్షాలు కురవనున్నాయి. భారత వాతావరణ శాఖ 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే, మత్స్యకారులకు హెచ్చరికలు జారీ అయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కూల్ అయింది. గత రెండు రోజులుగా పలు చోట్ల వానలు పడుతుండగా, రాబోయే కొద్ది రోజులు కూడా ఇదే వాతావరణం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో అధికారులు ముందస్తు జాగ్రత్తగా 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
అల్పపీడనం, రుతుపవన ద్రోణి ఎఫెక్ట్ తో వర్షాలు
ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి దాదాపు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా కదులుతూ.. పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ ఉత్తరప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, మధ్యప్రదేశ్ నుంచి తూర్పు-మధ్య బంగాళాఖాతం వరకు మరొక రుతుపవన ద్రోణి కూడా విస్తరించి ఉంది. ఈ రెండు తీవ్ర వాతావరణ వ్యవస్థలు ఒకేసారి క్రియాశీలకంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఊపందుకున్నాయి.
ఏపీలో కోస్తా, రాయలసీమకు సెప్టెంబర్ 5 వరకు అలర్ట్
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, కోస్తాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో సెప్టెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో తీర ప్రాంతాల్లో గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
తెలంగాణలో ఏయే జిల్లాల్లో వర్షలు పడనున్నాయి?
తెలంగాణలో కూడా వాతావరణం మారింది. ఉత్తర, దక్షిణ జిల్లాల్లో గాలిలో తేమ శాతం పెరగడంతో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం ఒక్కసారిగా కూల్ అయింది. పగటి ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల నుంచి 30 డిగ్రీలకు పడిపోగా, రాత్రి వేళల్లో 22 నుంచి 23 డిగ్రీలు నమోదుకావచ్చు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మధ్యాహ్నం వరకు అక్కడక్కడ భారీ నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముంది.
నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో సాయంత్రం వర్షాలు పడే అవకాశం ఉంది. రాజధాని హైదరాబాద్లోనూ మధ్యాహ్నం నుంచి రాత్రి సమయంలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు లేదా మోస్తరు వర్షం పడవచ్చు. అయితే నగరం మొత్తంగా కాకుండా స్థానిక పరిస్థితుల బట్టి కొన్ని ప్రాంతాలకే ఈ వర్షాలు పరిమితం కానున్నాయి.
మత్స్యకారులకు అలర్ట్
బంగాళాఖాతం తీవ్ర అలజడిగా మారి, సముద్రంలో కెరటాలు ఎగసిపడే సూచనలు ఉన్నందున సెప్టెంబర్ 3, 4 తేదీల్లో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు పడే సమయంలో సాధారణ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షం పడుతున్నప్పుడు అనవసరంగా బయటకు రాకుండా ఇంట్లో ఉండాలనీ, విద్యుత్ స్తంభాలు, భారీ చెట్లు, పాత గోడలు, ఫ్లెక్సీ హోర్డింగ్స్ కింద నిల్చోవద్దని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు ఉరుములు వస్తే వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

