Vaibhav Suryavanshi : ధోనీని గుర్తు చేసిన వైభవ్ సూర్యవంశీ హెలికాప్టర్ షాట్
Vaibhav Suryavanshi Helicopter Shot : అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్పై భారత్ రికార్డు విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ హెలికాప్టర్ షాట్ వైరల్ కాగా, ఆరోన్ జార్జ్ సెంచరీతో భారత్ 10వ సారి ఫైనల్కు చేరింది.

అండర్-19 వరల్డ్ కప్లో భారత్ ప్రభంజనం.. వైభవ్ దుమ్మురేపాడు
అండర్-19 వరల్డ్ కప్ 2026లో భారత యంగ్ జట్టు చరిత్ర సృష్టించింది. బుధవారం జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్ పోరులో అఫ్గానిస్థాన్ను 7 వికెట్ల తేడాతో ఓడించి భారత్ రికార్డు స్థాయిలో 10వ సారి ఫైనల్లోకి ప్రవేశించింది. భారీ లక్ష్య ఛేదనలో వైభవ్ సూర్యవంశీ మెరుపులు, ఆరోన్ జార్జ్ అద్భుత సెంచరీతో భారత్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.
వైభవ్ సూర్యవంశీ హెలికాప్టర్ షాట్.. ధోనీని గుర్తుచేశాడు !
ఈ మ్యాచ్లో అందరి దృష్టిని ఆకర్షించింది 14 ఏళ్ల యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. 206.06 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన వైభవ్, అఫ్గాన్ బౌలర్లను వణికించాడు. ముఖ్యంగా భారత ఇన్నింగ్స్ 10వ ఓవర్ లో ఉమర్జాయ్ వేసిన యార్కర్ బంతిని వైభవ్ హెలికాప్టర్ షాట్ తో సిక్సర్గా మలిచాడు. ఈ షాట్ చూసిన అభిమానులకు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గుర్తుకు వచ్చారు. ధోనీ ట్రేడ్మార్క్ షాట్ను తలపించేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైభవ్ కేవలం 33 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు.
🚁🚁🚁
Just another chapter in Vaibhav Sooryavanshi’s book of exquisite strokeplay as he smashed a helicopter shot for SIX! 💥#ICCMensU19WC | Semi-Final 2 | #INDvAFG 👉 LIVE NOW ➡️ https://t.co/BH7PyKi0Hqpic.twitter.com/fDuysl86ZP— Star Sports (@StarSportsIndia) February 4, 2026
అఫ్గానిస్థాన్ భారీ స్కోరు.. దంచికొట్టిన భారత్
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. అఫ్గాన్ బ్యాటర్లు ఫైసల్ షినోజాదా (110 పరుగులు), ఉజైర్ ఉల్లా నియాజై (101 నాటౌట్) అద్భుత సెంచరీలతో చెలరేగారు. భారత్ ముందు 311 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. భారత బౌలర్లలో కనిష్క్ చౌహాన్, దీపేష్ దేవేంద్రన్ తలో రెండు వికెట్లు తీశారు.
రికార్డు ఛేదనతో భారత్ అదరగొట్టింది
311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 41.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. అండర్-19 క్రికెట్ చరిత్రలో భారత్కు ఇదే అతిపెద్ద రన్ ఛేజ్. అంతకుముందు 2002లో ఇంగ్లాండ్పై 304 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రికార్డును ఈ మ్యాచ్తో అధిగమించింది. ఓపెనర్ ఆరోన్ జార్జ్ 104 బంతుల్లో 115 పరుగులతో (15 ఫోర్లు, 2 సిక్సర్లు) మ్యాచ్ విన్నర్గా నిలిచాడు.
కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే, వైభవ్ కీలక ఇన్నింగ్స్
ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ మొదటి వికెట్కు కేవలం 57 బంతుల్లో 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే తన వంతు పాత్ర పోషించాడు. ఆయుష్ 59 బంతుల్లో 62 పరుగులు చేసి జట్టు విజయాన్ని సులభతరం చేశాడు. చివరలో విహాన్ మల్హోత్రా (38 నాటౌట్), వేదాంత్ త్రివేది (5 నాటౌట్) కలిసి మ్యాచ్ను ముగించారు. జార్జ్, మ్హాత్రే రెండో వికెట్కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం.
ఫైనల్లో ఇంగ్లాండ్తో పోరు
ఈ విజయంతో భారత్ రికార్డు స్థాయిలో 10వ సారి అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్కు చేరుకుంది. ఇప్పటివరకు భారత్ ఐదుసార్లు (2000, 2008, 2012, 2018, 2022) ఛాంపియన్గా నిలిచింది. శుక్రవారం జరగనున్న తుది పోరులో భారత్ ఇంగ్లాండ్తో తలపడనుంది.

