IND vs ZIM : జింబాబ్వేతో మ్యాచ్.. భారత్కు చావో రేవో ! ముగ్గురు స్టార్లు ఔట్
India vs Zimbabwe: టీ20 ప్రపంచకప్ సెమీస్ రేసులో నిలవాలంటే జింబాబ్వేపై భారత్ తప్పక గెలవాలి. ఈ కీలక మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలెవన్లో సంజు శాంసన్తో పాటు ముగ్గురు కొత్త ప్లేయర్లు వచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.

భారత్ vs జింబాబ్వే: సెమీస్ కోసం టీమ్ ఇండియా వ్యూహాం ఇదే
టీ20 ప్రపంచకప్లో భాగంగా గురువారం జింబాబ్వేతో భారత్ తలపడనుంది. సూపర్-8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్లో 76 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన భారత్కు, సెమీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్లో విజయం పక్కా కావాలి. ఇది భారత్కు చావో రేవో లాంటి పోరు. ఒకవేళ ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోతే, టోర్నీ నుంచి అవుట్ అయి ఇంటికి వస్తుంది. మరోవైపు, తమ మొదటి మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయిన జింబాబ్వే కూడా సెమీస్ రేసులో ఉండాలంటే గెలవాల్సిన పరిస్థితిలో ఉంది.
భారత జట్టులో భారీ మార్పులు: ముగ్గురు ప్లేయర్లు అవుట్?
చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. గత మ్యాచ్లో విఫలమైన ముగ్గురు కీలక ఆటగాళ్లను పక్కన పెట్టాలని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ విభాగం, టాప్ ఆర్డర్ బ్యాటింగ్పై దృష్టి సారించారు.
సుందర్ స్థానంలో అక్షర్ పటేల్
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ వాషింగ్టన్ సుందర్ ఆకట్టుకోలేకపోయాడు. దీంతో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ను తిరిగి జట్టులోకి తీసుకురానున్నారు. చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలించినప్పటికీ, జింబాబ్వే టాప్ ఆర్డర్లో ఏడుగురిలో ఐదుగురు కుడిచేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. ఈ సమీకరణం దృష్ట్యా ఆఫ్ స్పిన్నర్ సుందర్ కంటే ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ ప్రభావం చూపుతారని జట్టు భావిస్తోంది.
రింకూ సింగ్ దూరం.. కుల్దీప్ యాదవ్కు అవకాశం
ఫినిషర్ పాత్రలో బరిలోకి దిగుతున్న రింకూ సింగ్ గత ఐదు మ్యాచ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటివరకు ప్రపంచకప్లో 29 బంతులు ఎదుర్కొన్న అతను కేవలం 24 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంతేకాకుండా, రింకూ తండ్రి అనారోగ్య కారణాల వల్ల అతను అత్యవసరంగా ఉత్తరప్రదేశ్కు వెళ్లాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్కు అతను అందుబాటులో ఉండకపోవచ్చు. రింకూ స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. చెన్నై స్పిన్ ట్రాక్పై కుల్దీప్ కీలకం కానున్నాడు.
తిలక్ వర్మ అవుట్.. సంజూ శాంసన్ ఇన్
తక్కువ స్ట్రైక్ రేట్, దూకుడు లేని ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న తిలక్ వర్మపై వేటు పడే అవకాశం ఉంది. మూడో నంబర్లో ఎడమచేతి వాటం బ్యాటర్ తిలక్కు బదులుగా కుడిచేతి వాటం బ్యాటర్ సంజూ శాంసన్ను ఆడించాలని మేనేజ్మెంట్ యోచిస్తోంది. సంజూను ఓపెనర్గా పంపిస్తే, ఇషాన్ కిషన్ మూడో స్థానంలో ఆడతాడు. ప్రత్యర్థి జట్టులోని ఆఫ్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోవడానికి సంజూ సరైన ఎంపిక అని భారత్ నమ్ముతోంది.
బౌలింగ్ దళం.. పిచ్ అంచనాలు ఇవే
చెన్నై పిచ్ సాంప్రదాయకంగా స్పిన్నర్లకు స్వర్గధామం. వరుణ్ చక్రవర్తికి ఇది హోమ్ గ్రౌండ్ కావడం విశేషం. వరుణ్, కుల్దీప్, అక్షర్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లతో జింబాబ్వేను దెబ్బకొట్టాలని భారత్ ప్లాన్ చేస్తోంది. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ఫామ్లో ఉండటం జట్టుకు పెద్ద ఊరట. గత మ్యాచ్లో ఇతర బౌలర్లు విఫలమైనా బుమ్రా మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. కేవలం గెలవడమే కాకుండా, నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకోవడానికి భారీ విజయం సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది.
జింబాబ్వే తో ఫైట్.. భారత ప్రాబబుల్ ఎలెవన్
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.

