T20 World Cup : సంజూ vs బుమ్రా.. ఇదెక్కడి రచ్చ సామీ !
Sanju Samson vs Jasprit Bumrah : టీ20 ప్రపంచకప్ 2026లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు సంజూ శాంసన్ కు దక్కడంపై దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. సంజూ కంటే బుమ్రా ప్రదర్శన మెరుగ్గా ఉందని ఆయన పేర్కొన్నారు.

సంజూ వర్సెస్ బుమ్రా.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరికి దక్కాల్సింది?
టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి ట్రోఫీని నిలబెట్టుకోవడమే కాకుండా, మూడుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది.
అయితే, టోర్నీ ముగిసినా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు పై చర్చ మాత్రం ఆగడం లేదు. భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శామ్సన్ ఈ అవార్డును గెలుచుకోగా, టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దీనికి మరింత అర్హుడని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డారు.
సంజూ శాంసన్ విధ్వంసకర ఇన్నింగ్స్లతో దూసుకుపోయిన భారత్
ఈ టోర్నీలో సంజూ శాంసన్ ప్రదర్శన అద్భుతమనే చెప్పాలి. భారత్ ఆడిన తొమ్మిది మ్యాచ్లలో సంజూకు కేవలం ఐదు మ్యాచ్ల్లోనే అవకాశం దక్కింది. అయినప్పటికీ, ఆ ఐదు ఇన్నింగ్స్ల్లోనే 200 స్ట్రైక్ రేట్తో 321 పరుగులు బాదాడు. ముఖ్యంగా ఫైనల్లో 89 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు భారీ స్కోరు సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. టోర్నీ చివరలో సంజూ చూపిన ఫామ్ భారత్కు కిరీటాన్ని అందించడంలో కీలకమైంది. అందుకే ఐసీసీ అతడిని ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపిక చేసింది.
బుమ్రా ప్రదర్శనపై డివిలియర్స్ ప్రశంసలు
డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ బుమ్రా కు సపోర్టుగా నిలిచారు. "సంజూ, బుమ్రా మధ్య గట్టి పోటీ నెలకొంది. కానీ నా దృష్టిలో బుమ్రాకు ఈ అవార్డు దక్కాల్సింది. భారత్ వంటి బ్యాటింగ్ పిచ్లపై 6.2 ఎకానమీతో బౌలింగ్ చేయడం సామాన్యమైన విషయం కాదు. అతను 8 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తితో కలిసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. క్లిష్ట సమయాల్లో బుమ్రా వేసిన ఓవర్లు భారత్ను గెలిపించాయి" అని డివిలియర్స్ పేర్కొన్నారు. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లలో బుమ్రా వేసిన స్పెల్స్ మరో గ్రహం నుంచి వచ్చినట్లు ఉన్నాయని ఆయన కొనియాడారు.
ఐసీసీ నామినేషన్ల ప్రక్రియపై విమర్శలు
ఈ వివాదానికి ప్రధాన కారణం ఐసీసీ ఎంపిక ప్రక్రియే అని తెలుస్తోంది. టోర్నీ కీలక దశకు చేరుకోకముందే ఐసీసీ 8 మంది సభ్యులతో కూడిన షార్ట్లిస్ట్ను విడుదల చేసింది. అభిమానుల ఓటింగ్ కోసం రూపొందించిన ఈ జాబితాలో బుమ్రా పేరు లేదు. కేవలం బ్యాటర్లు, ఆల్రౌండర్లకే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ నాకౌట్ దశలో బుమ్రా చూపిన ప్రభావం చాలా ఎక్కువ. 250 పరుగులు నమోదవుతున్న పిచ్లపై కూడా బుమ్రా నియంత్రణతో బౌలింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫైనల్ మ్యాచ్లో కూడా బుమ్రా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకున్నాడు.
రికీ పాంటింగ్ రేటింగ్స్
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ కూడా ఈ టోర్నీ ఆటగాళ్లకు రేటింగ్స్ ఇచ్చారు. ఇంగ్లండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్కు 10/10 రేటింగ్ ఇవ్వగా, సంజూ శాంసన్, జస్ప్రీత్ బుమ్రాకు 9.5/10 రేటింగ్ ఇచ్చారు. అలాగే ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్, సాహిబ్జాదా ఫర్హాన్లకు కూడా మంచి రేటింగ్స్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రేసులో పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఉన్నప్పటికీ, భారత ఆటగాళ్ల ఆధిపత్యమే స్పష్టంగా కనిపించింది.
చరిత్రాత్మక ఫైనల్
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 255/5 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. అభిషేక్ శర్మ (52), సంజూ శాంసన్ (89), ఇషాన్ కిషన్ (54) ధాటిగా ఆడారు. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 159 పరుగులకే కుప్పకూలింది. అక్షర్ పటేల్, బుమ్రా బౌలింగ్లో కివీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఈ విజయంతో సంజూ శాంసన్ హీరోగా ఎదిగినా, బుమ్రా సేవలను మర్చిపోలేమని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలో జరగబోయే ఐపీఎల్లో ఈ ఇద్దరు స్టార్స్ మళ్లీ మెరుపులు మెరిపించడానికి సిద్ధంగా ఉన్నారు.

