Top Loan Schemes : మీరు లోన్ తీసుకొండి.. వడ్డీ ప్రభుత్వమే చూసుకుంటుంది
వ్యాపారం, వ్యవసాయం, చదువు.. ఇలాంటి అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం చాలా లోన్ స్కీమ్స్ అందిస్తోంది. వీటి ద్వారా ప్రజలు తక్కువ వడ్డీకే లేదా అసలు వడ్డీ లేకుండానే రుణాలు పొందవచ్చు. ఇలాంటి స్కీమ్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

తక్కువ వడ్డీకే ప్రభుత్వ రుణాలను పొందండి...
సొంతంగా వ్యాపారం పెట్టాలన్నా, పిల్లల్ని పెద్ద చదువులు చదివించాలన్నా, వ్యవసాయ పెట్టుబడికైనా... ఇలా ఏ పని చేయాలన్నా డబ్బులు అవసరం. వీటన్నింటికీ బ్యాంకులు లోన్స్ ఇస్తాయి... కానీ వడ్డీ భారం తలుచుకుని చాలామంది అప్పు చేయడానికి వెనకాడుతారు. కానీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కొన్ని పథకాలతో తక్కువ వడ్డీకే, కొన్నిసార్లు వడ్డీ లేకుండానే లోన్ పొందొచ్చు. సమాజంలోని వివిధ వర్గాల ఆర్థిక ప్రగతికి ఈ పథకాలు సాయపడతాయి. అందుకే ప్రభుత్వం ఈ సదుపాయం కల్పిస్తోంది.
పీఎం స్వనిధి పథకం (PM Svanidhi Scheme)
పట్టణాల్లోని వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం అండగా నిలుస్తుంది. ఈ పథకం కింద మొదట రూ.10,000 లోన్ ఇస్తారు… దాన్ని సరైన టైమ్కి తిరిగి చెల్లిస్తే ఆ తర్వాత రూ.20,000 నుంచి రూ.50,000 వరకు రుణం పెంచుకోవచ్చు. ఈ లోన్పై 7% వరకు వడ్డీ రాయితీ ఉంటుంది. ఇలా చాలా తక్కువ వడ్డీకి రుణాలిచ్చి చిరువ్యాపారులకు అండగా నిలుస్తోంది ప్రభుత్వం.
పీఎం విశ్వకర్మ యోజన (PM Vishwakarma Yojana)
పీఎం విశ్వకర్మ యోజన అనేది సంప్రదాయ వృత్తి కళాకారుల కోసం తెచ్చిన పథకం. కుమ్మరులు, వడ్రంగులు, స్వర్ణకారులు సహా 18 రకాల వృత్తుల వారికి ఈ పథకం వర్తిస్తుంది. తమ వ్యాపారాల కోసం ఈ పథకం ద్వారా లోన్ తీసుకోవచ్చు... మార్కెట్లో వడ్డీ ఎంత ఉన్నా లబ్ధిదారులు కేవలం 5% చెల్లిస్తే చాలు. మిగతాది ప్రభుత్వమే సబ్సిడీగా ఇస్తుంది. దీనికి ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. శిక్షణతో పాటు, పనిముట్లు కొనడానికి కూడా ప్రభుత్వమే ఆర్థిక సాయం అందిస్తుంది.
పీఎం కిసాన్ కార్డ్ పథకం (PM Kisan Card Scheme)
రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం చాలా కీలకమైంది. సాధారణంగా దీనిపై 9% వడ్డీ ఉంటుంది. కానీ ప్రభుత్వ సబ్సిడీతో అది 7%కి తగ్గుతుంది. తీసుకున్న అప్పును గడువులోగా తిరిగి చెల్లిస్తే అదనంగా మరో 3% రాయితీ ఇస్తారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలు కూడా కలిస్తే, ఇది దాదాపు వడ్డీ లేని రుణంలాగే మారుతుంది.
విద్యారుణాలు (Educational Loans)
ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం విద్యా రుణాలపై వడ్డీ రాయితీ ఇస్తోంది. విద్యార్థులు చదువుకునే కాలంలో వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. జన్ సమర్థ్ పోర్టల్ ద్వారా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆధార్, బ్యాంక్ అకౌంట్, ప్రొఫెషనల్ సర్టిఫికెట్ లాంటి డాక్యుమెంట్లు అవసరం. లోన్ వాయిదాలు ఆలస్యమైతే సబ్సిడీ రద్దవుతుందని గుర్తుంచుకోవాలి.

