భారత ఆటలు: చైనా కంపెనీల గురించి విస్తుపోయే విషయాలు ఇవీ....
బ్యాన్ చైనా నినాదం ఇప్పుడు క్రీడారంగానికి కూడా పాకింది. ఆర్థికంగా చైనా దేశం భారత్తో అపారమైన వాణిజ్య సంబంధాలు కలిగి ఉంది. భారత మార్కెట్లో చైనా వస్తువులకు కొదవలేదు. సరిహద్దు ఉద్రిక్తతలకు బార్డర్ తోపాటుగా ఆర్థికంగా కూడా చైనాను దెబ్బతీయాలని భారత్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
భారత్, చైనా సరిహద్దు ఉద్రిక్తతలు ప్రజల్లో భావోద్వేగాలను తారాస్థాయికి చేర్చింది. మన దేశం జోలికి ఎవరో వస్తే, మన దేశ సైనికుల ప్రాణాలను ఇంకొకరు బలిగొంటే ఎవరమూ చూస్తూ ఊరుకోము. అది పాకిస్తాన్ అయినా చైనా అయినా దేశమంతా ప్రభుత్వం వెంట ఉన్నామని, మన సైనికుల త్యాగాలను వృధాగా పోనీయకూడదని, శత్రుదేశానికి సరైన గుణపాఠం నేర్పాలని భారతదేశం ఒక్కటై నినదిస్తుంది.
20 మంది భారతీయ సైనికులను బలిగొన్న చైనా దుష్టనీతికి బుద్ధి చెప్పేందుకు సైనికులకు తోడుగా ప్రతి భారతీయుడు నిలవాలని బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ పేరుతో పెద్ద ఉద్యమమే నడుస్తుంది.
బ్యాన్ చైనా నినాదం ఇప్పుడు క్రీడారంగానికి కూడా పాకింది. ఆర్థికంగా చైనా దేశం భారత్తో అపారమైన వాణిజ్య సంబంధాలు కలిగి ఉంది. భారత మార్కెట్లో చైనా వస్తువులకు కొదవలేదు. సరిహద్దు ఉద్రిక్తతలకు బార్డర్ తోపాటుగా ఆర్థికంగా కూడా చైనాను దెబ్బతీయాలని భారత్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
చైనా వస్తువులను మనం బహిష్కరించినా.... ఇప్పటికిప్పుడు మనదేశీయ ఉత్పత్తులు మనకు అందుబాటులోకిరావు. వేరే ఇతర దేశాలపైన ఆధారపడవలసిందే. మనదేశానికి అవసరమైన నాణ్యమైన ఉత్పత్తుల తయారీలో మనం స్వయం సమృద్ధి సాధించేందుకు ఇంకా ఎన్నో ఏండ్ల పడుతుంది.
చైనా ఉత్పత్తుల నిషేధం నినాదం మనకు ఇది మొదటిసారి కాదు, బహుశా ఇది చివరిది కూడా కాకపోవచ్చు!. గతంలో ఎన్నోసార్లు ఇటువంటి పరిస్థితులను భారత్ చవిచూసింది. అయితే ఇప్పుడా నినాదం క్రీడారంగానికి కూడా చేరుకుంది. కరోనా వైరస్ కారణంగా ఆటలు నిలిచిపోవటంతో క్రీడా రంగం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ సమయంలో ఐపీఎల్ సహా అన్ని క్రీడా సమాఖ్యలు తమ చైనా స్పాన్సర్షిప్లను రద్దు చేసుకోవాలనే ఒత్తిళ్లు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒకసారి స్పాన్సర్షిప్లు ఎలా ఎంతమేర ఉన్నాయో ఒకసారి చూద్దాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు టైటిల్ స్పాన్సర్గా చైనా స్మార్ట్ఫోన్ మొబైల్ కంపెనీ వీవో వ్యవహరిస్తోంది. ఐదేండ్ల కాలానికి వీవో రూ.2199 కోట్లు బీసీసీఐకి చెల్లిస్తోంది. ప్రతి సీజన్కు వీవో కంపెనీ నుంచి బీసీసీఐ రూ.440 కోట్లు అందుకుంటోంది. ప్రధాన స్పాన్సర్ వివోతో బంధం కొనసాగింపుపై ఆలోచనలో పడింది బీసీసీఐ.
ఒకవేళ వివోను వద్దనుకుంటే.... తెగతెంపుల పర్వం ఒక్క వీవోతో సమసిపోదు. ఇతర ఐపీఎల్ స్పాన్సర్లు డ్రీమ్11, స్విగ్గీలు సైతం చైనా ఇంటర్నెట్ దిగ్గజం టెన్సెంట్ నుంచి పెట్టుబడులు స్వీకరించాయి. భారత జట్టు జెర్సీ లోగో స్పాన్సర్ బైజూస్ సైతం టెన్సెంట్ నుంచి పెట్టుబడులు కలిగి ఉంది.
పేటీఎం కంపెనీలో చైనా కంపెనీ అలీబాబా పెట్టుబడులు ఉన్నాయి. చైనా కంపెనీలతో సంబంధాలు తెంచుకోవాల్సి వస్తే.. బీసీసీఐ, ఐపీఎల్ అన్ని స్పాన్సర్షిప్లను వదులుకోవాల్సి ఉంటుంది.
