- Home
- National
- ఇక పని అయిపోంది అనుకున్న సమయంలో పీకే వండర్.. ప్రశాంత్ కిశోర్ గెలుపు అసలు కారణలేంటి?
ఇక పని అయిపోంది అనుకున్న సమయంలో పీకే వండర్.. ప్రశాంత్ కిశోర్ గెలుపు అసలు కారణలేంటి?
Prashant kishor: ఎన్నికల వ్యూహకర్తగా తెలిసిన ప్రశాంత్ కిషోర్ సంచలనం సృష్టించారు. బీజేపీకి కంచుకోటగా ఉన్న పాట్నాలోని బాంకీపూర్ అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నారు. ఇంతకీ ప్రశాంత్ కిషోర్ విజయానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

అభ్యర్థిగా ప్రశాంత్ కిశోర్ బరిలోకి దిగడం
ప్రశాంత్ కిశోర్ రాజకీయ వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అయితే 2025 ఎన్నికల్లో జన సురాజ్ పార్టీ 243 స్థానాల్లో 238 చోట్ల పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దీంతో ఈసారి బాంకీపూర్ ఉపఎన్నికలో పార్టీ తరఫున మరొకరిని నిలబెట్టకుండా ప్రశాంత్ కిశోర్ స్వయంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇది ఎన్నికల ఫలితాలపై గణనీయమైన ప్రభావం చూపింది. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాతో పోలిస్తే ప్రశాంత్ కిశోర్కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గుర్తింపు, ప్రజల్లో పరిచయం ఎక్కువగా ఉండటం ఆయనకు కలిసొచ్చింది. అంతేకాకుండా ఈ స్థానం గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు బలమైన కంచుకోటగా ఉండేది. ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడంతో బాంకీపూర్ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది.
మార్పును ఆశించిన ఓటర్లు
బాంకీపూర్ ప్రజలు మార్పును కోరుకున్నట్లు ఈ ఫలితం స్పష్టం చేస్తోంది. ప్రశాంత్ కిశోర్ను మెరుగైన ప్రత్యామ్నాయ అభ్యర్థిగా భావించారని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రశాంత్ కిశోర్ కూడా ఇదే అంశాన్ని తన ప్రచారంలో బలంగా ఉపయోగించుకున్నారు. బాంకీపూర్ ఏ ఒక్క పార్టీకి శాశ్వతమైన కోట కాదని, ప్రజలే ఒక ప్రాంతాన్ని రాజకీయ కోటగా మారుస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరిపై కూడా విమర్శలు చేస్తూ ఈ ఎన్నికను ఒక రకంగా ప్రజాభిప్రాయ సేకరణగా చూపించే ప్రయత్నం చేశారు.
బీజేపీ, ఆర్జేడీ ఓటు బ్యాంకుల్లో చీలిక
ప్రశాంత్ కిశోర్ విజయానికి మరో ముఖ్య కారణం ప్రధాన పార్టీల సంప్రదాయ ఓటు బ్యాంకుల్లో ఏర్పడిన చీలికగా కనిపిస్తోంది. బీజేపీకి మద్ధతుగా ఉండే వర్గాల్లో కొంత భాగం ఈసారి ప్రశాంత్ కిశోర్ వైపు మళ్లినట్లు అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఆర్జేడీకి సంప్రదాయంగా మద్ధతుగా ఉండే ముస్లిం-యాదవ్ ఓటర్లలోనూ కొంతమంది జన సురాజ్ వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీని ఓడించగల అభ్యర్థి ప్రశాంత్ కిశోరే అని భావించిన కొంతమంది ముస్లిం ఓటర్లు ఆయనకు మద్ధతు ఇచ్చినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. కాయస్థ సామాజిక వర్గం మాత్రం బీజేపీకి గట్టిగా అండగా నిలిచినప్పటికీ, ఇతర అగ్రవర్ణాలు, ఓబీసీ వర్గాల్లో కొంతమంది ఓటర్లు ప్రశాంత్ కిశోర్కు మద్ధతు ఇవ్వడం బీజేపీకి నష్టం కలిగించిందని భావిస్తున్నారు.
విద్య, ఉద్యోగాలపై ప్రచారం
బీహార్ ఎన్నికల్లో సాధారణంగా కులం, మతం వంటి అంశాలు కీలకంగా మారుతుంటాయి. అయితే ప్రశాంత్ కిశోర్ తన ప్రచారాన్ని వాటి చుట్టూ తిప్పకుండా ప్రజలకు నేరుగా సంబంధించిన సమస్యలపై దృష్టి పెట్టారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సమస్యలు, పౌర సదుపాయాలు వంటి అంశాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. బాంకీపూర్ ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటిపై మాట్లాడారు. దీంతో సంప్రదాయ రాజకీయ అంశాలకు భిన్నంగా తన ప్రచారాన్ని తీసుకెళ్లగలిగారు.
జన సురాజ్ పక్కా గ్రౌండ్ వర్క్..
ప్రశాంత్ కిశోర్ ప్రచార వ్యూహం కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా పనిచేసింది. భారీ బహిరంగ సభలకే పరిమితం కాకుండా స్థానికంగా చిన్న సమావేశాలు, ప్రజలతో నేరుగా మమేకం కావడంపై జన సురాజ్ పార్టీ ఎక్కువగా దృష్టి పెట్టింది. పార్టీ కార్యకర్తలు ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ స్థానిక సమస్యలను ప్రస్తావించారు. బాంకీపూర్లో డ్రెయినేజీ వంటి స్థానిక సమస్యలపై జన సురాజ్ కార్యకర్తలు స్వయంగా పనిచేసిన ఘటనలు కూడా ప్రచారంలో కనిపించాయి. దీంతో ప్రజలకు దగ్గరగా ఉండే పార్టీగా తమను చూపించుకునే ప్రయత్నం చేశారు.
19 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ప్రశాంత్ కిశోర్ విజయం
బాంకీపూర్ ఉపఎన్నికలో ప్రశాంత్ కిశోర్ 64,151 ఓట్లు సాధించి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాకు 44,827 ఓట్లు వచ్చాయి. ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 14,273 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. మొత్తంగా ప్రశాంత్ కిశోర్ 19 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రశాంత్ కిశోర్ ఈ విజయాన్ని బీహార్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారనే సంకేతంగా అభివర్ణిస్తున్నారు. జన సురాజ్ పార్టీకి ఇది కేవలం ఒక ఉపఎన్నిక విజయం మాత్రమే కాకుండా, బీహార్ రాజకీయాల్లో తన ప్రభావాన్ని పెంచుకునేందుకు కీలకమైన ముందడుగుగా మారింది.

