T20 World Cup 2026 : రింకూ సింగ్ ఔట్.. జట్టులోకి హైదరబాదీ ప్లేయర్..?
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ కు సిద్దమవుతోంది. ఈ క్రమంలో హైదరబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కు జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టీమిండియాలో కీలక మార్పులు..
ICC T20 World Cup 2026 : స్వదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా మరో కీలక మ్యాచ్ కు సిద్దమవుతోంది. సూపర్-8 లో ఇప్పటికే ఓ ఓటమిని చవిచూసిన సూర్య సేన ఇక చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రూప్ స్టేజ్ లో ఆస్ట్రేలియా వంటి బలమైన టీంను ఓడించి సూపర్-8 కు చేరిన జింబాబ్వేతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఓడిపోయే జట్టు వరల్డ్ కప్ నుండి నిష్క్రమిస్తుంది. అందుకే జింబాబ్వేతో మ్యాచ్ ను భారత్ ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడంలేదు.
అయితే కీలకమైన మ్యాచ్ వేళ యువ క్రికెటర్ రింకూ సింగ్ జట్టుకు దూరమయ్యాడు. రింకూ సింగ్ తండ్రి ఖాన్ చంద్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు... ప్రస్తుతం అతడి పరిస్థితి పూర్తిగా క్షీణించి వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. దీంతో రింకూ సింగ్ చివరిక్షణాల్లో తండ్రివద్ద ఉండాలని నిర్ణయించుకున్నాడు... ఇప్పటికే అతడు స్వస్థలానికి బయలుదేరాడు. దీంతో జింబాబ్వేతో మ్యాచ్ లో రింకూ స్థానంలో ఎవరికి ఆడిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
అక్షర్ పటేల్ కు అవకాశం...
సౌతాఫ్రికాతో తొలి సూపర్-8 మ్యాచ్ లో టీమిండియా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లోనూ తేలిపోయింది. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను ఆడించకపోవడం టీమిండియా చేసిన బిగ్ మిస్టేక్ గా క్రికెట్ విశ్లేషకులే కాదు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీంతో అతడిని జింబాబ్వేతో ఆడించక తప్పని పరిస్థితి నెలకొంది. మరి ఎవరిని జట్టులోంచి పక్కనబెట్టాలి అనుకునే సమయంలో రింకూ సింగ్ తప్పుకున్నాడు... అతడి స్థానంలోని అక్షర్ ఆడనున్నాడు.
మహ్మద్ సిరాజ్ కు అవకాశం దక్కుతుందా..?
ఈ వరల్డ్ కప్ టీమ్ లో హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ కు అనూహ్యంగా చోటు దక్కింది. అయితే అతడు టీంలో ఉన్నా ఇప్పటివరకు మైదానంలోకి దిగింది లేదు… బంతి పట్టిందిలేదు. ఇప్పటికే టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది... కాబట్టి బౌలర్లను జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత మ్యాచ్ లో విఫలమైన వాషింగ్టన్ సుందర్ ను పక్కనబెట్టి మహ్మద్ సిరాజ్ లేదా కుల్దీప్ యాదవ్ కు తుది జట్టులో చోటు కల్పించే అవకాశం కనిపిస్తోంది.
సంజూ శాంసన్ ను ఆడిస్తారా..?
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే తిలక్ వర్మ వరుసగా విఫలం అవుతున్నారు. టీమిండియాకు బలంగా ఉండాల్సిన వీరు భారంగా మారారు. అందుకే వీరిలో ఒకరిని పక్కనబెట్టి సంజూ శాంసన్ ను ఆడించాలనే డిమాండ్ పెరుగుతోంది... జింబాబ్వేతో మ్యాచ్ లో ఈ ప్రయోగం చేసే అవకాశాలున్నాయి.