ఇక అది అటుంచితే.... ఐపీఎల్ టైటిల్ స్పానర్షిప్గా వ్యవహరిస్తున్న వివో కంపెనీ బీసీసీఐకి ఏటా రూ.440 కోట్లు చెల్లిస్తోన్నా విషయం తెలిసిందే. అందులో 42 శాతం పన్ను రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వెళ్తోంది. అంటే ఐదేండ్లకు రూ.923.58 కోట్లు పన్ను రూపంలో ప్రభుత్వ ఖజానాకు వెళ్తున్నాయి.
ఒకరకంగా చూస్తే వీవోతో ఒప్పందం కారణంగా ఐపీఎల్, బీసీసీఐ నుంచి ఎటువంటి సొమ్ము చైనాకు వెళ్లటం లేదు. భారత్లో వినియోగదారులకు మొబైల్ఫోన్ల అమ్మకం ద్వారా ఆర్జించిన లాభాల నుంచి వీవో ఈ చెల్లింపులు చేస్తోంది. ఒకవేళ బీసీసీఐ ఒప్పందం రద్దు చేసుకుంటే లాభాల్లో భాగంగా బీసీసీఐ కి వివో చెల్లించే రూ. 2199 కోట్లు సైతం చైనాకు తరలిపోతాయి.
కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో కొనసాగుతోంది. ఈ సమయంలో ఒక్క సీజన్కు రూ.440 కోట్లు వెచ్చించేందుకు ఏ కంపెనీ ముందుకు రాదు. అయినా ప్రజల్లో నెలకొన్న భావోద్వేగాల నేపథ్యంలో చైనా కంపెనీలతో స్పాన్సర్షిప్ ఒప్పందాలపై సమీక్ష చేసేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.
ఈ వారంలో స్పాన్సర్షిప్లపై సమీక్ష సమావేశం నిర్వహించనుంది. ఇదికాకుండా, ఐపీఎల్ ప్రసారదారు స్టార్స్పోర్ట్స్కు వీవో సీజన్కు రూ.150 కోట్ల విలువైన ప్రకటనలు ఇస్తోంది. ఇతర చైనా స్మార్ట్ఫోన్ కంపెనీలు క్రికెట్ సీజన్లో ప్రకటనలకు సుమారు రూ.1200-1500 కోట్లు ఖర్చుపెడుతున్నాయి.
ఇకపోతే..... అంతర్జాతీయ క్రీడా వేదికలైన ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్లలో పోటీపడే భారత అథ్లెట్లు ధరించే జెర్సీలు, ప్రాక్టీస్ కిట్లు, ఇతర క్రీడా సామాగ్రిని చైనా క్రీడా ఉపకరణాల కంపెనీ లీనింగ్ స్పాన్సర్ చేస్తోంది. 2020 టోక్యో ఒలింపిక్స్ వరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)తో లీనింగ్ ఒప్పందం కుదుర్చుకుంది.
2012 లండన్ ఒలింపిక్స్లో భారత జట్టు జెర్సీ, కిట్ స్పాన్సర్గా హర్యానాకు చెందిన దిడా కంపెనీ వ్యవహరించింది. అందుకు రూ.50 లక్షలు ఐఓఏకు చెల్లించింది. 2016 రియో ఒలింపిక్స్కు ఐఓఏ లీనింగ్తో ఒప్పందం చేసుకుంది. ఒలింపిక్స్లో భారత్ హవా మెరుగైనందునే చైనా కంపెనీ లీనింగ్ మనతో ఒప్పందానికి ముందుకొచ్చిందని అప్పట్లో ఐఓఏ అధ్యక్షుడు ప్రకటించాడు. లీనింగ్ రూ.2.5-3 కోట్లు ఒప్పందం కింద ఐఓఏకు చెల్లించింది.
2012 ఒలింపిక్స్లో కిట్స్లో నాణ్యత లోపాలపై అథ్లెట్లు బహిరంగ విమర్శలు చేశారు. అదే 2016 ఒలింపిక్స్లో కిట్ల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అధికారికంగా భారత ఒలింపిక్ సంఘమే వెల్లడించింది. ఇప్పుడు సరిహద్దు భావోద్వేగాల నేపథ్యంలో లీనింగ్తో ఒప్పందం సమీక్షించేందుకు ఐఓఏ సిద్ధమవుతోంది. భారత అథ్లెట్లకు లీనింగ్ నాణ్యమైన స్పోర్ట్స్వేర్ జెర్సీలు, ఒలింపిక్ క్రీడా ఉపకరణాలు ఉచితంగా అందజేస్తోంది.
ఐఓఏకు ఆకర్షణీయమైన సొమ్మును చెల్లిస్తోంది. లీ నింగ్ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రభుత్వ సంస్థలు, అకాడమీలు కాంట్రాక్టులు మంజూరు చేస్తే లీనింగ్కు లాభం కానీ లీ నింగ్ నుంచి ఉచితంగా కిట్లు, జెర్సీలు, పరికరాలు సహా స్పాన్సర్షిప్ డబ్బు వదులుకోవాల్సివస్తుంది. ఈ నేపథ్యంలో భారతీయ క్రీడారంగం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.