- Home
- National
- Passport Fees : ఫారిన్ ట్రిప్స్ కు వెళ్లేవారికి కేంద్రం షాక్..14 ఏళ్ల తర్వాత పాస్ పోర్ట్ ఫీజు పెంచుతూ నిర్ణయం
Passport Fees : ఫారిన్ ట్రిప్స్ కు వెళ్లేవారికి కేంద్రం షాక్..14 ఏళ్ల తర్వాత పాస్ పోర్ట్ ఫీజు పెంచుతూ నిర్ణయం
PassPort Fees: ఫారిన్ ట్రిప్స్ కు వెళ్లేవారికి, విదేశాలకు వెళ్లాలని కలలు కనేవారికి కేంద్రం షాకిచ్చింది. 14 ఏళ్ల తర్వాత పాస్ పోర్టు ఫీజులు భారీగా పెంచింది. దీనివల్ల అదనపు భారం పడనుంది. కొత్త పాస్ పోర్ట్ కు ఎంత చెల్లించాలి? ఫీజు పెంచడానికి కారణమేంటి?

ఫారిన్ ట్రిప్స్ కు వెళ్లేవారికి కేంద్రం షాక్
ఫారిన్ ట్రిప్స్ కు వెళ్లేవారికి, విదేశాలకు వెళ్లాలని కలలు కనేవారికి కేంద్రం షాకిచ్చింది. 14 ఏళ్ల తర్వాత పాస్ పోర్టు ఫీజులు భారీగా పెంచింది. పాస్ పోర్ట్ సేవలకయ్యే వ్యయం, నాణ్యత, ఆధునిక సాంకేతికత అమలు వంటి అంశాలను సమీక్షించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్...లోక్సభకు లిఖితపూర్వకంగా తెలిపారు.
పాస్పోర్ట్ రూల్స్-1980 సవరణ
ప్రభుత్వం ఇటీవల పాస్పోర్ట్ రూల్స్-1980లో సవరణలు చేసి కొత్త ఫీజులను అమల్లోకి తీసుకొచ్చింది. 2026 జూలై 1 నుంచి ఈ కొత్త ఫీజు విధానం అమలులోకి వచ్చింది. దీని ప్రకారం 36 పేజీల కొత్త పాస్పోర్ట్ కోసం దరఖాస్తు ఫీజును రూ.1,500 నుంచి రూ.2,500కు పెంచింది. అంటే దాదాపు 67 శాతం పెరిగింది.
ఖర్చులు పెరుగుతున్నాయనే ఈ నిర్ణయం
లోక్సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ.. గత 14 ఏళ్లలో పాస్పోర్ట్ సేవలకు అవసరమైన వివిధ ఖర్చులు పెరిగాయని చెప్పారు. సిబ్బంది నిర్వహణ, సాంకేతిక మౌలిక వసతులు, భద్రతా ప్రమాణాలు, సేవల విస్తరణ వంటి అంశాల కారణంగా సేవల నిర్వహణ ఖర్చు పెరిగిందని, అందుకే ఫీజులను సవరించాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అప్గ్రేడ్ చేసిన పాస్పోర్ట్ సేవా కార్యక్రమం (Passport Seva Programme 2.0)తో పాటు ఈ-పాస్పోర్ట్ వ్యవస్థను కూడా అమలు చేస్తోంది. ఈ కొత్త సాంకేతికతతో పాస్పోర్ట్ సేవల భద్రత, నాణ్యత, వేగం మెరుగుపడినప్పటికీ, సేవల నిర్వహణ వ్యయం కూడా పెరిగిందని కేంద్రం పేర్కొంది.
ఇప్పటికే ఐదుసార్లు పెంచిన కేంద్రం
భారత్లో పాస్పోర్ట్ ఫీజులు గతంలో కూడా చాలా సందర్భాల్లో సవరించారు. 1971, 1980, 1993, 2002, 2012 సంవత్సరాల్లో ఫీజులు పెంచగా, తాజాగా 2026లో మరోసారి సవరణలు చేశారు. గత పెంపులను పరిశీలిస్తే, 1971లో నాలుగేళ్ల వ్యవధిలో 67 శాతం, 1980లో తొమ్మిదేళ్లలో 100 శాతం, 1993లో 13 ఏళ్లలో 500 శాతం, 2002లో తొమ్మిదేళ్లలో 233 శాతం, 2012లో పదేళ్లలో 50 శాతం మేర ఫీజులు పెంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
అలాగే పాస్పోర్ట్ చట్టం-1967లోని సెక్షన్ 5(1), పాస్పోర్ట్ రూల్స్-1980లోని రూల్ 8 ప్రకారం పాస్పోర్ట్ దరఖాస్తుతో పాటు నిర్దేశిత ఫీజు చెల్లించడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త ఫీజుల అమలుతో పాస్పోర్ట్ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, సాధారణ ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

