- Home
- National
- PM Modi: ప్రధాని మోదీ వీడియోను డిలీట్ చేసిన ఫేస్బుక్.. స్పందించిన మెటా, అసలేం జరిగిందంటే?
PM Modi: ప్రధాని మోదీ వీడియోను డిలీట్ చేసిన ఫేస్బుక్.. స్పందించిన మెటా, అసలేం జరిగిందంటే?
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో కొద్దిసేపు కనిపించకుండా పోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై సోషల్ మీడియా దిగ్గజం మెటా స్పందిస్తూ వినియోగదారులకు, కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది.

వీడియో కనిపించకపోవడంతో మొదలైన చర్చ
నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశంపై విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ యువతను ఉద్దేశించి ఒక సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. జెన్ జీ స్టైల్లో రూపొందించిన ఆ వీడియోలో పరీక్షల పారదర్శకత, పేపర్ లీక్లపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అయితే ఆ వీడియో కొంతసేపు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అందుబాటులో లేకపోవడంతో సోషల్ మీడియాలో విస్తృత చర్చ మొదలైంది.
స్పందించిన మెటా..
వీడియో కనిపించకుండా పోవడంపై మెటా అధికారిక ప్రకటన విడుదల చేసింది. సాంకేతిక సమస్య కారణంగా వీడియో అనుకోకుండా డిలీట్ అయ్యింది, ఇందులో ఎలాంటి ఉద్దేశపూర్వక నిర్ణయం లేదని వెల్లడించింది. సమస్యను గుర్తించిన వెంటనే కంటెంట్ను పునరుద్ధరించామని, ఈ ఘటనపై చింతిస్తున్నామని సంస్థ ప్రతినిధి తెలిపారు. వీడియోను ప్రస్తుతం యథావిధిగా చూడొచ్చని కూడా స్పష్టం చేశారు.
'చట్టపరమైన పరిమితి' సందేశంపై కూడా వివరణ
వీడియోను ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన కొంతమంది యూజర్లకు కొద్దిసేపు 'చట్టపరమైన అభ్యర్థన మేరకు ఈ కంటెంట్ పరిమితం చేయడం జరిగింది' అనే సందేశం కనిపించింది. దీనిపై కూడా మెటా స్పందించింది. ఆ సందేశం కూడా సాంకేతిక లోపం కారణంగానే వచ్చిందని, ఎలాంటి ప్రభుత్వ ఆదేశాల మేరకు వీడియోను నిలిపివేయలేదని సంస్థ వివరణ ఇచ్చింది. సమస్యను సరిచేసిన తర్వాత ఆ సందేశాన్ని కూడా తొలగించినట్లు తెలిపింది.
కేంద్రం సీరియస్.. మెటా అధికారులకు సమన్లు
ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. వీడియోను తాత్కాలికంగా తొలగించడానికి గల కారణాలపై పూర్తి వివరణ కోరుతూ సమాచార సాంకేతిక శాఖ మెటా, ఇన్స్టాగ్రామ్కు చెందిన ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకునే చర్యలపై కూడా కేంద్రం వివరణ కోరనున్నట్లు సమాచారం.
ఇంతకీ వీడియోలో ఏముంది?
జులై 23న అప్లోడ్ చేసిన ఈ వీడియోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యంగా నీట్ ప్రశ్నపత్రం లీక్లపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, పరీక్షల వ్యవస్థను మరింత పారదర్శకంగా, సాంకేతికంగా భద్రంగా మార్చేందుకు సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు. వీడియో తాత్కాలికంగా కనిపించకుండా పోయినా, ప్రస్తుతం మళ్లీ యూజర్లందరికీ అందుబాటులో ఉంది. మెటా క్షమాపణతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడినప్పటికీ, ఘటనపై కేంద్ర ప్రభుత్వ పరిశీలన కొనసాగుతోంది.

