- Home
- Sports
- IND vs PAK : జై షా మైండ్ గేమ్.. దెబ్బకు ఏకాకిగా మారిన పాకిస్తాన్.. మైండ్ బ్లాక్ అంతే మరి !
IND vs PAK : జై షా మైండ్ గేమ్.. దెబ్బకు ఏకాకిగా మారిన పాకిస్తాన్.. మైండ్ బ్లాక్ అంతే మరి !
India vs Pakistan : టీ20 ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్పై పాకిస్థాన్ వెనక్కి తగ్గింది. ఐసీసీ, శ్రీలంక, యూఏఈ ఒత్తిడితో పీసీబీ తన బహిష్కరణ నిర్ణయాన్ని మార్చుకుంది. జై షా మైండ్ గేమ్ తో పాకిస్థాన్ ను దారిలోకి తెచ్చారు. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

10 రోజుల్లోనే పాకిస్థాన్ యూటర్న్.. భారత్తో మ్యాచ్కు పీసీబీ గ్రీన్ సిగ్నల్
టీ20 ప్రపంచకప్లో దాయాదుల మధ్య పోరు జరిగేనా అనే ఉత్కంటకు ఎట్టకేలకూ తెరపడింది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన హై-వోల్టేజ్ మ్యాచ్ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) అనూహ్య నిర్ణయం తీసుకుంది.
భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామంటూ గత పది రోజులుగా భీష్మించుకు కూర్చున్న పాక్, ఇప్పుడు తన పంతాన్ని వీడి వెనక్కి తగ్గింది. భారత్-పాక్ మ్యాచ్ యథావిధిగా జరుగుతుందని స్పష్టమైంది. అయితే, పాకిస్థాన్ స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకోలేదని, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పన్నిన పక్కా వ్యూహం వల్లే పీసీబీ తలవంచక తప్పలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
వివాదానికి అసలు కారణం ఇదే..
ఈ వివాదం అసలు బంగ్లాదేశ్తో మొదలైంది. బంగ్లాదేశ్ భారత్లో టీ20 ప్రపంచకప్ ఆడేందుకు నిరాకరించినప్పుడు, పాకిస్థాన్ అనవసరంగా ఈ విషయంలో తలదూర్చింది. బీసీసీఐ, బీసీబీ మధ్య ఉన్న విభేదాలను ఆసరాగా చేసుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించింది.
అయితే, ఐసీసీ కఠినంగా వ్యవహరించి బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి తప్పించిన తరుణంలో పాక్ తన రూట్ మార్చింది. తాము ప్రపంచకప్ ఆడతామని, కానీ బంగ్లాదేశ్కు సంఘీభావంగా భారత్తో మాత్రం తలపడబోమని ఫిబ్రవరి 1న ప్రకటించి సంచలనం సృష్టించింది. భారత్ను ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా పాక్ ఈ ఎత్తుగడ వేసింది.
శ్రీలంక రంగ ప్రవేశం.. అధ్యక్షుడి ఫోన్ కాల్
ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ ఒక కొత్త ప్లాన్ ను సిద్ధం చేసింది. పాకిస్థాన్కు అత్యంత సన్నిహితంగా ఉండే దేశాల ద్వారానే ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శ్రీలంక, యూఏఈ, బంగ్లాదేశ్లను రంగంలోకి దించింది. ఈ ప్రపంచకప్కు శ్రీలంక సహ ఆతిథ్య దేశంగా వ్యవహరిస్తోంది.
కొలంబోలో జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే శ్రీలంక భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేది. దీంతో శ్రీలంక అధ్యక్షుడు దిశానాయకే నేరుగా పాక్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్కు ఫోన్ చేశారు. దశాబ్దాలుగా ఉన్న క్రికెట్ అనుబంధాన్ని గుర్తు చేస్తూ, కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా ఉండాలని కోరుతూ మ్యాచ్ బహిష్కరణ నిర్ణయాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.
యూఏఈ ఇచ్చిన గట్టి హెచ్చరిక
మరోవైపు, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) కూడా పాకిస్థాన్పై ఒత్తిడి పెంచింది. గతంలో పాకిస్థాన్లో అంతర్జాతీయ క్రికెట్ నిలిచిపోయినప్పుడు, యూఏఈలో పాక్ తన హోమ్ మ్యాచ్లను ఆడి మనుగడ సాగించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈసీబీ ఒక లేఖ రాసింది.
భారత్-పాక్ మ్యాచ్ అనేది కేవలం రెండు దేశాల మధ్య సమస్య కాదని, ఇది క్రికెట్ ప్రపంచంపై, ముఖ్యంగా చిన్న దేశాల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. ఈ ఒత్తిడితో పీసీబీ ఆత్మరక్షణలో పడింది.
బంగ్లాదేశ్ షాకింగ్ ట్విస్ట్
అయితే పాకిస్థాన్కు అసలైన షాక్ బంగ్లాదేశ్ నుంచే తగిలింది. ఎవరి కోసమైతే పాక్ భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామందో, అదే బంగ్లాదేశ్ ఇప్పుడు పాక్ను ఆడుకోమని కోరింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం స్వయంగా లాహోర్ వెళ్లి పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీని కలిశారు.
భారత్తో మ్యాచ్ ఆడాలని ఆయన బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు. దీనికి తోడు, ఐసీసీ బంగ్లాదేశ్పై ఎలాంటి ఆర్థిక ఆంక్షలు విధించబోమని, భవిష్యత్తులో టోర్నీల నిర్వహణకు అవకాశం ఇస్తామని భరోసా ఇచ్చింది. దీంతో పాకిస్థాన్ వాదనలో పస లేకుండా పోయింది.
ఏకాకిగా మారిన పాక్
ఒకవైపు ఐసీసీ వ్యూహం, మరోవైపు మిత్రదేశాల నుంచి వచ్చిన ఒత్తిడితో పాకిస్థాన్ ఏకాకిగా మారింది. బంగ్లాదేశ్ ప్రయోజనాల సాకుతో భారత్ను ఇబ్బంది పెట్టాలనుకున్న పాక్ వ్యూహం బెడిసికొట్టింది. ఆదాయ వాటా కూడా దక్కుతుందని ఐసీసీ హామీ ఇవ్వడంతో, ఇక మ్యాచ్ ఆడటం మినహా పాకిస్థాన్కు మరో మార్గం లేకుండా పోయింది. మొత్తానికి జై షా నేతృత్వంలోని వ్యూహాలు పీసీబీని ముప్పుతిప్పలు పెట్టి చివరకు లొంగిపోయేలా చేశాయని క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్-పాక్ సమరానికి ఇప్పుడు సర్వం సిద్ధమైంది.

