IND vs ENG : ఇంగ్లండ్ వజ్రాయుధం.. ఆ ఒక్కడిని అడ్డుకుంటే భారత్ ఫైనల్కు చేరినట్టే !
India vs England : ఇంగ్లండ్తో జరగనున్న టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్కు ముందు సునీల్ గవాస్కర్ భారత్ను హెచ్చరించారు. విల్ జాక్స్ ముప్పును ఎదుర్కొని, సంజూ శాంసన్ రాణిస్తేనే భారత్ ఫైనల్ చేరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఇంగ్లండ్ పని పట్టేందుకు టీమ్ ఇండియా రెడీ !
ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ పోరు జరగనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ టీమ్ ఇండియాను అప్రమత్తం చేశారు. ఇంగ్లీష్ జట్టులో ఉన్న ఒక ఆటగాడు భారత్ విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అతడిని అడ్డుకుంటేనే భారత్ ముందడుగు వేస్తుందని పేర్కొన్నారు.
భారత్ కు విల్ జాక్స్ ముప్పు.. ఇంగ్లండ్ ప్లానేటి?
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ ఈ టోర్నీలో అద్భుతమైన ఫామ్లో ఉన్నారని గవాస్కర్ పేర్కొన్నారు. ఈ ప్రపంచకప్లో ఇప్పటికే నాలుగు సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులను గెలుచుకున్న జాక్స్, భారత్కు పెద్ద సవాలుగా మారనున్నారని అన్నారు. ఏడు మ్యాచ్ల్లో 191 పరుగులు చేయడంతో పాటు ఏడు వికెట్లు పడగొట్టిన జాక్స్, ఇంగ్లండ్ సెమీస్ చేరడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా వాంఖడే పిచ్పై స్వల్పంగా టర్న్ లభించినా, జాక్స్ బంతితో ప్రమాదకరంగా మారుతారని గవాస్కర్ చెప్పారు.
ఇంగ్లాండ్ ఏడో నంబర్ వజ్రాయుధం
"ఏడో నంబర్లో బ్యాటింగ్కు వచ్చే విల్ జాక్స్ ఉనికి ఇంగ్లండ్కు పెద్ద ప్లస్ పాయింట్. ఇది భారత్కు శివం దూబే ఇచ్చే ఆత్మవిశ్వాసం వంటిది" అని గవాస్కర్ అన్నారు. భారత జట్టులో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ లేదా శివం దూబే వంటి ఎడమచేతి వాటం బ్యాటర్లకు జాక్స్ ఎక్కువ బంతులు వేయకపోవచ్చు కానీ, కుడిచేతి వాటం బ్యాటర్లను ఆయన ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. చాంప్స్ ఫౌండేషన్ కార్యక్రమంలో భాగంగా గవాస్కర్ ఈ కామెంట్స్ చేశారు.
సంజూ శాంసన్ ఫామ్ భారత్ కు కీలకం
వెస్టిండీస్తో జరిగిన కీలక మ్యాచ్లో 97 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన సంజూ శాంసన్ ఫామ్ భారత్కు పెద్ద ఆస్తి అని గవాస్కర్ కొనియాడారు. "సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి కుడిచేతి వాటం బ్యాటర్లు విల్ జాక్స్ను ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే భారత్ విజయం ఆధారపడి ఉంటుంది. సంజూ ప్రస్తుతం ఉన్న ఫామ్ జట్టుకు భారీ బలాన్ని ఇస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. ఈ కీలక ఆటగాళ్లు రాణిస్తే భారత్ ఫైనల్ చేరడం నల్లేరు మీద నడకేనని ధీమా వ్యక్తం చేశారు.
గత రికార్డులు ఏం చెబుతున్నాయి?
గతంలో 1987, 2016 సెమీఫైనల్స్లో వాంఖడే మైదానంలో భారత్ ఓటమి పాలైంది. అయితే, ఆ చరిత్ర ఇప్పుడున్న జట్టుపై ప్రభావం చూపదని గవాస్కర్ స్పష్టం చేశారు. "ఇది కొత్త కాలం, కొత్త జట్టు. అహ్మదాబాద్లో జరిగే ఫైనల్కు చేరుకోవడానికి అవసరమైన అన్ని శక్తులు ఈ భారత జట్టుకు ఉన్నాయి. ఇంగ్లండ్తో పోరు వెస్టిండీస్ మ్యాచ్ లాగే ఎంతో ఉత్సాహంగా సాగుతుంది. రెండు జట్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమానంగా ఉన్నాయి. ఒత్తిడిని జయించిన వారే విజేతలుగా నిలుస్తారు" అని గుర్తు చేశారు.
మహమ్మద్ అమీర్ విమర్శలు.. గవాస్కర్ కౌంటర్
మరోవైపు, పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ భారత్ సెమీస్ చేరడంపై విమర్శలు గుప్పించారు. భారత్ మంచి క్రికెట్ ఆడటం లేదని, ఫీల్డింగ్ లోపాలు ఉన్నాయని అమీర్ వ్యాఖ్యానించారు. బుమ్రా మినహా మిగిలిన బౌలర్లు పరుగులు ఇస్తున్నారని, పాండ్యా పెద్ద జట్లపై ఆడలేరని అమీర్ విమర్శించారు. అయితే గవాస్కర్ మాత్రం భారత జట్టు సమతుల్యతపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అమీర్ చేసిన హెట్మెయర్ అవుట్ వివాదంపై కూడా చర్చ జరుగుతోంది, కానీ భారత్ ప్రస్తుతం తన దృష్టిని ఇంగ్లండ్ మ్యాచ్పైనే పెట్టింది.

