ఇండియాలో అత్యంత అసభ్యకరంగా మాట్లాడే ప్రజలెవరు..? బూతు మాటల్లో తెలుగువాళ్ల స్థానమెంత..?
Abusive Language : తెలుగు ప్రజల్లో ఎక్కువ అసభ్యకరంగా మాట్లాడేది ఎవరు… ఆంధ్ర ప్రదేశ్ ప్రజలా లేక తెలంగాణవాళ్లా..? గలీజ్ పదాలతో కూడిన భాషను ఉపయోగించడంలో దేశంలోనే టాప్ రాష్ట్రాలేవి… తక్కువ మాట్లాడే రాష్ట్రాలేవో తెలుసా?

బూతు మాటల్లో ఎవరు టాప్
Abusive language : పరుష పదజాలం... అంటే మనిషి చెవులకు వినిపించకూడని కొన్ని పదాలు. గతంలో గొడవల సమయంలో వినిపించే అసభ్యపదాలు ఇప్పుడు సాధారణ వాడుకభాషలో కూడా వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే బూతుమాటలు నేటి యువతరం ఫ్యాషన్ గా భావిస్తోంది... అందుకే సినిమావాళ్లు కూడా వీటి ప్రయోగాన్ని పెంచారు. గతంలో బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా అసభ్యకర, డబుల్ మీనింగ్ డైలాగ్స్ వినిపించేవి... ఇప్పుడు అన్ని సినిమాల్లోనూ ఇవి సాధారణంగా మారాయి. ప్రజలు వీటిని ఇష్టపడుతున్నారు కాబట్టే సినిమాల్లో వాడుతున్నాం అనేది మూవీమేకర్స్ ఆన్సర్. ఏదేమైనా ఒక్కప్పుడు అసభ్యకరంగా మాట్లాడితే తప్పు... ఇప్పుడు మాట్లాడకపోతే తప్పు అనేలా పరిస్థితి మారిపోయింది.
దక్షిణ భారతదేశంలో కాస్త నయం... కానీ ఉత్తర భారతదేశంలో మరీముఖ్యంగా హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో అన్ పార్లమెంటరీ భాషలో మాట్లాడేవారి సంఖ్య ఎక్కువట. ఓ సర్వేలో ఈ విషయం తేలింది. మరి అసభ్యపదాలు మాట్లాడే విషయంలో ఏయే రాష్ట్రాలు టాప్ లో ఉన్నాయి..? తెలుగు రాష్ట్రాల స్థానమెంత..? తక్కువగా మాట్లాడే ప్రజలెవరు..? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
అసభ్యకరంగా మాట్లాడటంలో ఈ రాష్ట్రమే నెంబర్ వన్...
ఇండియా రాజధాని డిల్లీలో అసభ్యకరంగా మాట్లాడేవారు ఎక్కువట... ఇక్కడి ప్రజల భాష చాలా కఠినంగా ఉంటుందని సర్వేలో తేలింది. అంటే చాలామంది డిల్లీవాలాలు మాట్లాడే ప్రతి పదంలో ఒకటి రెండు తప్పుడుపదాలు తప్పకుండా ఉంటాయట. ఇతర ప్రాంతాల నుండి వెళ్లేవారికి వారికి అవి కొత్త... కానీ అక్కడే ఉండేవారికి ఇవి సాధారణ పదాలే. ఇలా అసభ్యకరంగా మాట్లాడే రాష్ట్రాల్లో డిల్లీ టాప్ లో ఉంది... ఇక్కడ 80 శాతంమంది ఇలాంటి భాషే మాట్లాడతారు.
బూతుల్లో ఉత్తరాది టాప్..
ఉత్తరాది రాష్ట్రాలు అన్ పార్లమెంటరీగా మాట్లాడటంతో ముందున్నాయి. డిల్లీ తర్వాత అత్యధికంగా అసభ్యపదాలు వాడేది పంజాబ్ లోనే. దాదాపు 78 శాతంమంది పంజాబీలు పరుష పదజాలాన్ని ఉపయోగిస్తారు. ఇక ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో 74 శాతంమంది తప్పుడు పదాలను ఉపయోగిస్తారని సర్వేలో తేలింది.
బూతు మాటల్లో తెలుగువారి ర్యాంక్ ఎంత..?
తెలుగు భాష అమృతంలా ఉంటుందని ఇతర భాషల కవులు కూడా పొగిడిన సందర్భాలు చరిత్రలో అనేకం... అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఇతంటి మధురమైన భాషలోనూ తప్పుడు పదాలు ఎక్కువే... ఈ కాలంలో ప్రజలు కూడా వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. మరి పరుషంగా మాట్లాడేది ఎక్కువగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలా లేక తెలంగాణవాళ్లా..? అంటే సర్వే రిపోర్ట్స్ ఏపీ అనే చెబుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో 39 శాతం అసభ్యకరంగా మాట్లాడతారట... దీంతో దేశంలో 14వ స్థానంలో నిలిచింది. తెలంగాణలో 38 శాతంమంది తప్పుడు మాటలు ఉపయోగిస్తారట.. అందుకే 15 స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రజల భాష, యాస కాస్త మొరటుగా ఉంటుంది... హైదరబాదీ ఉర్దూ కూడా అంతే.. కానీ ఇవి అసభ్య పదాలు కావని ఈ సర్వే స్పష్టం చేసింది.
అతి తక్కువగా తప్పుడు భాష వాడే రాష్ట్రాలేవి..?
భారతదేశంలో ఓ 7 రాష్ట్రాల ప్రజలు చాలా తక్కువ అసభ్య పదాలు ఉపయోగిస్తారని సర్వేలో తేలింది. అందులో అత్యధికం ఈశాన్యరాష్ట్రాలే. సిక్కిం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో 15 శాతానికి తక్కువమంది పరుషంగా మాట్లాడతారట. జమ్మూ కాశ్మీర్, లడఖ్ లో కూడా అసభ్య పదాల ఉపయోగం తక్కువేనని సర్వే తేల్చింది.
ఎలాంటి తిట్లు వాడతారు..?
ఇండియాలో ఎక్కువగా ఆడవాళ్లు, జంతువులను అడ్డం పెట్టుకుని వాడే తిట్లే ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఎవరినైనా తిట్టాలాంటే ముందుగా ఇంట్లోని ఆడవాళ్లను లాగుతారు... అమ్మ, భార్య, అక్క, చెల్లిని అడ్డం పెట్టుకుని తిడుతుంటారు. లేదంటే జంతువులతో పోల్చి తిడుతుంటారు... ఇందులోనూ కుక్క, పంది, గాడిద, బర్రె వంటివాటినే ఎక్కువగా వాడుతుంటారు. ఇలా ఇండియాలో అసభ్యకర పదాలు వాడే కల్చర్ కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది.

