- Home
- Life
- Pregnancy & Parenting
- Kids Health: పిల్లలకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు అరటిపండు, పెరుగు పెట్టొచ్చా? పెడితే ఏమవుతుంది?
Kids Health: పిల్లలకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు అరటిపండు, పెరుగు పెట్టొచ్చా? పెడితే ఏమవుతుంది?
పిల్లలకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఏ ఫుడ్ పెట్టాలో, ఏ ఫుడ్ పెట్టకూడదో తెలియక చాలామంది పేరెంట్స్ సతమతమవుతుంటారు. ముఖ్యంగా అరటి పండు, పెరుగు పెట్టొచ్చా లేదా అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. మరి ఈ విషయం గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.

Kids Health Care Tips
పిల్లలకు జలుబు, దగ్గు వచ్చినప్పుడు కొన్ని ఫుడ్స్ అస్సలు పెట్టొద్దని నిపుణులు చెబుతుంటారు. అయితే చాలామంది పేరెంట్స్ ఆ టైంలో పిల్లలకు అరటి పండు, పెరుగు పెట్టడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఫుడ్స్ పెట్టడం వల్ల జలుబు పెరుగుతుందని కొందరు, అలాంటిది ఏమి ఉండదని మరికొందరు నమ్ముతారు. అయితే నిపుణుల ప్రకారం పిల్లలకు జలుబు, దగ్గు ఉన్న సమయంలో అరటిపండు, పెరుగు పెట్టవచ్చో లేదో ఇక్కడ తెలుసుకుందాం.
అరటి పండు పెడితే ఏమవుతుంది?
అరటిపండులో శరీరానికి కావాల్సిన పొటాషియం, ఫైబర్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. అరటిపండు సహజంగా మృదువుగా ఉండటం వల్ల తేలికగా జీర్ణమవుతుంది. సాధారణంగా జలుబు సమయంలో అరటిపండు తింటే ప్రతికూల ప్రభావం ఉన్నట్లుగా శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమంది పిల్లల్లో దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు.. అరటిపండు తిన్న వెంటనే దగ్గు మరింత పెరిగినట్లు అనిపించవచ్చు. కానీ అది పిల్లల శరీరతత్వం మాత్రమే. అలాంటి సందర్భాల్లో అరటిపండును తాత్కాలికంగా తగ్గించడం మంచిది.
పెరుగు పెడితే ఏమవుతుంది?
పెరుగు సహజ ప్రోబయోటిక్స్తో కూడిన ఆహారం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, గట్ హెల్త్ ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. వైద్యుల ప్రకారం, జలుబు ఉన్నప్పుడు పెరుగును పూర్తిగా మానాల్సిన అవసరం లేదు. అయితే, చల్లగా ఉన్న పెరుగు ఇవ్వకుండా, గది ఉష్ణోగ్రతలో ఉన్న పెరుగు ఇవ్వడం మంచిది.
తక్కువ మొత్తంలో ఇవ్వడం..
పిల్లలకు అరటి పండు, పెరుగు ఇస్తున్నప్పుడు మోతాదుపై శ్రద్ధ అవసరం. పిల్లల రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు, ఏ ఆహారం అయినా ఎక్కువ మోతాదులో ఇస్తే కడుపు నిండిపోవడం, జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి అరటిపండును చిన్న ముక్కల రూపంలో ఇవ్వడం, పెరుగును తక్కువ మోతాదులో ఇవ్వడం సురక్షితం.
వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి
పిల్లలు.. ముక్కు కారడం, గొంతులో మంట, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు, లైట్ ఫుడ్, గోరువెచ్చని ద్రవాలు, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. గోరువెచ్చని నీరు, కూరగాయల సూప్, పప్పు, కిచిడి వంటి ఆహారాలు సులభంగా జీర్ణమవుతాయి.

