పీఎం కిసాన్: అకౌంట్లలోకి రూ. 2 వేలు.. వెంటనే ఇలా చేయండి
PM Kisan Update: పీఎం కిసాన్ పథకంలో అర్హత లేని లక్షల మంది రైతుల పేర్లు కేంద్రం తొలగించింది. భౌతిక పరిశీలన అనంతరం అర్హులైన వారి పేర్లు తిరిగి చేర్చనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలోనే 21వ విడత డబ్బులు అకౌంట్లలో వేయనుంది.

పీఎం కిసాన్ : అర్హత లేని రైతులపై కేంద్రం చర్యలు
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో అర్హత లేని రైతులు పెద్ద ఎత్తున నమోదు చేసుకున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అధికారిక వెబ్సైట్లో విడుదల చేసిన ప్రకటనలో.. పథక మార్గదర్శకాల ప్రకారం అర్హత లేని వ్యక్తులు కూడా లబ్ధిదారులుగా నమోదు కావడం ద్వారా పథకం ఉద్దేశ్యానికి విరుద్ధంగా వ్యవహరించారని గుర్తించామని ప్రభుత్వం పేర్కొంది.
ఈ క్రమంలో, దేశవ్యాప్తంగా లక్షలాది దరఖాస్తులు అనుమానాస్పదంగా గుర్తించారు. ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమిని కొనుగోలు చేసినవారు లేదా ఒకే కుటుంబంలోని అనేక మంది (భర్త, భార్య, పెద్దలు, మైనర్లు మొదలైనవారు) ఒకేసారి పథకం ప్రయోజనం పొందడం చట్ట విరుద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పేర్ల తొలగింపు తాత్కాలికం మాత్రమే
లబ్ధిదారుల జాబితా నుండి పేర్లు తొలగింపునకు గురైన రైతులు శాశ్వతంగా తొలగించలేదని ప్రభుత్వం వెల్లడించింది. భౌతిక పరిశీలన అనంతరం అర్హులైన రైతుల పేర్లు తిరిగి జాబితాలో చేర్చనున్నట్టు స్పష్టం చేసింది.
ఇదే సమయంలో, అర్హత లేని రైతులు తిరిగి లిస్టులోకి రాకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే తదుపరి విడత నిధులు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది.
పీఎం కిసాన్ ఈకేవైసీని చెక్ చేసుకోండి
కేంద్రం తెలిపిన మార్గదర్శకాల ప్రకారం, పీఎం కిసాన్ పథకం కింద డబ్బు పొందుతున్న రైతులు తమ అర్హతను తప్పక ధృవీకరించుకోవాలి. వెంటనే ఈకేవైసీని పూర్తి చేయాలి. దీని కోసం..
• పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.inలో ‘Eligibility Status’ విభాగంలో తమ అర్హతను చెక్ చేసుకోవచ్చు.
• తమ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి ‘Know Your Status (KYS)’ విభాగాన్ని ఉపయోగించవచ్చు.
• ఈ వివరాలు మొబైల్ యాప్ లేదా కిసాన్ మిత్ర చాట్బాట్ ద్వారా కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇటీవల దేశవ్యాప్తంగా 35,44,213 మంది రైతుల పేర్లు పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా నుండి తొలగించారు. అర్హత ఉన్న రైతులు తక్షణమే అవసరమైన పత్రాలతో తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
పీఎం కిసాన్ 21వ విడత చెల్లింపులు ఎప్పుడు?
ప్రస్తుతం పీఎం కిసాన్ 21వ విడత నిధులు విడుదల కాలేదు. అధికారికంగా తేదీని కూడా ప్రభుత్వం ప్రకటించలేదు.
కొన్ని మీడియా కథనాలు ఏడాదికి రూ.9,000 చెల్లింపుగా పెంచవచ్చని పేర్కొన్నా, ఇవి అధికారికంగా ధృవీకరించలేదు.
ప్రస్తుతం ప్రభుత్వ దృష్టి అర్హత లేని పేర్లను తొలగించడంపైనే ఉందని, అన్ని ధృవీకరణలు పూర్తైన తర్వాతే నిధులు విడుదల చేయనున్నట్లు కేంద్ర అధికారులు వెల్లడించారు. అంచనా ప్రకారం సుమారు 50 లక్షల మంది రైతులు అర్హత కోల్పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ పథకం కింద సహాయం పొందుతున్నారు.
పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఇలా చేయండి.. e-KYC తప్పనిసరి
పీఎం కిసాన్ 21వ విడత డబ్బులు పొందాలంటే e-KYC తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది.
OTP ఆధారిత e-KYC ప్రక్రియయను ఇలా పూర్తి చేయండి..
1. pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్లండి.
2. పై భాగంలో ఉన్న ‘e-KYC’ ఆప్షన్పై క్లిక్ చేయండి.
3. ఆధార్ నంబర్ ఇవ్వండి.
4. మీ ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్కి OTP వస్తుంది.
5. దాన్ని ఎంటర్ చేసి ధృవీకరించగానే e-KYC పూర్తవుతుంది.
ముఖ గుర్తింపు (Face Authentication) పద్ధతి
• PM-KISAN Mobile App, Aadhaar Face RD App డౌన్లోడ్ చేసుకుని, మొబైల్ ద్వారా e-KYC పూర్తి చేయవచ్చు.
• ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ముఖాన్ని స్కాన్ చేసిన వెంటనే ప్రక్రియ పూర్తవుతుంది.
e-KYC పూర్తి చేయని రైతులకు పీఎం కిసాన్ నిధులు రావని ప్రభుత్వం తెలిపింది.
పీఎం కిసాన్: అర్హత కలిగిన రైతులకు అలర్ట్
అర్హులైన రైతుల పేర్లు పొరపాటున తొలగించి ఉంటే, వారు తక్షణమే తిరిగి దరఖాస్తు చేయాలని ప్రభుత్వం సూచించింది.
భవిష్యత్తులో చెల్లింపుల ఆలస్యం లేకుండా ఉండాలంటే రైతులు తమ వివరాలను సక్రమంగా నవీకరించుకోవాలి. పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా ప్రతి విడత విడుదలకు ముందు సవరించనున్నట్టు అధికారులు తెలిపారు.
ప్రభుత్వం సూచనల ప్రకారం.. రైతులు ఆధార్ లింక్, భూమి రికార్డులు, బ్యాంకు వివరాలు సరిచూసుకోవడం అత్యవసరం. అర్హత లేని వారి పేర్లు తొలగించడమే కాకుండా, అర్హులైన వారికి తగిన సహాయం అందించడమే కేంద్ర లక్ష్యం అని పేర్కొంది.