జింబాబ్వే పై గెలవాలంటే భారత్ ఈ 3 మార్పులు చేయాల్సిందే.. లేదంటే సెమీస్ కష్టమే
India vs Zimbabwe : టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన భారత్, సెమీస్ చేరాలంటే జింబాబ్వేపై భారీ విజయం సాధించాలి. ఇందుకోసం జట్టులో చేయాల్సిన మూడు కీలక మార్పులపై విశ్లేషణ ఇక్కడ చూద్దాం.

భారత్ సెమీస్ చేరాలంటే జింబాబ్వేపై అదిరిపోయే ప్లాన్ ఇదే
టీ20 వరల్డ్ కప్ 2026 రసవత్తర దశకు చేరుకుంది. సూపర్ 8 దశలో భాగంగా తన మొదటి మ్యాచ్లోనే దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన భారత్, ఇప్పుడు సెమీఫైనల్ రేసులో నిలవాలంటే చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. గ్రూప్-1లో ప్రస్తుతం వెస్టిండీస్ +5.350 నెట్ రన్ రేట్తో అగ్రస్థానంలో ఉండగా, భారత్ను ఓడించిన దక్షిణాఫ్రికా +3.800 నెట్ రన్ రేట్తో రెండో స్థానంలో ఉంది.
పాయింట్ల పట్టికలో భారత్ పరిస్థితి ఏంటి?
తొలి మ్యాచ్లో ఓటమి తర్వాత భారత్ -3.800 నెట్ రన్ రేట్తో మూడో స్థానంలో నిలిచింది. జింబాబ్వే -5.350 రన్ రేట్తో నాలుగో స్థానంలో ఉంది. భారత్ తన తదుపరి రెండు మ్యాచ్లలో జింబాబ్వే, వెస్టిండీస్లను భారీ తేడాతో ఓడించాల్సి ఉంటుంది. ఒకవేళ భారత్ ఈ రెండు మ్యాచ్లు గెలిస్తే 4 పాయింట్లు సాధిస్తుంది. అదే సమయంలో దక్షిణాఫ్రికా తన తదుపరి మ్యాచ్లలో వెస్టిండీస్, జింబాబ్వేలపై గెలిస్తే ఆ జట్టు 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలుస్తుంది. అప్పుడు రెండో స్థానం కోసం భారత్, వెస్టిండీస్ మధ్య నెట్ రన్ రేట్ పోటీ నెలకొంటుంది. కాబట్టి జింబాబ్వేపై గెలవడమే కాకుండా, భారీ స్కోరు సాధించడం టీమిండియాకు తప్పనిసరి.
జింబాబ్వేతో జరగనున్న కీలక పోరులో భారత్ విజయం సాధించాలంటే ఈ మూడు వ్యూహాత్మక మార్పులు చేయడం తప్పనిసరని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఆ వివరాలు గమనిస్తే..
రింకూ సింగ్ స్థానంలో సంజూ శాంసన్కు చోటు
టీమ్ ఇండియా స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ ప్రస్తుతం వ్యక్తిగత కారణాల వల్ల జట్టుకు దూరమయ్యారు. రింకూ తండ్రి అనారోగ్యంతో గ్రేటర్ నోయిడాలోని ఆసుపత్రిలో చేరడంతో, ఆయన ఫ్యామిలీ ఎమర్జెన్సీపై ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. దీనివల్ల జింబాబ్వేతో మ్యాచ్కు ఆయన అందుబాటులో ఉండటం కష్టమే. అయితే, దక్షిణాఫ్రికాతో మ్యాచ్ తర్వాత రింకూ ఫామ్ పైనా కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఈ క్రమంలో సంజూ శాంసన్ను తుది జట్టులోకి తీసుకోవడం భారత్కు కలిసివచ్చే అంశం. శాంసన్ రాకతో టాప్ ఆర్డర్ మరింత బలోపేతం అవుతుంది. నమీబియాతో జరిగిన మ్యాచ్లో శాంసన్ కేవలం 8 బంతుల్లోనే 22 పరుగులు చేసి తన ఫామ్ను నిరూపించుకున్నారు. అభిషేక్ శర్మ స్థానంలో ఆయనను తీసుకుంటే బ్యాటింగ్ లైనప్లో నిలకడ వస్తుంది.
అక్షర్ పటేల్ను తిరిగి జట్టులోకి తీసుకురావడం
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో అక్షర్ పటేల్ వంటి సీనియర్ ఆల్ రౌండర్ను పక్కన పెట్టడం పెద్ద చర్చకు దారితీసింది. వ్యూహాత్మకంగా ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్కు అవకాశం ఇచ్చినప్పటికీ, అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సుందర్ బౌలింగ్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడమే కాకుండా, బ్యాటింగ్లోనూ విఫలమయ్యారు. ముఖ్యంగా సుందర్ను ఐదో నంబర్లో బ్యాటింగ్కు పంపడం తప్పుడు నిర్ణయమని తేలిపోయింది.
వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ జట్టులోకి వస్తే బౌలింగ్లో కట్టుదిట్టమైన ఓవర్లు వేయడంతో పాటు, లోయర్ ఆర్డర్లో కీలక పరుగులు సాధించగలరు. జింబాబ్వే స్పిన్నర్లను ఎదుర్కోవడంలో అక్షర్ అనుభవం భారత్కు ఎంతో అవసరం.
మూడో స్థానంలో ఇషాన్ కిషన్.. మాస్టర్ ప్లాన్
జింబాబ్వేపై పవర్ ప్లే ఓవర్లను సమర్థంగా వాడుకోవాలంటే ఇషాన్ కిషన్ను మూడో స్థానంలో బరిలోకి దించడం ఒక గొప్ప వ్యూహాత్మక ఎత్తుగడ అవుతుంది. సంజూ శాంసన్ కుడిచేతి వాటం బ్యాటర్ కాబట్టి, ప్రత్యర్థి కెప్టెన్ ఆఫ్-స్పిన్నర్లతో బౌలింగ్ చేయించే అవకాశం ఉంటుంది. అయితే శాంసన్ స్పిన్ను అద్భుతంగా ఎదుర్కోగలడు.
ఒకవేళ ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లతో అటాక్ చేస్తే, ఇషాన్ కిషన్ వన్ డౌన్లో వచ్చి మెరుపు వేగంతో పరుగులు సాధించగలడు. దీనివల్ల మిగిలిన బ్యాటర్లు తమ స్థానాలను సర్దుబాటు చేసుకుని ఆడే అవకాశం ఉంటుంది. ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడితే నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకోవడం భారత్కు సులభమవుతుంది.

