- Home
- National
- Supreme Court On Protests: పోలీసు లాఠీలకు సుప్రీం బ్రేక్.. ఆందోళనలు చేస్తే కొడతారా?.. సీజేఐ సూర్యకాంత్
Supreme Court On Protests: పోలీసు లాఠీలకు సుప్రీం బ్రేక్.. ఆందోళనలు చేస్తే కొడతారా?.. సీజేఐ సూర్యకాంత్
Supreme Court On NEET Protests: ప్రశాంతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ఇచ్చింది, కేవలం ధర్నా చేస్తున్నంత మాత్రాన లాఠీఛార్జ్ చేయకూడదని సీజేఐ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ నిరసనకారులపై పోలీసుల లాఠీఛార్జ్పై విచారణలో సీజేఐ ఈ కామెంట్స్ చేశారు.

అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు.. నీట్ వివాదంలో నిరసనల పై సుప్రీంకోర్టు
శాంతియుతంగా, చట్టబద్ధంగా నిరసనలు తెలిపే హక్కును భారత రాజ్యాంగం పౌరులందరికీ కల్పించిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం ధర్నాలు లేదా నిరసనలు చేస్తున్నారనే కారణంతో పోలీసులు వారి అధికార పరిధిని దాటి లాఠీఛార్జ్ చేయడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనల సందర్భంగా పోలీసులు ప్రయోగించిన బలప్రయోగంపై దాఖలైన పిటిషన్లను సోమవారం (జూలై 27న) సుప్రీంకోర్టు విచారించింది.
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. నిరసనకారులపై పోలీసులు మితిమీరి ప్రవర్తించారని వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.
ప్రశాంతమైన నిరసనలు రాజ్యాంగబద్ధమైన హక్కు: సీజేఐ
విచారణ సమయంలో సీజేఐ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. "శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు మన రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. ఎంతవరకు అయితే నిరసనలు శాంతియుతంగా జరుగుతాయో, అంతవరకు కేవలం ఆందోళనలు చేస్తున్నారనే ఒకే ఒక్క కారణంతో లాఠీఛార్జ్ చేయడానికి వీలులేదు. ఒకవేళ పోలీసులు పరిమితులు దాటి ప్రవర్తించి ఉంటే, దానిపై కచ్చితంగా స్వతంత్ర విచారణ జరగాలి. ఇది కేవలం ఒక్క ఢిల్లీకి మాత్రమే సంబంధించిన అంశం కాదు. దేశవ్యాప్తంగా నిరసనలను నియంత్రించడానికి ఒకే రకమైన ఏకరూప ప్రోటోకాల్ ఉండాలి" అని సీజేఐ పేర్కొన్నారు.
జంతర్ మంతర్ వద్ద అసలేం జరిగింది?
జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతృత్వంలో 'సంసద్ ఛలో' మార్చ్ నిర్వహించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యారంగ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు, యువత డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు యత్నించిన నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో దాదాపు 60 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారని, విద్యార్థినుల పట్ల పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
గాయపడిన పోలీసుల కుటుంబాల వైపు నుంచీ పిటిషన్
మరోవైపు, ఈ ఆందోళనల్లో నిరసనకారుల దాడిలో గాయపడిన పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి తరఫున లాయర్ వాదనలు వినిపించేందుకు కోర్టు అనుమతించింది. దీనిపై జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ స్పందిస్తూ.. "గాయపడిన వ్యక్తి విద్యార్థి అయినా, పోలీస్ అధికారి అయినా మాకు ఇద్దరి ప్రాణాలు, ఆరోగ్యం సమానమే. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీసులకు హెల్మెట్లు వంటి తగిన రక్షణ పరికరాలను ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదో వివరిస్తూ రిపోర్టు కోరతాం" అని తెలిపారు.
పిటిషనర్ల డిమాండ్లు ఇవే
అడ్వకేట్ శైలేంద్ర మణి త్రిపాఠితో పాటు మరో లాయర్ చంద్ ఖురేషి దాఖలు చేసిన ఈ పిటిషన్లలో పలు కీలక డిమాండ్లు చేశారు. శాంతియుత నిరసనలు తెలిపే పౌరులపై సివిల్ దుస్తుల్లో వచ్చే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని, BNSS సెక్షన్ 163 (పాత CrPC సెక్షన్ 144) ను నిరంతరం అమలు చేయడాన్ని నియంత్రించాలని కోరారు. జూలై 20న జరిగిన హింసను 1919 నాటి జలియన్ వాలాబాగ్ దురంతంతో పోల్చారు. ఈ ఘటనపై రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జితో స్వతంత్ర కమిటీ వేసి సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
రేపటికి వాయిదా
ఇదే వ్యవహారంలో జూలై 22న సీజేఐ చేసిన కొన్ని మౌఖిక వ్యాఖ్యలపై విమర్శలు వచ్చినప్పటికీ, సరైన దాఖలాలు లేనందునే అప్పట్లో విచారణకు తీసుకోలేదని, ప్రస్తుతం పూర్తి సమాచారంతో పిటిషన్లు దాఖలైనందున బాధ్యతతో విచారిస్తున్నామని సీజేఐ తెలిపారు. ఈ కేసులన్నింటినీ కలిపి జూలై 28, మంగళవారం రోజున సమగ్రంగా విచారిస్తామని ధర్మాసనం వెల్లడించింది.
'కాక్రోచ్ జనతా పార్టీ' నేపథ్యం ఏంటి?
ఈ నిరసనలకు నాయకత్వం వహించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఆవిర్భావం వెనుక కూడా ఒక వివాదాస్పద అంశం ఉంది. గతంలో మే 15న సీజేఐ సూర్య కాంత్ ఒక విచారణ సందర్భంగా "ఉద్యోగాలు లేక, ఉపాధి దొరకక బొద్దింకల లా తిరిగే యువత ఉంది" అని వ్యాఖ్యానించారనే ప్రచారం జరిగింది. దానిని వ్యతిరేకిస్తూ యువత ఈ పార్టీ పేరుతో నిరసనలు చేపట్టారు. అయితే, ఆ తర్వాత రోజు మే 16నే సీజేఐ స్పందిస్తూ, తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా చిత్రీకరించిందని, నకిలీ డిగ్రీలతో న్యాయవాద వృత్తిలోకి, మీడియాలోకి వచ్చిన పరాన్నజీవులను ఉద్దేశించి మాత్రమే తాను మాట్లాడానని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ, నిరుద్యోగం, పేపర్ లీకేజీలపై ఆగ్రహంతో ఉన్న యువత ఈ ఆందోళనను ముందుకు తీసుకెళ్లారు.

